(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో ఆదివారం పూట అధికార పార్టీ అప్రతిహతంగా కొన్నాళ్ల పాటు సాగించిన దౌర్జన్య కాండలో ఎక్కడా న్యాయం లేదని మరోమారు రుజువైంది. తెలుగుదేశం పార్టీ నేతల టార్గెట్గా విశాఖలో ప్రతి ఆదివారం ఆస్తుల కూల్చివేత, స్వాధీనం ప్రక్రియను కొన్ని వారాల పాటు అధికారులు కొనసాగించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు చేసిన విధ్వంసంపై తాజాగా హైకోర్టు తప్పు పట్టడంతో పాటు జరిమానా కూడా విధించింది. తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన విశాఖలోని ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ ఖాళీ చేయించడానికి విఎంఆర్డిఎ అధికారులు అనుసరించిన తీరును తప్పు పట్టింది. ఖాళీ చేయించిన ప్రాంగణాన్ని వారం రోజుల్లో తిరిగి ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్కు అప్పగించాలని ఆదేశించింది. నిబంధనలను, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ఆదివారం రోజున బలవంతంగా ఫ్యూజన్ ఫుడ్ ఖాళీ చేయించినందుకు ప్రతివాదులు నుంచి పిటిషనర్ 25, 000 ఖర్చులు నిమిత్తం పొందేందుకు అర్హులని పేర్కొంది.
ఈ కేసు ద్వారా అనేక విషయాలు..
ఇరువర్గాల వాదోపవాదాలు విన్న కోర్టు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. లీజు దారుల రక్షణ చట్టం ప్రకారం ప్రాపర్టీని వదిలి వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని స్పష్టం చేసింది. అద్దె చెల్లించకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి కారణాలు లేనప్పుడు పిటిషనర్ ఖాళీ చేయడానికి సమయం ఎందుకు ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. సూర్యాస్త సమయం నుంచి సూర్యోదయం మధ్య సివిల్ అరెస్టులు చేయకూడదని, ఆ సమయంలో కూల్చివేతలు చేపట్టకూడదని, సెలవు రోజులు, ఆదివారాల్లో ఖాళీ చేయించ కూడదని అలా చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. ఫ్యూజన్ ఫుడ్స్ వ్యవహారంలో పిటిషనర్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడనప్పుడు పోలీసు బలగాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని కోర్టు ప్రశ్నించింది.
విశాఖలో జరిగినవన్నీ ఉల్లంఘనలే..
గీతం విశ్వవిద్యాలయం ఆస్తులపై దాడులను అర్ధరాత్రి ప్రారంభించారు. సూర్యోదయం సమయానికి సగానికిపైగా కూల్చివేతలు పూర్తి చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో కోర్టు వెంటనే స్టే మంజూరు చేసింది. మాజీ మేయర్ సబ్బంహరి కార్యాలయం ఆవరణలోని నిర్మాణం తొలగింపు విషయంలోనూ సెలవు రోజునే జీవీఎంసీ అధికారులు ఎంచుకున్నారు. కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని సబ్బం హరి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలోనూ కోర్టు జోక్యం చేసుకుని స్టే ఇవ్వాల్సి వచ్చింది. మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల పైన ఆదివారం పూటే దాడులు చేశారు. పలు నిర్మాణాలను స్వాధీనం చేసుకొని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం పైన ఆ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. అదేవిధంగా భీమిలి దరి మంగమారి పేట వద్ద గో కార్ట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ భారీ నిర్మాణాలు లేకపోవడంతో న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా లేకపోయింది. ఈ వ్యవహారం కూడా కోర్టులో నలుగుతోంది.
స్టే వెకేట్ చేయించుకోలేని ప్రభుత్వం..
అధికారాన్ని అడ్డం పెట్టుకొని న్యాయానికి, చట్టానికి విరుద్ధంగా అడ్డగోలుగా చేపట్టిన కూల్చివేతలు, ఆస్తుల స్వాధీనంలో అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు విధించిన స్టే ఒక్కటి కూడా వెకేట్ చేయించలేకపోయింది. ప్రభుత్వం తరఫున అధికారులు వినిపిస్తున్న వాదనలో పస, బలం లేక పోవడమే అందుకు కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల నేతలను భయపెట్టడం లక్ష్యంగా ఈ చర్యలకు పాల్పడిన అధికారులకు సైతం ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ, మంత్రుల మెప్పు కోసం చేపట్టిన కూల్చివేతలతో చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. అధికారులకు ఎన్నిసార్లు న్యాయస్థానం అక్షింతలు వేస్తున్నా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. బాధితులకు నగదు రూపంలో భారీ మొత్తంలో చెల్లింపులు చేసేలా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తే తప్ప వీరికి బుద్ధి రాదని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.
Also Read:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్