Who Is Responsible For Anakapalle Accident :
విశాఖ జిల్లా అనకాపల్లిలో మంగళవారం చోటుచేసుకున్న ఫ్లై ఓవర్ బీమ్ కూలిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. భారీ ప్రమాదాలతో పోలిస్తే.. ప్రాణ నష్టం అతి తక్కువగానే కనిపిస్తున్న ఈ ప్రమాదం యంత్రాంగంలోని అచ్చోసిన నిర్లక్ష్యానికి అద్దం పడుతోందనే చెప్పాలి. రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే.. అటుగా వాహనాలు వెళ్లకుండా డైవర్షన్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్న వాదనలు కలకలం రేపుతున్నాయి. ఈ రహదారి పనులను జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పర్యవేక్షిస్తుండగా.. దిలీప్ బిల్డ్ కాన్ అనే సంస్థ చేపడుతోంది. ఏపీలో కొనసాగుతున్న ఈ పనులకు సంబంధించి తమకేమీ బాధ్యత లేదని జగన్ సర్కారు చేతులు దులుపుకునేందుకు కూడా అవకాశం లేదనే చెప్పాలి. కదులుతున్న ఓ కారు, మరో ట్యాంకర్ పై పై నుంచి బీమ్ పడిపోయిందంటే.. ఈ ప్రమాదంలో ఏ మేర నిర్లక్ష్యం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
డైవర్షన్ లేకుండా పనులెలా?
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్ పనులను దిలీప్ బిల్డ్ కాన్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులు ఎన్హెచ్ఏఐ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు నడుస్తున్నట్లే లెక్క. అయితే ఏపీ పరిధిలో కొనసాగుతున్న పనులపై ఏపీ ప్రభుత్వం కూడా ఓ కన్నేసి ఉంచాల్సిందే కదా. ఇదంతా బాగానే ఉన్నా.. అసలు ఫ్లై ఓవర్ పనులు చేపట్టేందుకు అర్హత కలిగిన కంపెనీకే టెండర్ దక్కి ఉంటుంది. పనుల్లో భాగంగా ఆ సంస్థ ఎంత వీలయితే అంత తక్కువ ఖర్చుతోనే పనులు ముగించాలని భావించడం కూడా సాధారణమే. అయితే.. చిన్న పనులు జరుగుతున్నా.. వాహనాల రాకపోకలకు డైవర్షన్ ఇచ్చే అధికార యంత్రాంగం.. ఓ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో డైవర్షన్ ఎందుకు ఇవ్వలేదన్నదే అసలు సిసలు ప్రశ్నగా మారింది.
ఆ మూడూ బాధ్యులే..
వాహనాల డైవర్షన్ ఏర్పాటు చేసి ఉంటే.. ఒకటి కాదు ఏకంగా పైన అమర్చిన బీమ్ లు మొత్తం కూలినా పెద్దగా నష్టం ఉండేది కాదు. కారణం ఏదైనా బీమ్ లు పడిపోతే.. అలా నేలపై పడిపోయేవి. అలా కాకుండా ఇంత మేర భారీ బరువు కలిగిన బీమ్ లను అమరుస్తున్న ప్రాంతంలో డైవర్షన్ అన్నదే లేకుండా పనులు నిర్వహించిన దిలీప్ బిల్డ్ కాన్, పనులు పర్యవేక్షిస్తున్న ఎన్హెచ్ ఏఐ, ఆ పనులపై ఓ కన్నేసి ఉంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. మొత్తంగా ఈ మూడూ ప్రమాదానికి బాధ్యులే కదా. ఇదే విషయంపై పెద్ద చర్చే నడుస్తోంది. రహదారులపై ఏ చిన్న పని జరుగుతున్నా.. డైవర్షన్ ఇస్తుండగా.. ఇక్కడ మాత్రం పనులు కొనసాగుతున్న ప్రాంతం మీదుగా వాహనాల రాకపోకలకు ఎలా అనుమతిచ్చారన్నదే మిస్టరీగా మారింది.
తక్షణ స్పందనేదీ?
ప్రమాదం మంగళవారం సాయంత్రం జరిగితే.. బుధవారం ఉదయానికి కూడా ఎన్హెచ్ఏఐ నుంచి సమాధానమే లేదట. ఇక ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటీన అక్కడికి వెళ్లిన టీడీపీ నేత పీలా గోవింద నాయుడు ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత గానీ అక్కడి లోకల ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ప్రమాదం జరిగిన తర్వాత చాలా సేపటికి గానీ మేల్కోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా అందుకేమీ భిన్నంగా లేదు. మంగళవారం ప్రమాదం జరిగితే.. బుధవారం ఉదయం గానీ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మేల్కోలేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై సమగ్ర వివరాలు తెలియజేయాలంటూ ఆయన ఎన్హెచ్ఏఐకి ఆదేశాలు జారీ చేశారట. మరి ఈ ప్రమాదానికి బాధ్యులుగా ఎవరిని తేలుస్తారో చూడాలి.
Must Read ;- డీల్ కుదరకపోతే కూల్చుడే.. విశాఖ సాగరతీరంలో అధిష్టాన నేత దందా!











