సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు.. ఓ గొంతుక ఉవ్వెత్తున ఎగసింది. రాష్ట్ర విభజన జరిగిన తీరును మండుతున్న గుండెతో ప్రశ్నించింది. తెలంగాణ, ఆంధ్రా నాయకులపై నిప్పులు కురిపించింది. జరుగుతున్న పరిణామాలతో ఆవేదనతో ఉన్న ఆంధ్రులకు ఈ గొంతుక కొంత ఓదార్పునిచ్చింది. తమకు అండగా నిలుస్తుందన్న ధైర్యాన్నిచ్చింది. ఆ గొంతుక.. పేరే.. పవన్.
రాష్ట్ర విభజన పరిణామాలతో చలించిపోయిన పవన్.. ఇకపై జనంతోనే ఉంటానంటూ నినదించి మరీ.. ‘జనసేన’ను స్థాపించారు. ఆ రోజున అభిమానులు ఉద్వేగానికి లోనయ్యారు. అన్న చేయలేనిది తమ్ముడు సాధిస్తాడని నమ్మారు. నాడు పవన్ ప్రసంగం విన్న సాధారణ జనం కూడా ‘ఇతడు ఏదో చేస్తాడు’ అనే భావించారు. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడేళ్లయింది. నాటి ఆవేశం.. ఈ జనసేనానిలో నేడు ఏమైంది? అప్పటి ఉత్సాహం.. అభిమానుల్లో ఇప్పుడు లేదెందుకు? తప్పెవరిది? ఎక్కడ జరిగింది? కనీసం ఈ దిశగా ఆలోచించే నాయకుడు ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నాడా? రెండు సాధారణ ఎన్నికలను చూసిన ఆ పార్టీకి నిర్మాణముందా? అసలు సిద్ధాంతమేంటి? విధివిధానాలు ఉన్నాయా?కార్యకర్తలు ఎక్కడ? పవన్, నాదెండ్ల మినహా.. మరో నాయకుడి పేరు చెప్పమంటే.. ఎవరైనా చెప్పగలరా? పార్టీ పెట్టిన నాటి పరిస్థితే (నిర్మాణంలో).. ఏడేళ్ల తర్వాతా కనిపిస్తోందంటే.. లోపం ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నమైనా ఆ పార్టీలో జరుగుతోందా? అంటే.. నిరాశాజనకమైన సమాధానమే వస్తోంది.

నిర్మాణంపై కొరవడిన శ్రద్ధ
జనసేన స్థాపన నాటికే పవన్ కు రాజకీయాల్లో అంతో ఇంతో అనుభవం ఉంది. తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ కీలక పాత్ర పోషించారు. యువ రాజ్యం అధినేతగా వ్యవహరించారు. ఆ పార్టీ పతనానికి గల కారణాలపై ఆయనకు అవగాహన ఉండే ఉంటుంది. ఆ అనుభవం నుంచి ఆయన పాఠాలు నేర్చుకునే ఉంటారనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. అన్న లాగే ఆయనా అభిమానులనే నమ్ముకున్నారు తప్ప.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. అభిమానులు ఓట్లు వేస్తారే తప్ప వేయించలేరు. ఓట్లు వేయించేందుకు ఓ యంత్రాంగం కావాలి. కార్యకర్తలు కావాలి. దీన్ని గ్రహించడంలో ఆయన విఫలమయ్యారు. ఏడేళ్లవుతున్నా.. ఎన్ని ఎదురుదెబ్బలు తింటున్నా.. నేటికీ గ్రామస్థాయిలోకి పార్టీని తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిర్మాణంపై దృష్టి సారించలేకున్నారు.
వ్యూహాత్మక తప్పిదాలు
ఆది నుంచీ జనసేనను వ్యూహాత్మక తప్పిదాలు వేధిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేయాలన్న పవన్ నిర్ణయం వ్యూహాత్మకంగా సరైనదేనని అందరూ భావించారు. దీని ద్వారా పార్టీ నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందని అనుకున్నారు. అన్న లాగా అతి విశ్వాసానికి పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంతా భావించారు. టీడీపీ మద్దతుతో ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకుంటే.. ఆ తర్వాత క్రమంగా పార్టీ బలపడుతుందని, వ్యూహాత్మకంగా ఆయన నిర్ణయం సరైనదేనని విశ్లేషకులు భావించారు. కానీ, అనూహ్యంగా పవన్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీన్ని జనసేన చేసిన అతి పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే.. ఆ తర్వాతైనా ఆయన జనంలో తిరుగుతూ.. ప్రజాసమస్యలపై పోరాడారా.. అంటే.. అదీ లేదు. ఎప్పుడో ఒక ట్వీట్ తప్ప.. రాజకీయాలతో తనకు అసలు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరించారు. సినిమాల్లో బిజీగా గడుపుతూ ప్రజలకు పూర్తిగా దూరమైపోయారు. కావలసినంత సమయం ఉన్నా.. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్య పార్టీలే ఉన్నా.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. పార్టీ నిర్మాణాన్ని విస్మరించారు. పార్ట్ టైం పొలిటీషియన్ గా మిగిలిపోయారు. దీంతో.. ఆ పార్టీలో పవన్ వీరాభిమానులే తప్ప.. నాయకులు, కార్యకర్తలు లేకుండా పోయారు. నిజానికి ఆ సమయంలో ఉద్యమాలు నడపడానికి పవన్ కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కేంద్రం విభజన హామీలను విస్మరించింది. ప్రత్యేక హోదాను గాలికి వదిలేసింది. రైల్వే జోన్ ప్రకటించలేదు. బడ్జెట్ లో రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోంది. వీటిపై భారీ ఉద్యమాలే నిర్మించి ఉండొచ్చు. అలా చేసుంటే.. కచ్చితంగా పవన్.. రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేవారు. అలా అందివచ్చిన సువర్ణావకాశాలను ఆయన చేజేతులా జారవిడుచుకున్నారు.
Must Read ;- అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్.. ఏమిటీ చర్చ?

అతి అనర్ధదాయకం..
పవన్.. తన బలాన్ని అతిగా ఊహించుకుని టీడీపీ, బీజేపీలపై విమర్శలు కురిపిస్తూ వచ్చారు. ఈ విమర్శల్లో కూడా అవగాహనా రాహిత్యమే ఎక్కువగా కనిపించేది. దీంతో.. ఆయన తరచుగా అభాసుపాలయ్యేవారు. ఇదే సమయంలో నిత్యం జనంలోనే ఉంటూ.. జగన్ బలం పుంజుకున్నారు. జనసేన మాత్రం అధినేత సహా పట్టించుకేవారే లేక డీలా పడిపోయింది.
కమ్యూనిస్టునంటూ.. లెఫ్ట్ పార్టీలతో జట్టు
ఓ రాజకీయపార్టీ దశాబ్దాల ప్రయాణంలో చేసే తప్పులన్నీ.. జనసేన ఈ ఏడేళ్లలోనే చేసేసింది. తొలుత టీడీపీ, బీజేపీలతో జట్టుకట్టిన ఆ పార్టీ.. తదనంతరం బీజేపీకి పూర్తి విరుద్ధమైన కమ్యూనిస్టులతో జతకలిశారు. తాను తొలి నుంచీ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడినని చెప్పుకున్నారు. వారితో కలిసే ఎన్నికలకు వెళ్లారు. అంతటా డిపాజిట్లు కోల్పోయారు. చివరకు తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత.. వెంటనే మళ్లీ బీజేపీతో కలిసిపోయారు. అవకాశ వాదిగా ముద్ర వేయించుకున్నారు. తనకు కులమతాలు లేవంటూ గతంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ఏమాత్రం సిగ్గు పడకుండా.. మతోన్మాదానికి మద్దతిస్తున్నారు. అదేమంటే.. వ్యక్తిగతంగా తాను కుల మతాలకు దూరం అంటారు. అంటే.. తనకో సిద్ధాంతం, పార్టీకి ఓ సిద్ధాంతం ఉన్నాయా? తన పార్టీ సిద్ధాంతంతో తనే ఏకీభవించరా? అంటే.. సమాధానం ఉండదు. సరే.. తన భాగస్వామ్యపక్షంగా బీజేపీ ఏనాడైనా పవన్ కు గౌరవమిచ్చిందా? అంటే.. అదీ లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దూరంగా పెట్టింది. కనీసం ప్రచారానికి కూడా ఆహ్వానించలేదు. రాబోయే తిరుపతి ఉపఎన్నికలోనూ తమ అభ్యర్థే పోటీలో ఉంటారని ప్రకటించింది. ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా.. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీని చూసి ఎందుకు భయపడుతున్నారన్నది ఆయన అభిమానులను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికీ పోరాడేందుకు ఆయన ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మూడు రాజధానులు, స్టీల్ ప్టాంట్ లాంటి సమస్యలపై స్పందించని ఆయన.. విగ్రహాల ధ్వంసంపై మాత్రం స్పందించారు. ఎంత భక్తో..! ఆ భక్తి దేవుళ్ల పైనా.. లేక బీజేపీ పెద్దల పైనా అన్నదే తెలియాలి.

వాస్తవాలు గుర్తించాలి..
ఇప్పుడిప్పుడే పవన్.. వాస్తవాలు తెలుసుకుంటున్నట్లున్నారు. తన బలం ఏ మాత్రమో గ్రహించారు. ట్వీట్లతో కాలక్షేపాన్ని తగ్గించారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. అడపాదడపా రాజకీయ వేదికలపైనా సందడి చేస్తున్నారు. కానీ, పార్టీ నిర్మాణాన్ని మాత్రం ఎందుకనో పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు కార్యకర్తలకు ఇంటర్వ్యూలు, శిక్షణ అంటూ హడావుడి చేసిన ఆయన.. మళ్లీ దాన్ని గాలికి వదిలేశారు. ఇప్పటికే రెండు సార్వత్రిక ఎన్నికలను చూసిన పవన్ కల్యాణ్.. మరో రెండేళ్లలోనే మూడో సార్వత్రిక ఎన్నికలను చూస్తారు. అప్పటిలోగానైనా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతారో.. లేదా ఇలాగే ఊరుకుంటారో చూడాలి. పార్టీ యంత్రాంగం, కార్యకర్తల బలం లేకుండా బరిలోకి దిగితే.. వచ్చే ఎన్నికల్లోనూ మరింత దారుణ పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నది నిర్వివాదాంశం. మహా మహా పార్టీలే బీజేపీ పొత్తుతో నిర్వీర్యంగా మారిపోతున్న వేళ.. అభిమానుల బలం తప్ప వేరే నిర్మాణమేమీ లేని పవన్.. భవిష్యత్తులో బీజేపీ మిత్రత్వాన్ని ఎలా తట్టుకుంటారో చూడాలి.
Must Read ;- అంతా గందరగోళం.. పవన్ ఢిల్లీ టూర్లో ఏమి తేలుస్తారో..!











