రాజకీయాల్లో కొనసాగాలంటే హూందాతనం అవసరం. అది లేని రాజకీయాలు విలువలు లేని రాజకీయాల కిందే లెక్క. వ్యక్తిగతంగా ఎవరు ఎవరికీ శత్రువులు కానప్పటికీ.. కేవలం రాజకీయాల కోసం ప్రత్యర్థులను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ తప్పే. అలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారు తమ తప్పు తెలుసుకున్న తర్వాత అయినా తమ వైఖరి మార్చుకోవాలి. తప్పును ఒప్పుకోవాలి కూడా. విపక్షంలో ఉన్న పార్టీల కంటే కూడా అధికార పక్షంగా ఉన్న పార్టీల నేతలకు ఈ తరహా హుందాతనం మరింతగా అవసరమని చెప్పక తప్పదు. అంశం ఏదైనా, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా కూడా.. ప్రజలతో పాటు విపక్షాల్లోనూ అనుమానాలు రేకెత్తే ప్రమాదం లేకుండా అధికార పార్టీలు ముందుగానే స్పందిస్తే.. అసలు సమస్యే లేదు. అయితే ఏదో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మాదిరిగా విపక్షాలు స్పందించేదాకా మౌనవ్రతం పాటించి.. విపక్షాలు స్పందించాక అదను చూసుకుని విరుచుకుపడటం మాత్రం సరికాదన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. అయినా ఇంతలా ఉపోద్ఘాతం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటారా? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును, ఆయన ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ సర్కారుకు ముఖ్య సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు చేసిన వ్యాఖ్యలు విన్నవారు ఎవరైనా ఈ తరహా వాదనలనే వినిపిస్తారు.
సజ్జల ఏమన్నారంటే..?
మంగళవారం నాడు బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించేందుకు మీడియా ముందుకు వచ్చిన సజ్జల.. ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకుండానే.. చంద్రబాబు ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే.. ‘‘ప్రభుత్వంపై ఒక వర్గం విష ప్రచారం చేస్తోంది. పండోరా లీక్స్ కు సీఎం జగన్ కు ఏంటి? ఏ రాష్ట్రంలో ఏమి జరిగినా దానిని ఏపీకి ముడిపెడతారా ? మొన్న హెరాయిన్, నేడు పండోరా ప్రభుత్వానికి ముడి పెట్టాలని చూస్తున్నారు. ఒక వర్గం దుష్ప్రచారం చేస్తే మరొక వర్గం దీనిని వెనకుండి నడిపిస్తుంది. టీడీపీ నేతలు అంతా సినిమా డైరెక్టర్లుగా మారారు. డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా వైసీపీ నేతలకు అంటగడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారేమోన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో ఎప్పుడూ ఇంత స్థాయిలో డ్రగ్స్ పై చర్చ జరగలేదు. వారి విషయలు బయటకు వస్తాయని చర్చను పక్కదారి పట్టిస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది. పెద్ద మొత్తం డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలో లోకేష్ దుబాయ్ ఎందుకు వెళ్లారు?
డ్రగ్స్ పై సీబీఐ, డీఆర్ఐ విచారించి అసలు విషయాన్ని రాబట్టాలి. రెండేళ్లలో 2.5 లక్షల గంజాయి ఎకరాల పంట సెబ్ సీజ్ చేశాం. తమ పాలనలో గంజాయి ఎంత సాగు అయ్యిందో టీడీపీ నేతలు చెప్పాలి. టీడీపీ నేతలది బూటకపు స్వభావం. చంద్రబాబు చెప్పే ప్రతిదీ అబద్ధమే. పండోరా పేపర్సులో జగన్ పేరుందని చంద్రబాబు ఎలా అనగలరు? జగన్పై ఎంతో కాలంగా ఆరోపణలు చేస్తున్నా.. జనం నమ్మడం లేదు.. అయినా ఈ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలీషా అనే వ్యక్తి చంద్రబాబు, గంటా శ్రీనివాస్ తోనే పరిచయం. వెతికితే చాలా పట్టుకోగలం. వికీలీక్స్, పారాడైజ్ పేపర్స్, పనామా పేపర్స్, ఇప్పుడు పండోరా పేపర్స్ అంటూ విమర్శలు. పనామా పేపర్సులో హెరిటేజ్ సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రస్తావన ఉంది. తెల్గీ స్కామ్, హసన్ అలీ కుంభకోణం, కోలా కృష్ణమోహన్ ఇదీ టీడీపీ చరిత్ర. చంద్రబాబు స్వభావమే బూటకం. జగన్పై వేసినవి తప్పుడు కేసులేనని ప్రజలు నమ్మారు కాబట్టే అధికారంలోకి వచ్చాం. వైఎస్సార్ సీఎం ఉన్నప్పుడు జగన్ కనీసం సెక్రటేరియట్కు కూడా రాలేదు. హెరాయిన్ విషయంలో ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలపై న్యాయస్థానాలకు వెళ్తాం. చంద్రబాబును ఎక్కడ తడిమినా అనేక కుంభకోణాలు బయటపడతాయి. ఇంటర్నేషనల్ స్కామర్సుకు కన్సల్టెంటుగా పని చేయగల సిద్దహస్తుడు చంద్రబాబు’’ఇలా నాన్ స్టాప్గా సజ్జల తపదైన శైలి దాడికి దిగారు.
వ్యక్తిగత పర్యటనలనూ ప్రశ్నిస్తారా?
ఇటీవలే వైసీపీ కీలక నేత, సీఎం జగన్ మామ గారు, జగన్ కేబినెట్లో కీలక శాఖల మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన మిత్రబృందంతో కలిసి రష్యా టూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఆ పర్యటన గురించి ఎవరికీ తెలియదనే చెప్పాలి. అయితే ప్రైవేట్ జెట్లో తన విలాసాన్ని ప్రదర్శించుకుంటూ ఫ్లైటెలో దిలాసాగా కూర్చున్న తన ఫొటోను బాలినేనే స్వయంగా బయటపెట్టారు. ఓ మంత్రిగా ఉంటూ ఇలా ప్రైవేట్ జెట్లలో విలాసం ఒకలబోయడం ఎంతవరకు సమంజసం అంటూ దాదాపుగా అన్ని పార్టీలు కూడా వైసీపీ సర్కారు నిలదీశాయి. అయితే ఇది తన వ్యక్తిగత పర్యటన అని, దీనిని ఎవరూ ప్రశ్నించజాలరంటూ విరుచుకుపడ్డ బాలినేని.. తన వెంట టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారంటూ ఎదురు దాడికి దిగారు. అయినా బాలినేని పర్యటన వ్యక్తితమైనా.. అసలు విషయాన్ని చెప్పకుండా తన డాబూ దర్పార్ని ప్రదర్శించుకుంటూ ఆయనే తన పర్యటనను వివాదాస్పంద చేసుకున్నారు. తీరా దాని వివరాలు బయటపెట్టమంటే మాత్రం చప్పుడు చేయలేదు కదా. మరి ఓ మాజీ మంత్రిగా విపక్ష పార్టీ టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నారా లోకేశ్ దుబాయికి వెళ్లాలంటే అందరికీ చెప్పి వెళ్లాలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారంలో ఉండగా.. తమ విదేశీ పర్యటనలన్నీ మీడియాకు చెబుతూనే లోకేశ్ గానీ, చంద్రబాబు గానీ సాగారు కదా. మరి ఇప్పుడు విదేశీ పర్యటనలు కాదు కదా.. కనీసం ఢిల్లీ పర్యటనలకు అధికారిక హోదాలో వెళుతున్నా.. అక్కడ ఏం చేశారన్న విషయాన్ని స్వయంగా సీఎం జగనే చెప్పడం లేదు కదా. ఇలాంటి నేపథ్యంలో వేలాది కోట్ల మేర మాదకద్రవ్యాలు పట్టుబడితే.. ఆ డ్రగ్స్ విజయవాడకు తరలివస్తున్న వైనం బయటపడితే.. ముందుగా స్పందించాల్సింది ప్రభుత్వమే. అయితే జగన్ సర్కారు మౌనవ్రతాన్ని పాటిస్తే.. ఈ దందా గుట్టేమిటో తెలపాలంటూ బాధ్యత కలిగిన ఓ విపక్షంగా టీడీపీ అడగడంతో తప్పేముంది? అదే సమయంలో తాము ఎంత అడిగినా.. కనీస వివరణ కూడా లేకపోతేనే కదా అధికార పక్షంపై విపక్షం దాడి చేసింది. దీనిపై బాధ్యతగా స్పందించాల్సిన సజ్జల మరీ దిగజారిపోయి చంద్రబాబు, ఆయన ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ముహూర్తం ఫిక్స్.. ఉండేదెవరు?, ఊడేదెవరు?