(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఎంవీపీ కాలనీలోని హిడెన్ స్పౌట్స్ స్వచ్ఛంద సంస్థలోని తాత్కాలిక నిర్మాణాల తొలగింపు అనేక మలుపులు తిరుగుతోంది.ఆ షెడ్ల కూల్చివేతపై మాజీ బీసీసీఐ కోచ్ విడుదల చేసిన ఓ వీడియో అందరినీ ఆలోచనలో పడేసింది. సంస్థకు చెందిన షెడ్డును జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం దురదుష్టకరం అని పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ బిసిసిఐ చీఫ్ కోచ్ ఎంఎస్ కె ప్రసాద్ ఈ వీడియోను విడుదల చేశారు. సాధారణంగా బుద్ధిమాంద్యం ఉన్న ఒక్క సంతానాన్ని పెంచి పోషించడం ఎంతో కష్టమని, అటువంటిది, సుమారు 150 మంది పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిస్వార్థ సేవ చేస్తున్న సంస్థ పట్ల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన వీడియోలో విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెస్కేకు అనుబంధం.
మాజీ బీసీసీఐ కోచ్కు ఈ సంస్థతో ఎంతో అనుబంధం ఉంది. విశాఖ వచ్చిన అనేక సందర్భాల్లో ఆయన ఈ స్కూల్ సందర్శించి తనకు తోచిన సాయం చేసేవారు. అటువంటి పిల్లల పట్ల ప్రతి ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రావాలని ఎమ్ఎస్కె కోరేవారు. అనేక సందర్భాల్లో సంస్థ నిర్వహణ కోసం ఎమ్మెస్కే ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు. అటువంటి సంస్థపై జీవీఎంసీ అధికారులు వ్యవహరించిన తీరు ఆయన్ను తీవ్రంగా కలచి వేసింది. అయితే ఈ తొలగింపు వెనక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అనే ముద్ర సంస్థ నిర్వాహకులపై ఉందనే ప్రచారం కూడా జరిగింది. తాను సాయం చేస్తున్న సంస్థ రోడ్డున పడడంతో మాజీ బీసీసీఐ కోచ్ స్పందించి వీడియోని విడుదల చేశారు.
జీవీఎంసీ ఏం చెబుతోందంటే..
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వ్ చేసిన లేఅవుట్ ఓపెన్ స్పేస్లో ఉన్న ఈ స్కూల్లో బుద్ధిమాంద్యం గల పిల్లలు ఉన్న భవనాన్ని జివిఎంసి కూల్చివేసిందని దుమారం రేగింది. దీనిపై జీవీఎంసీ స్పందించి ఖండన విడుదల చేసింది.
మానసిక వికలాంగులైన పిల్లల కోసం వ్యవస్థాపకుడు, కార్యదర్శి Hidden Sprouts School కె.శ్రీనివాస రావుకు విశాఖపట్నం సెక్టార్ -12 ఎంవిపి కాలనీలో రిజర్వు చేసిన బహిరంగ ప్రదేశంలో ఉన్న పాత శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని 2013 సంవత్సరంలో ఒక సంవత్సర కాలానికి నామమాత్రపు అద్దె ప్రాతిపదికన జీవీఎంసీ కేటాయించింది.పాఠశాల నిర్వహణకు తాత్కాలిక వసతిగా మానవతా ధృక్పధంతో లీజుకు ఇచ్చినట్టు ప్రకటనలో పేర్కొంది.వ్యవస్థాపకుడు శ్రీనివాసరావుకు ఈ భవనాన్ని నామమాత్రపు నెలవారీ అద్దెకు రూ.3,000 చొప్పున 26.06 చదరపు అడుగులు ఒక సంవత్సరానికి మాత్రమే ఈ క్రింది షరతులకు లోబడి లీజుకు ఇచ్చినట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.
షరతులు ఏంటంటే..
అద్దెదారు బయటి బహిరంగ స్థలాన్ని, కేటాయించిన నిర్మాణం పరిసరాలను ఉపయోగించుకోవడానికి అనుమతి లేదు. జివిఎంసి కార్యకలాపాలకు ప్రాంగణం అవసరమైతే లీజును ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేసి స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. అయితే వాటికి విరుద్ధంగా సంస్థ నిర్వాహకుడు ఆట స్థలం కోసం ఉద్దేశించిన లేఅవుట్ బహిరంగ స్థలాన్ని ఆక్రమించి, జీవీఎంసీ అథారిటీ నుండి ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయ భవనాన్ని షెడ్లు నిర్మించి విస్తరించారు.అంతే కాకుండా గత 7 సంవత్సరాల నుండి అనధికారికంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.పాఠశాలను బహిరంగ ప్రదేశంలో కొనసాగించలేమని ఉద్యానవనాన్ని పునరుద్ధరించడానికి ఆట స్థలాన్ని ఏర్పాటు చేయడానికి, పాఠశాల నిర్వాహకునికి ముందుగానే మౌఖికంగా ప్రాంగణాన్ని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసినట్టు వెల్లడించారు.COVID-19 విపత్తు ప్రారంభమైనప్పటి నుండి పాఠశాల నడపడం లేదు. కనుక జివిఎంసి ఆ స్థలాన్ని ఖాళీ చేయమని కోరిందని, దాని స్థానంలో ప్రత్యామ్నాయ కమ్యూనిటీ హాల్ను కూడా ఇచ్చిందని, కానీ నిర్వాహకుడు స్పందించలేదని అధికారులు తెలిపారు.కాగా Hidden Sprouts School కార్యదర్శి ప్రాంగణాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడక, COVID ప్రోటోకాల్ను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను తల్లిదండ్రులతో పాటు తొలగింపు సమయంలో కనిపించేలా చేసి, అవాంతరాలను సృష్టించారని అధికారులు స్పష్టం చేశారు.ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చి సామగ్రిని ఖాళీ చేయాలని కూడా చెప్పినప్పటికీ అంగీకరించలేదని అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే అనధికార నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఉద్యానవనం స్థలాన్ని పునరుద్ధరించడానికి మాత్రమే పాఠశాలను రిజర్వు చేయబడిన బహిరంగ స్థలం నుండి ఖాళీ చేయించామని, నిబంధనల ప్రకారం అక్కడ పార్కును అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.మానసిక, శారీరకంగా ప్రత్యేక సామర్ధ్యం కలిగిన పిల్లలు కోసం హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్నకు ఏదైనా ప్రత్యామ్నాయ వసతి ఇవ్వడానికి జివిఎంసి కమిషనర్ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి హామీ ఇచ్చినట్టు లేఖలో తెలిపారు.అందుకు స్కూల్ వ్యవస్థాపకులు శ్రీనివాస రావు కూడా అంగీకరించారని మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
Must Read ;- విజయసాయిరెడ్డి కన్ను పడితే కబ్జా: లోకేష్











