CBI Announces 5 lakhs For Providing Credible Information In Y. S. Vivekananda Reddy Murder Case :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ కొనసాగిస్తున్న దర్యాప్తులో ఇప్పటిదాకా ఎలాంటి పక్కా సమాచారం లభించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా 2019 మార్చి 14 రాత్రి కడప జిల్లా పులివెందులలోని తన సొంతింటిలోనే వివేకా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో జరిగిన ఈ హత్యపై జగన్ నేతృత్వంలోని వైసీపీ నానా రాద్ధాంతం చేసింది. టీడీపీ పాలనలో జరిగిన ఈ హత్య.. తమను డిఫెన్స్ లో పడేసే దిశగానే జరిగిందని, ఇందులో టీడీపీ నేతలే దోషులని ఆరోపించిన జగన్.. సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేని పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ సర్కారు.. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ సిట్ ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త సిట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలకు ముందు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్.. తాను సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
కూతురి విజ్ఞప్తితో సీబీఐ దర్యాప్తు
సీఎంగా తన సోదరుడే ఉన్నా.. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతున్న వైనంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వివేకా కూతురు డాక్టర్ సునీత.. నేరుగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి మరణంపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆమె కోరారు. సునీత విజ్ఞప్తిని మన్నించిన కోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. వివేకా హత్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అయితే కరోనా నేపథ్యంలో సీబీఐ దర్యాప్తునకు కొంతమేర అడ్డంకులు ఏర్పడ్డాయి. తాజాగా కరోనా కొంత శాంతించిన నేపథ్యంలో గడచిన రెండు నెలలకు పైగా కడపలోనే తిష్ట వేసిన సీబీఐ అధికారులు.. వివేకా హత్యలో అనుమానం ఉన్న చాలా మందిని విచారించింది. ఇందులో భాగంగా వివేకా సమీప బంధువు, ఒకప్పుడు వివేకా ఎంపీగా కొనసాగిన కడప పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, పెదనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డిలతో పాటు అవినాశ్ పీఏలను అత్యంత సన్నిహితులను విచారించింది. అవినాశ్ రెడ్గి ఫ్యామిలీని విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈ కేసులో అవినాశ్ ఫ్యామిలీ హస్తం ఉందని తేలిపోయిందని, త్వరలోనే వివేకా మర్డర్ మిస్టరీ వీడనుందని అంతా అనుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో శనివారం నాడు సీబీఐ నుంచి వెలువడిన ఓ పత్రికా ప్రకటన పెను కలకలమే రేపిందని చెప్పాలి.
రూ.5 లక్షలిస్తారట
దాదాపుగా అన్ని ప్రధాన తెలుగు దినపత్రికల్లో కనిపించిన సీబీఐ ప్రకటనలో ఏముందంటే.. వివేకా హత్య కేసులో విశ్వసనీయ, నమ్మదగిన సమాచారం ఇచ్చిన వారికి రూ.5లక్షల నజరానా ఇస్తారట. ఆ వివరాలను తమకిచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, ఈ వివరాలు తెలిసిన ఎవరైనా ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు గానీ, ఈ కేసు పరిశోధనాధికారిగా కొనసాగుతున్న సీబీఐ అదనపు ఎస్పీ దీపక్ గౌర్ లకు ఫోన్ ద్వారా గానీ, నేరుగా కార్యాలయంలో కలిసి గానీ సమాచారం అందించాలని, వారి వివరాలను వేరెవరికీ తెలియకుండా అత్యంత గోప్యంగా ఉంచుతామని, వివేకా హత్య కేసు వివరాలు తెలిసిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి కీలక సమాచారాన్ని అందజేయాలని, అందుకు నజరానాగా రూ.5 లక్షలను అందజేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన చూస్తుంటే.. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో సీబీఐ అధికారులకు ఎలాంటి కీలక సమాచారం అందలేదన్న మాటే వినిపిస్తోంది. వెరసి వివేకా హత్య కేసు మిస్టరీ అసలు వీడుతుందా? లేదంటే సజీవంగానే సమాధి అవుతుందా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Must Read ;- జగన్ గ్రాఫ్ ఎలా పడిపోయిందంటే..?