ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లపై అభిశంసన ప్రతిపాదన ఏపీ పాలకవర్గాల్లో, బ్యూరోక్రాట్లలో ప్రధానమైన చర్చగా మారింది. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందా.. ఒక ఐఏఎస్ అధికారిని అభిశంసించాలంటే కేంద్ర స్థాయిలోనూ ఎన్ని ప్రక్రియలు ఉంటాయి, ఆ క్రమంలో న్యాయపరమైన అంశాలు ఎలా ఉంటాయనే విషయం పక్కన బెడితే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పని చేసిన గోపాలకృష్ణ ద్వివేది అంతలా ఎలా వివాదంలో ఇరుక్కున్నారనే చర్చ కూడా మొదలైంది.
ఎన్నికల కమిషన్ అధికారాలు తెలిసి కూడా..
ప్రభుత్వ పెద్దలు లేదా వారి ప్రభావం ఏమైనా ఉందా.. వారి ప్రభావం ఉన్నా.. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ద్వివేది నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి ఉంటారా అనే ప్రశ్నకూడా తలెత్తుతోంది. ద్వివేదీకి ఎన్నికల కమిషన్కి ఉన్న అధికారాలు తెలియకుండా వ్యవహరించారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న సిసోడియాను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ద్వివేదీని నియమించింది. అప్పటికే ఇంటిలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు బదిలీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం, మళ్లీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కారణంగా ఏపీ సీఎస్గా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను, ఏబీ వెంకటేశ్వరరావును ద్వివేదీ వచ్చాకే బదిలీ చేశారు. ఆ క్రమంలోనే సీఎస్గా ఎల్వీ సుబ్రమణ్యం నియమితులయ్యారు. ద్వివేదీ SECగా వచ్చాక ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున రైతు రుణమాఫీ చెక్కుల జారీ కుదరదని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులూ నిలిపి వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా ఎన్నికల కమిషనర్ ఛాంబర్ ఎదుట నిరసన తెలిపారు. అయితే, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయాలే ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు రావడానికి మధ్యలో చాలా సమయం ఉంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు విడుదల చేయాలని కోరినా.. ఎన్నికల సంఘం అంగీకరించలేదు. పక్కాగా నిబంధనలు అమలు చేసినందుకు అవార్డు, రూ.లక్ష పురస్కారం కూడా అందుకున్నారు. ఇది వేరే వారి హయాంలో చోటు చేసుకున్న పరిణామాలంటే గుర్తుండకపోవచ్చు. కాని ఆయన ఎన్నికల కమిషనర్ ఛైర్లో ఉన్నప్పుడే జరిగిన పరిణామాలు కాబట్టి మర్చిపోయే అవకాశం లేదనే కామెంట్లు వస్తున్నాయి.
Must Read ;- కేంద్రం, గవర్నర్లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..
ఎల్వీ సుబ్రమణ్యం కామెంట్ ఇదీ..
చివరికి ఆయన హయాంలో సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రమణ్యం కూడా.. సుప్రీం తీర్పు వచ్చే ముందే సంకేతాలు ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ అయ్యాక వ్యవస్థలన్నీ ఎన్నికల సంఘం చేతుల్లోకే వెళ్తాయని ఓ మీడియాకు చెప్పారు. తెనాలి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల వాదన సరికాదన్నారు. అలాంటిది ద్వివేదీ వ్యహరించిన తీరుపైనే చర్చ నడుస్తోంది .
ఇరుక్కున్నారా..ఇరికించారా..
ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన ప్రొసీడింగ్స్లో కొన్ని ప్రధాన అంశాలున్నాయి. ఓటర్ల జాబితా సిద్ధ కాకపోవడం అందులో ఒకటి. ఇక్కడే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోతే..పాత ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరపాల్సి వస్తుందని, అప్పుడు ఎన్నికల సంఘం ప్రయత్నాలు న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవచ్చే విధంగా ప్రభుత్వం కుట్ర చేసిందని, ఆ క్రమంలో ద్వివేదీ ఇరుక్కోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక రెండోది ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకపోవడం అనే అంశానికి వస్తే.. ఎన్నికల సంఘంతో మీటింగ్ ఉన్నా సీఎంతో భేటీ ఉందని ఒకసారి వాయిదా వేశారు. ఎన్నికల సంఘం అంగీకరించింది. రెండోసారి కూడా వెళ్లలేదు. మూడో విడతగా సాయంత్రం 5గంటల వరకు సమయం ఇచ్చింది. అప్పటికీ వెళ్లలేదు. అదే రోజు రాత్రి ఎన్నికలు వాయిదా వేయాలంటూ సీఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓవైపు ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడం, మరోవైపు ఎన్నికల సంఘానికి సహాయ నిరాకరణ అంశాలు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలు ఇప్పుడు వద్దని చెబుతుండడంతో వారికి కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. ఇక నోటిఫికేషన్ విడుదలైనాక కూడా జిల్లాల్లో ఏర్పాట్లు మొదలు కాలేదు. కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉందన్న కారణం చెప్పి.. ఏర్పాట్లు చేయకపోవడం అంటే అప్పటికే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను దిక్కరించినట్టు ఎన్నికల సంఘం భావించినట్టు తెలుస్తోంది. దీంతో ద్వివేదీతో పాటు పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్పై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మొత్తం మీద ప్రభుత్వంలో నాయకులు వస్తుంటారు..పోతుంటారు. ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగులు మాత్రం దీర్ఘకాలం పని చేస్తారు. వ్యవస్థల ధిక్కరణ, నియమావళి ఉల్లంఘన విషయంలో సదరు నాయకుల కంటే.. ఉద్యోగులు లేదా బాధ్యులే ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది మరోసారి రుజువైంది. అదే సమయంలో ద్వివేదీపై టీడీపీ శ్రేణులు టైం రిపీట్ అయిందని కామెంట్ చేస్తున్నాయి.
Also Read ;- ఈసీతో పెట్టుకుంటే మడతడిపోద్ది!