ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఏపీలో స్థానిక ఎన్నికలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పరిస్థితుల్లో అంటే ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. తాజాగా 2021 నూతన ఓటర్ల లిస్టు తయారు చేయాలని ప్రభుత్వ సీఎస్ కు లేఖ రాశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంటే ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ కు మధ్య వార్ మరోసారి ప్రారంభమైందని చెప్పవచ్చు.
అసెంబ్లీలో చేసిన తీర్మానం చెల్లుతుందా?
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, దాన్ని నిలువరించేందుకు వైసీపీ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ద సంస్థ కావడంతో అసెంబ్లీ తీర్మానాలు చెల్లవని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన తరవాతే, ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది.
Must Read ;- జగన్ జైలుకెళ్లడం ఖాయమేనా..?
ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సిద్దంగా ఉండండి
వచ్చే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని ఇందులో భాగంగా 2021 నూతన ఓటరు లిస్టు తయారు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. అంటే ఎన్నికల ప్రక్రియ మరలా మొదలు పెట్టారని తెలుస్తోంది. అసెంబ్లీలో చేసిన తీర్మానం చెల్లదని దీనిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, గవర్నర్ ను కోరారు. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాజాగా హైకోర్టులో కూడా స్థానిక ఎన్నికల నిలుపుదలకు ధర్మాసనం అంగీకరించకపోవడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. నిమ్మగడ్డ పదవీకాలం మార్చి నెల వరకు ఉంది. ఆ తరవాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం సహకరించకుండా సాధ్యమా?
ఏ ఎన్నికలు నిర్వహించాలన్నా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరించాలి. కానీ ఏపీలో రెండు వ్యవస్థల మధ్య వార్ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించే విషయంలో పూర్తి హక్కులు ఎన్నికల సంఘానికి ఉన్నా, ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఎన్నికల సంఘానికి పెద్దగా సిబ్బంది ఉండరు. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే అప్పుడు ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకువస్తారు. తద్వారా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ప్రభుత్వం ఇష్టం లేకుండా, కేవలం కోర్టు ఆదేశాలను చూపుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం అయ్యే పని కాదు. ఈ విషయం ఎన్నికల సంఘానికి తెలియనిది కాదు. కానీ ప్రభుత్వం ఆసక్తి చూపకపోయినా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పట్టుపడుతున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. చివరకు ఎవరి పంతం నెగ్గించుకుంటారో వేచి చూడాల్సిందే.
Also Read ;- గోల్ ఎవరికో.. హైకోర్టులో ఏపీ పంచాయతీ ఎన్నికల బాల్











