లేడీ సూపర్ స్టార్, రాజకీయ నేత విజయశాంతి బీజేపీలో చేరాక ప్రెస్ మీట్లలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాములమ్మ చేరికతో బీజేపీలో ఎంత ఉత్సాహం వచ్చిందో తెలియదు కాని.. ప్రెస్ మీట్లలో మీడియా ప్రతినిధులే షాక్ తినే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. తెలంగాణ కోసం తాను కేసీఆర్ కంటే ముందే పోరాటం ప్రారంభించానని మొదలు పెట్టిన విజయశాంతి తాను ఉన్న బీజేపీ తప్ప అన్ని పక్షాలనూ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి గుర్తింపు అవసరం కాబట్టి ఇలా విమర్శలు చేయడం సాధారణమే అని భావించవచ్చు. అయితే తాను ఎప్పుడు ఏ పార్టీలో నుంచి బయటకు వచ్చాననే అంశాన్ని విస్మరించి ఇతర పార్టీలపై విమర్శలు చేయడమే పలు ప్రశ్నలకు తావిస్తోంది.
కేసీఆర్ కంటే ముందుగానే..
ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చిన విజయశాంతి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాను కేసీఆర్ కంటే ముందుగానే 1998లో ఉద్యమం మొదలు పెట్టానని అన్నారు. అయితే అప్పటి NDAలోని మిత్రపక్షాలు(అంటే పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేస్తూ).. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉండటం వల్ల తన ప్రయత్నాలు ఫలించలేదని, అందుకే బయటకు వచ్చానని చెప్పారు. అంటే ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చానని విజయశాంతి అనుకున్నారా అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. కాని వాస్తవానికి విజయశాంతి బీజేపీని వీడింది 2005లో. అప్పటికి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. 2004లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీడీపీ, బీజేపీ ఓడిపోయాయి. అంటే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ1 అధికారంలోకి వచ్చాక (2004మే నెల-2005మే నెల) దాదాపు ఏడాది పాటు విజయశాంతి బీజేపీలోనే ఉన్నారు. అప్పుడు తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కాని టీడీపీని టార్గెట్ చేశారు విజయశాంతి.
ఇదీ అసలు విషయం..
2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు ఉంది. అయితే అప్పటికే విజయశాంతి బీజేపీని టిక్కెట్ అడిగారని, పొత్తులో భాగంగా కుదరదని బీజేపీ చెప్పిందని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి ఓడింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమి గెలిచింది. అంతే కాకుండా 2004లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియాగాంధీ కరీంనగర్ సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ తాను తెలంగాణ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చాయి. యూపీఏ1 అధికారంలోకి వచ్చాక 2005 మార్చిలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 8 వారాల్లో ఈ కమిటీ తన నివేదికను ఇస్తుందని కేంద్రం ప్రకటించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చే టైంలోనే..అంటే 2005 మే నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చారు విజయశాంతి. తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. అయితే అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. దేవేందర్గౌడ్ పెట్టిన నవతెలంగాణ, ఆలెనరేంద్ర తెలంగాణ సాధన సమితిలు కూడా తెలంగాణలో ఉన్నాయి. పార్టీ ఏర్పాటు వరకు బాగానే ఉన్నా తల్లి తెలంగాణ పార్టీలో పెద్ద నేతలు ఎవరూ చేరలేదు. అందుకు రకరకాల కారణాలూ ఉన్నాయి. టీడీపీలో కీలక మంత్రిగా ఉన్న పుష్పలీల పార్టీని వీడి తల్లి తెలంగాణ పార్టీలో చేరారు. కొన్ని రోజులకే పుష్పలీల- విజయశాంతిల మధ్య విభేదాలు తలెత్తాయి. తరువాత విజయశాంతిపై పుష్పలీల తీవ్ర విమర్శలు చేశారు. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ బలపడడంతో తల్లి తెలంగాణ పార్టీ, ఆలెనరేంద్ర పార్టీ టీఆర్ఎస్ లో విలీనమయ్యాయి.
అప్పటి పరిస్థితి ఇలా ఉంటే, విజయశాంతి మొన్న మాట్లాడుతూ.. అప్పట్లో తెలంగాణ ఇస్తే..ఎన్డీయే ప్రభుత్వాన్ని చంద్రబాబు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని, అందుకే బయటకు వచ్చాననే అర్థం వచ్చేలా ఆమె చెప్పడం గమనార్హం.
తరువాత మెదక్ ఎంపీగా గెలవడం, రెండోసారి టీఆర్ఎస్ అవకాశం ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ను వీడిన విజయశాంతి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు బీజేపీలో మళ్లీ చేరారు. మొత్తం మీద విజయశాంతి చేస్తున్న కామెంట్లు రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఇప్పుడు టీడీపీని కూడా టార్గెట్ చేయడం వెనుక అర్థం ఏంటనే ప్రశ్న రాజకీయవర్గాల్లో తలెత్తుతోంది.
Also Read: బీజేపీలో చేరక ముందే ఎంజాయ్ చేస్తున్న మాజీ ఎంపీ?