ప్రతివారం కొత్తపలుకు శీర్షికలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తాజా ఎపిసోడ్ లో మరికొన్ని అంశాలు లేవనెత్తారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ జల వివాదాల అంశాల్లో ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎందుకు మాట్లాడడం లేదన్న అంశం ఒకటి కాగా ఆర్థిక ప్రయోజనాల కోసం తమ విశ్వసనీయతను తాకట్టు పెట్టబోమని, వైఖరిని మార్చుకోబోమని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని తేల్చి చెప్పారు. పనిలో పనిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏసుప్రభువుతో మాట్లాడతారా అనే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. ఆ అంశాలకు వస్తే..
తెలంగాణలో సీమాంధ్రులకు భద్రత లేదా?
జల వివాదాల నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నా తాము సైలెంట్ గా ఉండేందుకు కారణంగా హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రుల భద్రత, ప్రయోజనాలను చూపడాన్ని ఆర్కే తప్పుబట్టారు. ‘తెలంగాణకి ముందు, తెలంగాణకి తరువాత కూడా హైదరాబాద్ లోని సీమాంధ్రులకు ఎలాంటి నష్టం జరగలేదు. ఏపీలో ఉన్న సీమాంధ్రులకంటే తెలంగాణలో ఉన్నవారే డెవలప్ అయ్యారు. అదే సమయంలో తమ ఆస్తులను కొల్లగొట్టే యత్నం చేస్తున్నారని ఏ ఒక్క సీమాంధ్రుడూ ఫిర్యాదు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఏపీలోనే అలా జరుగుతోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని మరోసారి వాడుకోవాలని చూస్తున్నారు. తాను అన్నగా భావించే కేసీఆర్ కు సీఎ జగన్ ఫోన్ చేసి మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నా, ఆ పని చేయకుండా ప్రధానికి లేఖ రాశారు. వివాదానికి మూలబిందువులుకు ప్రధాన సమస్యగా మారిన విద్యుత్తు విషయంలో పరిష్కార మార్గాలున్నా వాటిని పట్టించుకోవడం లేదు.
ఆస్తుల రక్షణ కోసమే జగన్ నాటకాలు
ఇప్పుడు హైదరాబాద్ లోని సీమాంధ్రుల భవిష్యత్ కోసం మాట్లాడుతున్న జగన్, 2016లో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో జలదీక్ష చేపట్టిన విషయం గుర్తుంచుకోవాలి. అప్పుడు జగన్ రెడ్డి కూడా హైదరాబాద్లోని లోటస్ పాండ్లోనే ఉండేవారు. ఆ సమయంలోనూ తెలంగాణవాదులు జగన్ కి ఎలాంటి నష్టమూ చేయలేదు. అదే అదనుగా జగన్ అప్పట్లో పలు విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసుకు భయపడిన అప్పటి సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పుడు జగన్ చేస్తున్న వ్యాఖ్యలపైనా అవే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్లోని తమ ఆస్తులను కాపాడుకోవడానికే జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
Also Read ;- ఆర్కే గారూ.. ఏమరపాటుగా ఉంటే ఎలాగండీ?
పులిచింతల ఎందుకోసం?
వాస్తవానికి పులిచింతల ప్రాజెక్టు వివాదం ఎప్పటినుంచో ఉంది. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదనీటిని (45 టీఎంసీలు) నిల్వ చేయడం కోసం పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను డిజైన్ చేశారు. ఆయకట్టు స్థిరీకరణ కోసమే ఉద్దేశించారు. ఎన్టీఆర్ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చింది. ఎన్టీఆర్ హయాంలో పులిచింతల కుడివైపు విద్యుత్కేంద్రాన్ని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని చెబుతూ నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తరువాత చంద్రబాబు హయాంలో, వైఎస్ హయాంలో ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ హయాంలో పులిచింతల ఎడమ వైపున తెలంగాణ భూభాగంలో విద్యుత్ నిర్మించారు. విభజన సమయంలో అది తెలంగాణపరమైంది. విభజన సమయంలో తెలంగాణవాదులు తమ ప్రాంత ప్రయోజనాలపై దృష్టి పెట్టగా, సీమాంధ్రకు చెందిన నాయకులు మాత్రం సమైక్య ఉద్యమం పేరిట సొల్లు కబుర్లతో నష్టం చేకూర్చారు. ఇలాంటి వ్యూహాలను ముందుగా పసిగట్టి కేంద్రంతో మాట్లాడి ఉండే ఆ ప్రాజెక్టు ఏపీకే దక్కేదేమో. అయినా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు లో ఆ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తుంటే ఏపీ అభ్యంతరం నీళ్ల కోసమే అయినా ఆ మేరకు విద్యుత్తును తెలంగాణకు ఇస్తామని, నీళ్లు తమకు అవసరం అవుతాయని ఏపీ సీఎ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లావచ్చు కదా. అయినా పట్టిసీమ రాకతో పులిచింతలపై భారం తగ్గింది. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ప్రకాశం బ్యారేజీకి తరలించడంతో కృష్ణాజిల్లాకు సాగునీటి సమస్య చాలా వరకు తీరింది. వేసవిలో మంచినీటి కొరత ఏర్పడినప్పుడు మాత్రమే పులిచింతల ఉపయోగపడుతోంది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి వర్షాకాలంలోనే నీటిని ఎత్తిపోస్తున్నారు కనుక విద్యుత్ అవసరం తెలంగాణకు ఎక్కువగా ఉంటున్నందున పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఎవరి వాదనలు వారికి ఉన్నాయి.
హోదాపై చేతులెత్తేశారే..
ఇవన్నీ వదిలేసి హైదరాబాద్ లోని సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నిన్నటిదాకా కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. ఇప్పుడు ‘మనం చేయగలింది ఏమీ లేదు’ అని చేతులెత్తేశారు. నీళ్ల విషయంలోనూ సొంత వ్యాపార ప్రయోజనాలు, ఆస్తులకోసం, ఎన్నికల సమయంలో సాయం తీసుకున్నందుకు కేసీఆర్కు లొంగిపోక తప్పని పరిస్థితి జగన్ రెడ్డికి ఏర్పడింది. అదే సమయంలో అన్నిఅంశాలకు చంద్రబాబు కారణమని చెప్పే జగన్ అండ్ కో ఈ సారి ఆ పని ఎందుకు చేయలేదు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. జగన్ రెడ్డి కాకుండా వేరెవరు అధికారంలో ఉణ్నా రాయలసీమ నుంచి కొన్ని వృద్ధ పులులూ, సింహాలూ సీమ హక్కుల కోసం రోడ్డు మీదకు వచ్చి గాండ్రించేవి. సీమాంధ్ర నాయకుల గురించి కేసీఆర్ తెలుసు కాబట్టి ఆయన ఇవేమీ పట్టించుకోరు.
షర్మిల కట్టడికే జగన్ పై కేసీఆర్ యుద్ధమా?
ఇక్కడే మరో అంశం కూడా ఉంది. తెలంగాణ గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల పార్టీ పెట్టడంపై కేసీఆర్ అసహనంగా ఉన్నారు. ఈ విషయంలో జగన్ షర్మిలను కట్టడి చేయలేకపోతున్నారనే అభిప్రాయం కూడా కేసీఆర్ కు ఉందట. ఆ అంశంపై వచ్చే వారం చెబుతాను. ’అని ఆర్కే తన వ్యాసంలో వెల్లడించారు. అదే సమయంలో తనపై, తమ సంస్థలపై వస్తున్న విమర్శలపైనా ఆర్కే కొన్ని వ్యాఖ్యలు చేశారు. పంథా మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చారు. తాను ఏదైనా రాస్తే నీలిమీడియా గుండెలు బాదుకుంటోందని, ‘ఆంధ్రజ్యోతి’కి, ‘ఏబీఎన్’కూ విశ్వసనీయత లేదని చెబుతున్నారని, అయితే జగన్ రెడ్డి–షర్మిల మధ్య కుటుంబ కలహాలు- తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ అంశాలపై రాసినప్పుడూ ఇదే చెప్పారన్నారు. కరోనా విషయంలో భయపడాల్సింది లేదని ఏసు ప్రభువు తనకు చెప్పారని జగన్ రెడ్డి అధికారులతో ఎప్పుడు అన్నారో తేదీతో సహా రాశానని గుర్తు చేశారు. ఏది జరిగినా దేవుడి స్ర్కిప్టు ప్రకారమేనని నమ్మే జగన్ రెడ్డి, అదే దేవుడు ఆ సమాచారాన్ని నాకు చెప్పించి ఉంటారని ఎందుకు భావించడం లేదని, నీలిమూకను ఉసిగొల్పడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ కు బాకా ఊదేందుకు ఉన్న కొందరు పెయిడ్, పెటీఎం జర్నలిస్టులు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, అయితే గత చరిత్ర చూసుకోవాలని సూచించారు. నాకు ఆ సమాచారం ఇచ్చింది ఐఏఎస్ అధికారి అని చెప్పానని, ఓ ఐఏఎస్ అధికారిని దారిన పోయే దానయ్య అని నిందించే వాళ్లను చూసి జాలిపడాల్సిందే నన్నారు. తాము తప్పుడు వార్తలు రాసి ఉంటే ఈ పాటికి మమ్మల్ని వదిలేవారా అని ప్రశ్నించారు. గతంలో చాలా ఆరోపణలు చేశారని, అయితే ఇప్పటివరకు ఏదీ రుజువు చేయలేకపోయారంటే తాను తప్పు చేయలేదనే అర్థమే కదా అని వ్యాఖ్యానించారు. తాము పలు ప్రభుత్వాలతో ఘర్షణకు దిగామని, ప్రకటన రూపంలోనూ చట్టప్రకారం ఇవ్వాల్సినవి ఇవ్వకున్నా పోరాటం చేశామని, రాజీ పడలేదని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకోసమే తమ పోరాటమని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
Must Read ;- బూతు మంత్రులూ గాజులు తొడుక్కున్నారా?











