మహేశ్ బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. తమ హీరో సినిమాలు కొత్తగా ఉంటాయనీ, సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని వాళ్లు భావిస్తుంటారు. అందువకలన ఆయన కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగిన దగ్గర నుంచే సందడి చేయడం మొదలుపెడతారు. మహేశ్ బాబు కూడా అభిమానులు తనని ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించడానికే ప్రయత్నిస్తుంటాడు. తనకి .. అభిమానులకి మధ్య పెద్ద గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి మహేశ్ బాబుకి ‘బ్రహ్మోత్సవం’ .. ‘ స్పైడర్’ సినిమాలు భారీ పరాజయాలను ముట్టజెప్పాయి. దాంతో మహేశ్ బాబు తన కెరియర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాడు.

మహేశ్ బాబు తన ప్రణాళికలో భాగంగా, కథాకథనాలపై మంచి పట్టు ఉన్న దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథలో బలం .. కథనంలో వైవిధ్యం .. పాత్రల స్వరూప స్వభావాలు .. సన్నివేశాల్లో సహజత్వం .. కథకి ప్రాణమైన క్లైమాక్స్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధపెట్టాడు. అలాగే ముందుగా చెప్పిన ప్రకారం సినిమా విడుదలయ్యేలా చూసుకున్నాడు. ఈ కారణంగానే ఆ తరువాత ఆయన చేసిన ‘భరత్ అనే నేను‘ .. ‘మహర్షి’ .. ‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ మూడు సినిమాలు నిలిచిపోయాయి. దాంతో సహజంగానే ఆ తరువాత సినిమాపై అభిమానులు దృష్టిపెట్టారు.
Must Read ;- మహేష్ లిస్ట్ లో మరో స్టార్ డైరెక్టర్.. ఎవరతడు?
వరుస హిట్ల తరువాత మహేశ్ చేసే సినిమా అంటే అది ‘అంతకు మించి’ అన్నట్టుగా ఉండాలి. ఆయనతో సినిమా చేయాలనే ఉత్సాహంతో పెద్ద దర్శకులే కథలను వినిపించారు. వాళ్లలో మహేశ్ తో ఎంతో చనువుగా మసలుకునే వారు ఉన్నారు. అయినా మహేశ్ బాబు మొహమాటానికి పోలేదు. తనదైన స్టైల్లో సున్నితంగా తిరస్కరిస్తూనే, విషయంలేని కథలకు వీడ్కోలు పలికాడు. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు పరశురామ్ కి అవకాశం ఇచ్చాడు. ఆయనతో కలిసి ‘సర్కారువారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు.
పరశురామ్ పట్టుమని చేసింది అరడజను సినిమాలు మాత్రమే. వాటిలో భారీ హిట్ అనేది ఏదైనా ఉందంటే అది ‘గీత గోవిందం’ మాత్రమే. ఆ సినిమా అంతటి విజయం సాధించినా, ఆ వెంటనే ఆయన మరో ప్రాజెక్టును సెట్ చేసుకోలేకపోవడం విశేషం. ఆలస్యమైనా ఏకంగా మహేశ్ బాబునే ఒప్పించి రంగంలోకి దింపడం ఆశ్చర్యకరం. సుకుమార్ .. వంశీ పైడిపల్లి వంటి దర్శకులను కాదని ఆయన పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చాడంటే, ఈ కథలో ఏదో మేజిక్ ఉండేఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టైటిల్ విషయంలోనే పరశురామ్ కొత్తదనాన్ని చూపించాడు. ఈ తరహా టైటిల్ సెట్ కావడం మహేశ్ బాబు కెరియర్లో ఇదే మొదటిసారి అయ్యుంటుంది.
‘స’ అనే అక్షరంతో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సెంటిమెంట్ తోనే ‘సర్కారువారి పాట’ను సెట్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. టైటిల్ విషయంలోనే కాదు .. మహేశ్ బాబు లుక్ విషయంలోను పరశురామ్ కొత్తదనాన్ని చూపించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక మొదటి నుంచి కూడా పరశురామ్ కి స్క్రీన్ ప్లే పై మంచి పట్టుంది. ‘గీత గోవిందం’ అంతటి విజయాన్ని సాధించడంలో స్క్రీన్ ప్లే పాత్రే ప్రధానం. అందువలన ఆ దిశగా పరశురామ్ పై నమ్మకం పెట్టుకోవచ్చనే వారు లేకపోలేదు. అభిమానుల అంచనాలను అందుకోవడం .. తనపై మహేశ్ బాబు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పరశురామ్ కి అగ్నిపరీక్షే.
Also Read ;- కరోనా గిరోనా జాన్తానై అంటున్న రష్మిక?
https://www.youtube.com/watch?v=OsA1kGilBzA











