తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.ఎం. గురుమూర్తి సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,31, 943ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే.. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు తక్కువగా ఉండడం, కౌంటింగ్ దాదాపు పూర్తి కావడంతో గెలుపు ఖరారైంది. అధికారికంగా తుది లెక్కలు తేలాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మొత్తం 5,37,152 ఓట్లు పోలవ్వగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 3,05,209 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ-జనసేన అభ్యర్ధి రత్నప్రభకు 50,739 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతమోహన్కి 8,477 ఓట్లు, నోటాకు 13,401 ఓట్లు పోలయ్యాయి.
గత మెజార్టీ కంటే ఎక్కువ..
ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతోపాటు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని అధిగమించింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నికలు జరిగాయి. 2019లో ఈ నియోజకవర్గంలో పోటీచేసిన బల్లి దుర్గాప్రసాద్ కి 2,28,376 మెజార్టీ రాగా ఈ సారి ప్రాథమిక సమాచారం మేరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి2,31,943 మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 17,10,699 మంది ఓటర్లుండగా10,99,784 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే 2019 ఎన్నికలతో పోల్చితే 2021 ఉప ఎన్నికలో పోలింగ్ 15 శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో 13,04,262 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్ శాతం 79.03గాఉంది. తాజాగా ఈ ఎన్నికల్లో 64 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఇక మెజార్టీ ల విషయానికి వస్తే 2019లో బల్లి దుర్గాప్రసాద్ 7,22,877 ఓట్లు (55.03)రాగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కి 4,94,501ఓట్లు (37.65)శాతం వచ్చాయి. జనసేన-బీఎస్పీ అభ్యర్థి శ్రీహరిరావుకి 20917ఓట్లు (1.6శాతం) కాగా బీజేపీ అభ్యర్థి బి.శ్రీహరి రావుకి 16,125 ఓట్లు (1.22శాతం) వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కి 24039ఓట్లు (1.83శాతం)వచ్చాయి. 2019ఎన్నికల్లో నోటాకి 25,781 ఓట్లు రాగా ఈ సారి 13వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. మొత్తం మీద ఓట్ల సంఖ్య తగ్గినా వైసీపీ మెజారిటీ పెరిగింది. అదే సమయంలో బీజేపీ-జనసేన పార్టీలకు కూడా ఓట్లు పెరిగాయి.
జగన్ విధానాల వల్లే గెలుపు
కాగా ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ పాలనను చూసి పట్టం గట్టారని, టీడీపీ, బీజేపీ, జనసేనతోపాటు ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. లేని పోని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను ప్రజలు నమ్మడం లేదని వైసీపీ చెబుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, మూడు రాజధానుల అంశం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు, లోకేష్ విమర్శలను జనం పట్టించుకోలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.
దొంగ ఓట్ల గెలుపు..
కాగా ఈ గెలుపు దొంగ ఓట్ల గెలుపని, నైతికంగా వైసీపీ పరాజయమని టీడీపీ, బీజేపీ ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజునే భారీగా నకిలీ ఓటర్లను పట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. లోక్సభ పరిధిలో దాదాపు 3లక్షల నకిలీ ఓటర్లతో ఓట్లు వేయించారని అప్పట్లోనే ఆరోపించాయి. ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా టీడీపీ, బీజేపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 3లక్షల నకిలీ ఓటర్ల ద్వారా ఓట్లు వేయించుకున్నారని, అందుకే 3లక్షల మెజార్టీ అని చెబుతున్నారని, క్షేత్ర స్థాయిలో వైసీపీ పార్టీ పట్ల, జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఓటమి భయంతో నకిలీ ఓటర్లతో ఓట్లు వేయించిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పొందినా.. 2019 ఎన్నికల్లో పోల్చితే ఓట్లు పెరిగాయని చెప్పవచ్చు. జనసేన, బీఎస్పీ అభ్యర్థికి, బీజేపీకి వచ్చిన ఓట్లు కలిపినా..ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లకంటే తక్కువే ఉన్నాయని, బీజేపీకి ఓట్లు పెరిగాయని బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఏపీలో పాగా వసేందుకు చూస్తున్న బీజేపీకి, వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన టీడీపీకి ఈ ఫలితం నిరాశను కలిగించిందని చెప్పవచ్చు.
Must Read ;- సాగర్లో కారు స్పీడుకు కాంగ్రెస్ కుదేలు.. బీజేపీకి ఎదురుదెబ్బ











