కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. రాష్ట్రానికి కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడం అనేది అవసరమే. అంతవరకు ఏ ప్రభుత్వం కేంద్రంతో ఎంత సత్సంబంధాలు కొనసాగించినా.. వాటిని సమర్థించాలి. అభినందించాలి. కానీ.. సత్సంబంధాల ముసుగులో కేంద్రానికి అనుచితమైన రీతిలో, ప్రజల్లో ఆందోళన రేకెత్తే రీతిలో భజన చేస్తున్నట్లుగా ఉండకూడదు. ప్రస్తుతం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాటలను గమనిస్తే.. అలాంటి భయమే కలుగుతోంది.
పోలవరం గురించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకర్లతో మాట్లాడారు. ఆయన సహజసిద్ధమైన మాటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తెలుగుదేశం మీద ఎడాపెడా నిందారోపణలు కురిపించారు. ప్రతిపక్షాలు పోలవరం ఎత్తు తగ్గిస్తామని ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఇన్ని సార్లు పోలవరం వెళ్లాం, ఢిల్లీ వెళ్ళాం అంటారు అయినా కూడా అవగాహన లేకుండా మాట్లాడతారు అంటూ దెప్పిపొడిచారు. మేము జనాల్లోనే ఉంటాము, మీలా జూమ్ లో మాట్లాడం అంటూ చంద్రబాబు తీరును ఎండగొట్టారు. ఎన్నిసార్లు పోలవరం వెళ్ళామన్నది కాదు ఎంత చిత్త శుద్ధితో వెళ్ళామనేది కావాలంటూ.. తాము ప్రతిసారీ చిత్తశుద్ధిని టన్నులకొద్దీ వెంట తీసుకువెళ్తున్నట్టుగా కూడా ఆయన చెప్పుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. మోడీ భజనకు పూనుకోవడమే అనుమానాలు రేకెత్తిస్తోంది.
‘ఇది జాతీయ ప్రాజెక్టు.. దీనికి ప్రతి రూపాయి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే.. మోదీ అన్ని రకాలుగా సహకరిస్తున్నారు’ అని అనిల్ కుమార్ యాదవ్ సెలవిచ్చారు. ఇది జాతీయ ప్రాజెక్టు అనే సంగతి పసిపిల్లలను అడిగినా చెప్తారు. బాధ్యత కేంద్రానిదే అని కూడా అందరికీ తెలుసు. కానీ.. ఆమేరకు వారు ఇస్తున్నారా? అనేది సందేహం. పునరావాసానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని కేంద్రం తెగేసి చెప్పింది. ఆ విషయంలో అనిల్- ఆ డబ్బు కేంద్రంనుంచి వసూలు చేస్తాం అనే మాట చెప్పలేకపోతున్నారు. మోడీ గారు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు అంటే అర్థం ఏమిటి?. పెండింగ్ లో ఉన్న పేమెంట్ తెచ్చుకోడానికి సీఎం జగన్ స్వయంగా నానా పాట్లు పడాల్సి వచ్చింది. కేంద్రం సహకరించడం అంటే ఇదేనా?
Also Read ;- అంచనాల్లో అస్పష్టత.. పోలవరంకు ప్రాణ గండం
కానీ అనిల్ మాటల్లో అనేక అనుమానాలు పుడుతున్నాయి.
పోలవరం డెడ్ స్టోరేజ్ నుండి నీళ్ళు విశాఖకు తరలించడానికి ప్రయత్నిస్తుంటే ఎత్తు తగ్గిస్తున్నారు,కాంట్రాక్టర్స్ తో లాలూచీ పడ్డారు అంటున్నారని వాపోయారు. డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు ఇవ్వడం వేరు, ఎత్తు తగ్గించడం వేరు. ఎత్తు గురించి ప్రజల్లో అనుమానాలు పుడుతున్నప్పుడు.. ఇంకాస్త స్పష్టంగా విశదంగా చెప్పాల్సిన అవసరం ఉంది. డ్యా మ్ పూర్తి అవ్వగానే ప్రతి సంవత్సరం 1/3,2/3,అలా పెంచుకుంటూ డ్యాం పూర్తి స్థాయిలో నింపుతాం అనడం.. కాలయాపనకు దారితీసేదే. ఎత్తు గురించి అనుమానాలు పెంచేదే.
ఏ ప్రాజెక్టులోనూ అర్ అండ్ ఆర్ చేయరు.. అంటూ అనిల్ చెబుతున్న మాటలు.. కేంద్రం వదిలించుకోదలచుకున్న భారానికి వీరు ముందే జైకొట్టేస్తున్నారా? అనిపించేలా ఉంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి ఇస్తుంది.. అంటున్నారు గానీ.. ఇవ్వడానికి సంబంధించి కేంద్రం ఆమోదాన్ని సాధించారా లేదా చెప్పలేదు. పునరావాసం కల్పించకుండా డ్యాం నింపడం అసాధ్యం అని కూడా ఆయన తెలుసుకోవాలి.
మేఘా వచ్చాక 600 కోట్లు పైగా పనులు చేసిందని ఆయన కితాబు ఇచ్చారు. మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి, జగన్ గారు పూర్తి చేస్తారు,మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అని కూడా శాపనార్థాలు పెట్టారు. రాజశేఖర రెడ్డి విగ్రహం ప్రాజెక్ట్ లో పెడుతున్నామని కూడా అనిల్ అన్నారు. ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసి.. దానిద్వారా ఆశించినట్లుగా నీళ్లు విడుదల చేసిన రోజున ఆ పనిచేస్తే వైఎస్సార్ కు గౌరవంగా ఉంటుంది.
Also Read ;- రాష్ట్రానికి పోల‘వరమా’ శాపమా?











