సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న మహిళా క్రికెటర్గా ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించారు. మహిళల క్రికెట్లో ఇంత సుదీర్ఘంగా కెరీర్ ఉన్న క్రీడాకారిణులు మరెవరూ లేరు. అంతే కాకుండా మిథాలీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం విశేషం. క్రికెట్లో మిథాలీ అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది. మెన్స్ క్రికెట్లో కూడ ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే 22 ఏళ్లకుపైగా ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగారు. ఆయన వన్డే కెరీర్ 22 ఏళ్ల 91 రోజులుగా ఉంది. ఆయన ఈ సమయంలో 463 వన్డే మ్యాచ్లు ఆడారు. ప్రస్తుతం ఇండ్లండ్తో వన్డే సిరీస్లో ఆడుతున్న మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్లో 22 ఏళ్లు పూర్తి చేసుకుని రికార్డు నెలకొల్పడమే కాకుండా సచిన్ నెలకొల్పిన రికార్డుకు కూడ చేరువలోకి చేరుకుంటున్నారు.
తొలి వన్డేలో ఇండియన్ టీమ్ ఓడినా..
తొలి వన్డేలో ఇండియన్ టీమ్ ఓడినా సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతూ మిథాలీ ఈ రికార్డు అందుకోవడం ఓ విశేషం. మరో విశేషమేమిటంటే షెఫాలీ వర్మ ఈ మ్యాచ్తోనే వన్డే క్రికెట్లో అరంగేట్రం చేయడం. 17 ఏళ్ల వయసులోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన తొలి మహిళా క్రికెటర్ షెఫాలీనే. హైదరాబాద్కు చెందిన మిథాలీ 1999, జూన్ 26న అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. మిథాలీ వన్డే కెరీర్ ఇప్పుడు 22 ఏళ్లకు చేరుకుంది. కెరీర్లో ఆమె మొత్తం 215 వన్డేలు ఆడారు. వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా మిథాలీ పేరునే ఉంది. 7170 పరుగులతో టాప్లో ఉన్న మిథాలీ కెరీర్లో 7 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంకా 92 రోజుల పాటు ఆమె కెరీర్ కొనసాగితే సచిన్ రికార్డును కూడ దాటి ఆమె మరో రికార్డు నెలకొల్పనున్నారు.











