ఏపీలో పాక్షిక మద్య నిషేధం విధించామని ప్రచారం చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లకే మద్యం విక్రయాల ద్వారా,ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం మూడింతలు పెంచుకుందని టీడీపీ విమర్శిస్తోంది.టీడీపీ అధికారంలో ఉన్న 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి ఎక్సైజ్ ఆదాయం ద్వారా వచ్చిన మొత్తం రూ. 6,220.20 కోట్లు కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,914.75 కోట్లుగా ఉందని పేర్కొంది.ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంచనాలు సవరించిన తరవాత రూ.11,575కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా దాదాపు రూ.17వేల కోట్ల వరకు ఆదాయం వచ్చిందని టీడీపీ చెబుతోంది.ఓ వైపు కొవిడ్ సమయంలో కొన్నాళ్ల పాటు మద్యం దుకాణాలు మూసి ఉన్నా ఆదాయం పెంచుకునేందుకు విచ్చలవిడిగా మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తోందని విమర్శిస్తోంది.కాగా ఆ ఏడాది 3.06 కోట్ల మద్యం కేసులు విక్రయం ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.17,626కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతోంది.తాజా బడ్జెట్లోనూ రూ.15వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయడాన్ని టీడీపీ తప్పుబడుతోంది.
పాక్షిక మద్య నిషేధం అని చెబుతూనే..
ఓవైపు పాక్షిక మద్య నిషేధం అని చెబుతూ మరోవైపు విక్రయాలు పెంచుకునేందుకు భారీగా అంచనాలు పెంచడంలో అంతర్యం ఏంటని ప్రశ్నిస్తోంది.ఓవైపు కొవిడ్ కారణంగా ఆదాయం తగ్గిందని చెబుతున్నారని,అయితే 2019 ఆగస్టులో మద్యం ద్వారా రూ.1747.29 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రాగా 2020 ఆగస్టులో రూ.1635.07 కోట్లుగా వచ్చిందని, 2019 ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే 2020 సెప్టెంబర్లో 21.27 శాతం ఎక్కువ ఆదాయం వచ్చిందని గుర్తు చేస్తోంది.2019 సెప్టెంబర్లో రూ.1205.39 కోట్ల ఆదాయం వచ్చింది. 2020 సెప్టెంబరులో దాదాపు 1800కోట్ల ఆదాయం వచ్చినట్టు టీడీపీ చెబుతోంది.
పెరిగిన విక్రయాలు
ప్రభుత్వం చెబుతున్న ప్రకారం మద్యం దుకాణాలు తగ్గితే విక్రయాలు తగ్గాలని,కాని వైసీపీ ప్రభుత్వ హయాంలో విక్రయాలూ పెరిగాయని చెబుతోంది.ఇతరత్రా ఆదాయ మార్గాల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగితే అభ్యంతరం లేదని, అయితే కేవలం మద్యం విక్రయాలతోనే ఆదాయం పెంచుకునే విధానాలు సరికాదని విమర్శిస్తోంది.కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది.ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు.గతంలో కొన్ని బ్రాండ్ల విక్రయాలను నిలిపివేసి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడంతోపాటు ధరలు కూడా అధికంగా పెంచారు.ధరలు పెంచితే మద్యం తాగడం తగ్గుతుందని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే మద్యం ధరలు పెరిగినా విక్రయాలు తగ్గలేదని టీడీపీ చెబుతోంది.అదే సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం అక్రమ రవాణా పెరిగింది. పేరున్న బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయడంతో పక్కరాష్ట్రాల నుంచి ఆ బ్రాండ్ల మద్యం తెచ్చుకునే పరిస్థితి తలెత్తింది.ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మళ్లీ సదరు బ్రాండ్లను ఏపీలోకి అనుమతించింది.ఇప్పటికే లోకల్ బ్రాండ్ల విక్రయాలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మద్యం ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మద్యం విక్రయాలను పరోక్షంగా ప్రోత్సహిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది.
Must Read ;- జగన్కు మద్యంపై ఆదాయంపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదు:లోకేష్