పటౌడీ ఫ్యామిలీలో మరో మెంబర్ జాయిన్ కానున్నాడని కరీనా కపూర్-సైఫ్ ఆలీఖాన్ ప్రకటించారు. 2012 అక్టోబర్ 16న సైఫ్-కరీనాల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే తాయ్మూర్ అనే కుమారుడు ఉన్నారు. 2016లో జన్మించిన తాయ్మూర్ త్వరలో అన్న కానున్నాడు. శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపిన ఈ జంట కరీనా ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు. తన మొదటి భార్య అమృతా సింగ్ సంతానమైన ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పుట్టిన రోజున ఈ విషయాన్ని సైఫ్ ప్రకటించడం విశేషం. సైఫ్-కరీనాల తనయుడు తాయ్మూర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న వయసులోనే సెలబ్రిటీ స్టేటస్ ను తాయ్మూర్ అందుకున్నాడు. తమ తనయుడికి తాయ్మూర్ అని పేరు పెట్టడం అప్పట్లో వివాదం రేపిన సంగతి తెలిసిందే.
ఇండియాపై దండయాత్ర చేసి సంపదను విధ్వంసం సృష్టించిన టర్కీ రాజు తైమూర్ పేరును ఎందుకు పెట్టారంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సైఫ్ చరిత్రపై తనకు పూర్తి అవగాహన ఉందని దండయాత్ర చేసిన రాజు పేరు తైమూరు అని తాము పెట్టుకున్న పేరు తాయ్మూర్ అని స్పష్టత ఇవ్వడంతో వివాదాలు సద్దుమణిగాయి. అమృత సింగ్ ను సైఫ్ మొదట వివాహం చేసుకున్న విషయం విదితమే. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అనే పిల్లలు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తరువాత సైఫ్ ‘తషాన్’ షూటింగ్ సినిమా సమయంలో కరీనా ప్రేమలో పడ్డాడు. తన సోదరుడు మరోమారు తండ్రి కావడంపై సైఫ్ సోదరి సోహా అలీఖాన్ శుభాకాంక్షలు తెలియచేసింది. కరీనా ప్రస్తుతం అమీర్ ఖాన్ జోడిగా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తున్నారు. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ గా ఈ సినిమా హిందీలో తెరకెక్కుతోంది. ఈ సినిమాని ముందుగా 2020 డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కరోనా పరిస్థుతుల కారణంగా షూటింగ్ పూర్తికాకపోవడంతో వచ్చే ఏడాదికి ఈ సినిమా వాయిదా పడింది.