TPCC Chief Revanth Reddy Has Lodged A Complaint With The CBI Against The Corruption Of The KCR Government :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం నాడు ఢిల్లీలో నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్ సర్కారు అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ కు వినతి పత్రం కూడా అందజేశారు. ఆ తర్వాత కార్యాలయం బయటకు వచ్చిన రేవంత్ అక్కడే మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని, కేసీఆర్ సర్కారు పాల్పడ్డ అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ తానే స్వయంగా సీబీఐకి వినతి పత్రం అందజేశానని కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి పొత్తు ఉందని కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ ఏమన్నారంటే..?
సీబీఐ డైరెక్టర్ ను కలిసి కార్యాలయం బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే.. ‘‘కోకాపేట్ భూముల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి. కోకాపేట్ భూముల్లో జరిగిన అవినీతి పై ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా ను కలిసి విచారణ జరిపించాలని కోరుతాం. కోకాపేట భూములను కేసీఆర్ బంధువులకు, కావాల్సిన వారికి తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టారు. రూ.2500 కోట్లకు భూములను అమ్మామనిని చెప్తున్నారు. తెలంగాణ రాష్టానికి 1500 కోట్లు నష్టం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున సీబీఐ డైరెక్టర్ ని కలవడం జరిగింది,రాత పూర్వకమైన నివేదిక ఇవ్వడం జరిగింది. కేసీఆర్ తెలంగాణ సంపదను కొల్లగొట్టి రాజకీయాలను కలుషితం చేసి అవినీతికి పాల్పడి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు. తెలంగాణ సంపదను కొల్లగొట్టి అవినీతి సొమ్ముతో రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తున్నారు. కేసీఆర్ కి కావాల్సిన గుప్పెడు మంది కొరకు తెలంగాణ సందపను దోచిపెడుతున్నాడు. కోకాపేట్, కానాపేట భూముల టెండర్లో గోల్మాల్ జరిగింది. దీనికి సహకరించిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్,సిద్ధిపేట కలెక్టర్ వెంకటారామిరెడ్డి పై సీబీఐ డైరెక్టర్ కి రాతపూర్వకమైన ఫిర్యాదు చేశాను. మై హోమ్ సంస్థ, రాజ్ పుష్ప సంస్థ, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి ప్రత్యక్ష లబ్ధిదారులు. వారి పై కూడా పిర్యాదు చేశాను. బండి సంజేయ్, కిషన్ రెడ్డి పదే పదే కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది, తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు జైల్ కి పంపిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. కనీసం కేసీఆర్ పై విచారణకు అదేశించడం లేదు. కేసీఆర్ అవినీతిపై విచారణకు అదేశించమని ప్రధాని,హోం మంత్రి, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల కానీ పిర్యాదు చేయడం లేదు. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే మోదీ, అమిత్ షా నీతి,నిజాయితీ పరిపాలన అందించాలంటే రాష్టంలో జరిగిన అవినీతి పై విచారణకు అదేశించాలని బండి సంజేయ్,కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. పాదయాత్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేసీఆర్ తో కుమ్మక్కు కాకపోతే మేము చేసిన పిర్యాదు పై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అడగండి. కేసీఆర్ అవినీతిపై ప్రధానికి,హోమంత్రికి పిర్యాదు చేయడానికి అపాయింట్మెంట్ దొరకడం లేదా? కేసీఆర్ తో బీజేపీ నేతలకు అవహగన లేకపోతే మేము ఇచ్చిన ఫిర్యాదు పై విచారణకు అదేశించాలి. బీజేపీ,టి.ఆర్ ఎస్ కుమ్మక్కు కాకపోతే బండి సంజేయ్,కిషన్ రెడ్డి నిజాయితీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని రేవంత్ రెడ్డి చాలానే మాట్లాడారు.
ఇన్ని తెలిసి ఫిర్యాదెలా చేశారో?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం ఉందని రేవంత్ రెడ్డే ఆరోపిస్తున్నప్పుడు.. మరి తన మిత్రపక్షమైన టీఆర్ఎస్ సర్కారుపై దర్యాప్తు చేయమని నరేంద్ర మోదీ సర్కారు ఎలా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తుందని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. సీబీఐ దర్యాప్తులన్నీ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలు చెప్పినట్టుగా జరుగుతాయన్న వాదన ఉంది కదా. మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ గతంలో నానా హంగామా చేసిన సీబీఐ.. తాజాగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై తన కౌంటర్ దాఖలుకు ఎంత సమయం తీసుకుందో తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారుతో మోదీ సర్కారు దోస్తానా చేస్తోందని చెబుతున్న రేవంత్.. అదే కేసీఆర్ సర్కారుపై దర్యాప్తు చేయండంటూ సీబీఐకి ఫిర్యాదు చేయడంలో అసలు రేవంత్ ఉద్దేశ్యం ఏమిటో తెలియడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- రేవంత్కు కేసీఆర్ ఇలా బ్రేకులేస్తారట