తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ సర్కిళ్లలో చాలా రోజులుగా బాగా వైరల్గా మారిపోయిన వైఎస్ షర్మిల కొత్త పార్టీకి సంబంధించి మంగళవారం నాడు ఓ క్లారిటీ వచ్చింది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్తో సంబంధం లేకుండానే ఆయన ఒక్కగానొక్క సోదరి వైఎస్ షర్మిల.. తెలంగాణ యవనికపై కొత్త పార్టీకి తెర లేపుతున్నారు. ఇందులో నల్లగొండ జిల్లాకు చెందిన తన శ్రేయోభిలాషులతో భేటీ అంటూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన షర్మిల… తన మనసులోని మాటను బయటపెట్టేశారు. తెలంగాణలో తాను కొత్త పార్టీ పెడుతున్నానని, దానికి సంబంధించి త్వరలోనే మరిన్ని సంగతులు చెబుతానంటూ ఆమె ఒకింత ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. షర్మిల కొత్త పార్టీపై జగన్ అండ్ కో ఆచితూచి వ్యవహరించిన తీరు కూడా ఆసక్తికరమేనని చెప్పాలి. మొత్తంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న షర్మిల… తన పార్టీతో తన అన్న పార్టీకి ఎలాంటి సంబంధం ఉండబోదంటూ తన అనుయాయులతో ప్రకటనలు చేయించి మరింత ఆసక్తి రేకెత్తించారు. ఈ క్రమంలో అసలు షర్మిల ప్లాన్ ఏంటి? ఆమె పార్టీతో నిజంగానే జగన్ పార్టీకి లింకేమీ ఉండదా? షర్మిల పార్టీ వెనుక ఉన్నదెవరు? అసలు తన సొంత రాష్ట్రం ఏపీని వదిలేసి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం వెనుక వ్యూహం ఏమిటి? షర్మిల పార్టీతో నష్టం టీఆర్ఎస్కా? లేదంటే బీజేపీకా?… ఇలా ఎన్నెన్నో అంశాలపై లెక్కలేనన్ని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ మొత్తం విశ్లేషణలను చూస్తే.. ఇప్పటి దాకా చోటుచేసుకున్న అంశాలతో వాటిని ముడిపెట్టి చూస్తే… మూడు రకాల ఈక్వేషన్లు మాత్రం కనిపిస్తున్నాయి. అవేంటన్నది ఇప్పుడు చూద్దాం…
కమలనాథుల ప్లాన్ అయితే ఇలా..
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యం ఏమీ లేకున్నా.. ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీకి అంతగా గుర్తింపు లేదు. ఇప్పుడిప్పుడే జెట్ స్పీడుతో దూసుకు వస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఏదో సాధించేస్తామన్న కలరింగ్తో సాగుతోంది. అందుకోసం టీఆర్ఎస్ను బలహీనం చేయాలి. టీఆర్ఎస్లోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలను పక్కకు లాగేయాలి. ఆ పని తనతో కాదని బీజేపీకి తెలిసిపోయింది. ఇంకేం చేయాలని ఆలోచించిన కమలనాథులు… ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీతో పావులు కదిపింది. తెలంగాణలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై వీరాభిమానమున్న వారిని పోలరైజ్ చేస్తూ జగన్ తన సోదరి షర్మిలతో కొత్త పార్టీని ప్రారంభిస్తే సరిపోతుంది కదా అని కమలనాథులు ఆలోచించారట. ఇదే విషయాన్ని జగన్తో చర్చించగా… బీజేపీతో తనకున్న అవసరం రీత్యా జగన్ కూడా అందుకు సరేనని తన సోదరిని రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని విభేదాలున్న నేపథ్యంలో జగన్ పార్టీతో సంబంధం లేకుండానే షర్మిల వ్యవహరిస్తేనే తమ పథకం పారుతుందన్నది కూడా కమలనాథుల భావనగా తెలుస్తోంది. బీజేపీ నుంచి ఈ ప్రతిపాదన రాగానే… జగన్, షర్మిల గుట్టుచప్పుడు కాకుండానే ఆ ప్లాన్ను అమలు చేసే పనిలో పడ్డారు. బయటకు మాత్రం ఎవరికి వారే అన్నట్లుగానే సాగుతున్నా… వెనుక బీజేపీ సహకారంతో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కలిసే సాగుతున్నారన్నది ఈ ఈక్వేషన్ సారాంశం. ఈ ప్లాన్తో టీఆర్ఎస్లోని జగన్ సామాజిక వర్గం మొత్తం గంపగుత్తగా షర్మిల వద్దకు చేరుతుందన్నది బీజేపీ భావన. అంతేకాకుండా ఎన్నికల్లో వైఎస్ అభిమాన ఓట్లన్నీ షర్మిల వైపు మరలడం ఖాయమని, వెరసి టీఆర్ఎస్ మట్టి కరవడమూ ఖాయమేనని, ఆ గ్యాప్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనీ బీజేపీ నేతలు బలంగా లెక్కలేసుకుంటున్నారట.
Must Read ;- షర్మిల ‘సొంత పార్టీ’ ఇష్యూ.. లీక్ చేసింది ‘ఆయనే’!
టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకేనా..
ఇక రెండో ఈక్వేషన్ విషయానికి వస్తే… జగన్తో తనకున్న దోస్తానాతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే స్వయంగా షర్మిల పార్టీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారని మరో రకమైన విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో బీజేపీ దూసుకుపోయింది. ఇదే దూకుడు కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ తనకు ఏకు మేకై కూర్చుంటుందని కూడా కేసీఆర్ భయపడిపోతున్నారు. మరి బీజేపీ దూకుడుకు పగ్గాలు వేయడంతో పాటుగా తనపై పెరుగుతున్న వ్యతిరేకతను, ఆ ఫలితంగా విపక్షాలకు వెళ్లే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేదెలా? అన్న దిశగా ఆలోచించిన కేసీఆర్కు షర్మిలే కనిపించిందట. ఇంకేముంది… ఎలాగూ జగన్తో తనకు జిగిరీ దోస్తానా ఉందాయే. అనుకున్నదే తడవుగా జగన్తో రహస్యంగా చర్చలు జరిపిన కేసీఆర్… తెలంగాణలో తన రక్షణ కోసం షర్మిలను రంగంలోకి దించేలాగా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇదే జరిగితే… అటు కాంగ్రెస్ను ఇంకా అంటిపెట్టుకుని ఉన్న రెడ్లు షర్మిల పార్టీలోకి వెళ్లడం, బీజేపీ వైపు వెళ్లానుకుంటున్న చాలా మంది కూడా షర్మిల వైపుకే మళ్లుతారన్నది కేసీఆర్ భావన. వెరసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో షర్మిల పార్టీ బాగానే పనిచేస్తుందన్నది కేసీఆర్ నమ్మకం. అయితే, తనకేమాత్రం తెలియకుండా తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతుందా? అన్న దిశగా విపక్షాలు తనను అనుమానించకుండా ఉండేలా… మొన్నటి పార్టీ కీలక భేటీలో కొత్త పార్టీల మనుగడపై కేసీఆర్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా కేసీఆర్ కోటరీయే కొన్ని మీడియా సంస్థలకు లీకులిచ్చి మరీ షర్మిల పార్టీపై కథనాలు రాయించిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ప్రశాంత్ కిశోర్ సూచన మేరకేనా..?
చివరగా మూడో ఈక్వేషన్ విషయానికి వస్తే.. షర్మిల పార్టీ వెనుక అటు బీజేపీ ఉన్నా, ఇటు టీఆర్ఎస్ ఉన్నా… జగన్, షర్మిలలు మాత్రం తమదైన కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నట్లుగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. బీజేపీ ప్రోద్బలంతో పార్టీ పెట్టినా, లేదంటే కేసీఆర్ ప్రోత్సాహంతో పార్టీ పెట్టినా… తెలంగాణలో తమ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను తమ వైపు తిప్పుకోవడంతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అటు టీఆర్ఎస్ గానీ, ఇటు బీజేపీగానీ ఊహించని రీతిలో తాము బలపడాలని అన్నాచెల్లెళ్లు భావిస్తున్నారట. ఇందులో భాగంగానే… జనవరి 8వ తేదీన ప్రశాంత్ కిశోర్ ప్రత్యేక విమానంలో వచ్చి అమరావతిలో వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారట. ఆ సందర్భంగానే షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు మీద చర్చించారట. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఉన్న అభిమానులు, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు, కొత్త పార్టీ పెడితే ఎంతవరకు నెగ్గుకు రావొచ్చు? దానికి తామేం చేయాలనే అంశాలను ప్రశాంత్ కిశోర్తో వారు చర్చించినట్లుగా సమాచారం. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగొచ్చని భావిస్తున్నారు. ఆ ఎన్నికలు పూర్తి కాగానే ప్రశాంత్ కిశోర్ తెలంగాణకు వచ్చేస్తారని, షర్మిల కోసం పని చేస్తారని తెలుస్తోంది. అన్న పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని షర్మిల తన అనుచరులతో చెప్పిస్తున్నా, చెల్లి పార్టీతో తమకు సంబంధం లేదని జగన్ అనుయాయులు చెబుతున్నా… తెర వెనుక మాత్రం భారీ కసరత్తే జరుగుతోందని తెలుస్తోంది. మరి ఈ మూడు ఈక్వేషన్లలో ఏ ఈక్వేషన్ కరెక్టో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read ;- షర్మిలతో రాజన్న రాజ్యం సాధ్యమా?
రిజిస్ట్రేషన్ చర్యలు మొదలు
షర్మిల పార్టీ పేరు వైఎస్ఆర్ టీపీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) అని, దాని రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే షర్మిల వైపు నుంచి చర్యలు మొదలయ్యాయయని, ఇప్పటికే ఆమె ఈ ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘానికి చేరవేశారని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తన పార్టీ గుర్తుగా బాణంను కేటాయించే అంశాన్ని కూడా పరిశీలించాలని కూడా షర్మిల ఈసీని కోరినట్లుగా తాజా సమాచారం. అప్పుడెప్పుడో జగన్ జైల్లో ఉండగా.. అన్న మాట ప్రకారం సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన షర్మిల… తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే కదా. జనాలతో బాగా కనెక్ట్ అయిన ఆ పాపులర్ డైలాగ్లోని బాణాన్నే తన కొత్త పార్టీకి గుర్తుగా ఇవ్వాలని షర్మిల కోరుతున్నట్లుగా వార్తలు వినిపిస్తుండటం నిజంగానే ఆసక్తికరమే కదా.