(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల విద్యుత్ శాఖ ఉద్యోగులకు గురువారం ఏసీబీ షాక్ ఇచ్చింది. ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ జిల్లా కొమ్మాది డివిజన్ ఏఈ నాగేశ్వరరావు, విజయనగరం జిల్లా బొండపల్లి ఎలక్ట్రికల్ ఏఈ దాసరి మురళీమోహన్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
అవినీతి అనకొండ ..
ఏసీబీ వలకు మరో అవినీతి అనకొండ చిక్కింది. ఏపీ ఈపీడీసీఎల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.నాగేశ్వరరావు ఇల్లు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో గురువారం ఉదయం సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు కోట్ల కొలది అక్రమాస్తులను గుర్తించారు. ఆంధ్ర, తెలంగాణలో నాగేశ్వరరావు ఆస్తులను ఏసీబీ గుర్తించింది. విశాఖలో సీతమ్మధార, సీతమ్మపేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లిలో మొత్తం ఏడు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నాగేశ్వరరావుకు సంబంధించిన మూడు బ్యాంకు లాకర్లు, ఆస్తులు, భూములను ఏసీబీ గుర్తించింది. 1991లో సర్వీసులో చేరిన నాగేశ్వరరావు… 1994లో మొదటిసారిగా ఏసీబీ అధికారుల ట్రాప్ కేసులో చిక్కాడు. 1994లోనే ఏసీబీ ట్రాప్ కేసులతో నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. 2012లో మరల ఉద్యోగంలో చేరారు. లాన్సమ్ టవర్స్లో కోటి యాభై లక్షల విలువచేసే ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు.విశాఖ నగర పరిధిలోని కొమ్మాది డివిజన్ ఎలక్ట్రికల్ ఏ ఈ గా పనిచేస్తున్న నాగేశ్వరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.. నాగేశ్వర్ రావు పై గతంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. చేతికి లంచం తీసుకోనిదే ఏ పని చేయరన్నా అపవాదును మూటగట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులకు సమాచారం ఉండడంతో గురువారం ఉదయం దాడులు నిర్వహించారు . నాగేశ్వరరావు ఆస్తులపై రెండు రోజులు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి.
Must Read ;- ఉత్తరాంధ్ర విద్యుత్ శాఖలో ఏసీబీ దాడులు..
లంచం తీసుకుంటూ..
విజయనగరం జిల్లా బొండపల్లి ఏఈ దాసరి మురళి మోహన్ రావు .. బోర్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక రైతు వద్ద పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
శ్రీకాకుళంలోనూ ..
అక్రమ ఆర్జనకు ఆశపడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు సరుబుజ్జిలి మండలం మతలబుపేట పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్బాబు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్. రమణమూర్తి వెల్లడించారు. మతలబుపేట పంచాయతీలోని గోనెపాడులో పాఠశాల ప్రహరీ నిర్మాణ పనుల బిల్లుల సొమ్ము చెల్లింపునకు కార్యదర్శి సతీష్బాబు గోనెపాడుకు చెందిన మామిడి తిరుపతిరావు (మాజీ సర్పంచి) నుంచి రూ.6 వేలు లంచం డిమాండ్ చేశారు. ప్రహరీ నిర్మాణ పనులు పూర్తిచేసి అక్టోబరు నెలలో ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన బిల్లుల సొమ్ము జనవరి నెలలో కార్యదర్శి బ్యాంకు ఖాతాలో జమైంది. తిరుపతిరావు బ్యాంకు నుంచి డబ్బులు తీసి ఇవ్వమని సతీష్బాబును కోరాడు. అయితే రూ.6 వేలు ఇస్తేనే బిల్లు మొత్తం తీసి ఇస్తానని చెప్పగా రూ.5 వేలు ఇస్తానని చెప్పినా అంగీకరించలేదు. ఇక విసిగిపోయిన ఆయన శ్రీకాకుళంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల ప్రకారం.. మండల కార్యాలయం ఆవరణలో తిరుపతిరావు కార్యదర్శికి డబ్బులు ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యదర్శి సతీష్బాబుపై కేసు నమోదు చేశామని, విశాఖ అనిశా కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఇదివరకు సతీష్బాబు మెళియాపుట్టి మండలంలో విధుల నిర్వహణలో అలసత్వం కారణంగా సస్పెండ్ అయినట్లు, కోటబొమ్మాళి మండలంలో క్రిమినల్ కేసు నమోదై ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో సీఐలు భాస్కరరావు, హరిలతో పాటు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read ;- రూ.కోటి 10 లక్షల లంచం కేసులో వరుస ఆత్మహత్యలు!