ఎన్నికల్లో ఓటమి తాలూకు లుకలుకలు కాంగ్రెస్లో ఇంకా సమసిపోయినట్టు కనిపించడం లేదు. వాటికి సంబంధించి నాయకులు ఒక్కో మాట వినిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రింత పార్టీకి ఎంతో విధేయులుగా పేరుగాంచిన కపిల్ సిబాల్, చిదంబరం సైతం బహిరంగంగానే పార్టీకి సుతిమెత్తగా చురకలంటించారు. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీలో కీలకమైన నేత ‘గులాం నబీ ఆజాద్’ నిరసనగళాన్ని వినిపిస్తున్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రక్షాళనకు పూనుకుంటుందా…
కాంగ్రెస్ నిర్మాణం కుప్పకూలింది
బిహార్, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ… ఇలా రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి గురించి పార్టీలో నాయకులు విమర్శించడం మొదలుపెట్టారు. ఈ ఓటమి అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ మొదటిసారిగా స్పందించారు. పార్టీ నిర్మాణం కుప్పకూలిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఉద్దేశం పార్టీని ఎదిరించడం కాదని, పార్టీని క్రింది స్థాయి నుంచి ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు.
నాయకత్వ లోపం లేదు
పార్టీలో నాయకత్వానికి, నాయకులకి లోటు లేదని చెప్పారు. అంతేకాదు, ఓటమి ఎదురైన ప్రతిసారీ నాయకత్వానికి మచ్చ ఆపాదించడం సరైన పనికాదని తెలియజేశారు. పార్టీలో, నాయకత్వంలో ఎటువంటి లోపం లేదనేది తన అభిప్రాయమని చెప్పారు. పార్టీ నాయకత్వం మారితే విజయం వరిస్తుందని భావిస్తే, దానంత తప్పు లేదని చెప్పుకొచ్చారు. పార్టీలోని లోపాలను సవరించుకుంటే దానంత మేలు ఉండదని అదే పార్టీని విజయతీరాలకు చేరుస్తుందని చెప్పారు.
నాయకుల్ని గుర్తించాలి
పార్టీని పంచాయతి, మండల స్థాయి నుంచి పటిష్ఠం చేయాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు. క్రింది స్థాయి కార్యకర్తలను గుర్తించి వారికి నాయకులుగా ఎదిగే అవకాశం ఇస్తే, అలాంటివారి వల్ల పార్టీ బలపేతమవుతుందని అధిష్టానానికి తెలియజేశారు. అంతేకానీ, ఓడిన ప్రతిసారి నాయకత్వ తప్పిదం అనడం వల్ల కలిగే ఉపయోగం ఏమి ఉండదని తన అభిప్రాయాన్ని తెలియపరచారు.
Must Read ;- పార్టీకి నష్టం లేకుండా , ఎవ్వరనీ నొప్పించకుండా.. టీడీపీ ముందు మరో సవాల్
హోటల్ సంస్కృతి మారాలి
పార్టీ టికెట్ ని అందుకున్న మరుక్షణం ఏసి హోటల్స్ లో బస చేస్తున్నారంటూ నాయకుల నిర్లక్ష్య ధోరణిని దుయ్యబట్టారు. హోటల్స్ ని వదిలి ప్రజలతో మమేకం అయినపుడే ప్రజల సాధక బాధలు తెలుస్తాయని, వారు మిమ్మల్ని గుర్తిస్తారని తెలిపారు. ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం లోపించిందని, దానిని నిర్మూలించాలంటే దేశ వ్యాప్తంగా ఉన్న నాయకులు ప్రజా పక్షానా నిలిచి ప్రజలతో కలిసి పనిచేసినపుడే తిరిగి పార్టీ ప్రజలలో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
కృషితో విజయమందుతుంది
ఒకప్పటి పరిస్థితులు నేడు కాంగ్రెస్ లేవని విమర్శించారు. ఒకప్పుడు ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు లేదని, దాని వల్ల స్వేచ్ఛాయుత నిర్ణయాలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో పార్టీ బలహీనపడ్డప్పుడు, బాధ్యతలు నిర్వహించి, అక్కడ పార్టీ అధికారం లోకి వచ్చేలా కృషి చేశానని వివరించారు. అందుకు కారణం ఇన్ ఛార్జీలకు పూర్తి బాధ్యతలు ఇవ్వడమే కారణమని చెప్పారు. ఇప్పడికైనా అధిష్టానం నాయకుల అభిప్రాయాలను విలువనిచ్చి, వారి మాటలను విమర్శలుగా కాకుండా సలహాలుగా భావించి పాటిస్తే, పార్టీ తిరిగి విజయాలందుకుంటుందని చెప్పారు. లేకపోతే అధికారం కల్లగానే మిగిలిపోతుంది.
ఇది ఖచ్చితంగా- అప్పటి తిరుగుబాటు ఫలితమే..
కొన్నాళ్ల కిందట జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ తిరుగుబాటు జెండా ఎగరేసినట్లుగా.. నాయకత్వం మీద ఘాటైన విమర్శలు చేసినట్లుగా ఆరోజు వార్తలు వచ్చాయి. అదే రోజున ఇతర సీనియర్లు వారిని బుజ్జగించడమూ.. తన తిరుగుబాటు ట్వీట్లను కపిల్ సిబల్ తర్వాత తొలగించడమూ జరిగింది. కొన్నా వారాల గ్యాప్ తర్వాత.. ఆ రోజు ఘాటుగా స్పందించిన నాయకులే ఇప్పుడు మళ్లీ గళం విప్పుతున్నారు. ఇవాళ ఆజాద్ మాటల్లో కూడా ఎంతగా.. నాయకత్వం పట్ల ధిక్కారస్వరం దోబూచులాడుతూనే ఉంది. మరి ఇలాంటి పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ఎలా నెగ్గుకువస్తుందో చూడాలి.
Also Read ;- వేరుకుంపటికి ఆజాద్ కేంద్రబిందువా?