తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత... ఆ రెండు ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలు ఇటు ఏపీలోనూ పలు పార్టీల్లో కలవరాన్ని పెంచేశాయి. దుబ్బక తరహాలోనే త్వరలోనే ఏపీలోని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాదరావు హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఈ ఎన్నికకు ఇంకా షెడ్యూలే ఖరారు కాకున్నా… అన్ని పార్టీలు ఇప్పటికే లైన్లోకి వచ్చేశాయి. తెలంగాణలో ఊహించని ఫలితాలతో మంచి హుషారు మీదున్న బీజేపీ.. తిరుపతి బైపోల్పైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ అంశం ఏపీలోని అధికార వైసీపీ కంటే కూడా విపక్ష తెలుగు దేశం పార్టీలోనే పెను కలవరాన్ని సృష్టిస్తోంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నా… అసలు బీజేపీ గనుక తిరుపతి బైపోల్ బరిలోకి దిగితే.. అనుసరించాల్సిన వ్యూహమేంటన్న విషయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు.
Must Read ;- తిరుపతి కోసం పవన్ ఢిల్లీ రాజకీయాలు
టీడీపీలో ఆందోళన
అయినా తిరుపతి బరిలోకి బీజేపీ దిగితే… అక్కడి సీటును తిరిగి దక్కించుకునే విషయంలో అధికార వైసీపీ ఆందోళన చెందాలి గానీ.. విపక్షంగా ఉన్న టీడీపీ అంతగా ఇదైపోవాల్సిన పనేముంది? అన్న విషయం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందుకు ఓ లెక్క కూడా ఉందని చెప్పాలి. ఈ లెక్క తెలియాలంటే… ముందుగా తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల దగ్గరకెళ్లాలి. దుబ్బాకను 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సోలిపేట సతీమణినే బరిలోకి దించి సానుభూతిని క్యాష్ చేసుకునే ప్లాన్ వేసింది. బండి సంజయ్ నేతృత్వంలో రఘునందన్ రావును బరిలోకి దించిన బీజేపీ… టీఆర్ఎస్కు షాకిస్తూ సూపర్ విక్టరీని సాధించింది. ఇక తనకూ బలముందని చెబుతూ బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడిపోయింది. అదే రీతిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సమరోత్సాహంతో బరిలోకి దిగిన బీజేపీ… అప్పటిదాకా తనకున్న నాలుగు స్థానాలతో పాటు మరో 44 స్థానాలను ఎగురవేసుకుపోయింది. ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా నష్టపోయింది. అంతిమంగా ఈ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉన్నా… ఆ పార్టీ కంటే ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. అంటే… కాంగ్రెస్ ఓట్లను గంపగుత్తగా బీజేపీ ఎగరేసుకెళ్లిందన్న మాట.
బీజేపీ గెలిస్తే టీడీపీ మరింతగా బలహీనపడినట్టే..
ఇదే లెక్కన…. తిరుపతి బై పోల్లోనూ బీజేపీ తనదైన శైలి వ్యూహాన్ని అమలు చేస్తోంది. అధికార వైసీపీతో పాటుగా విపక్ష టీడీపీని కూడా టార్గెట్ చేస్తూ ఏపీ బీజేపీ ఎదురు దాడిని మొదలెట్టింది. తిరుపతి స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తున్న వైసీపీకి అక్కడ ఓటమి ఎదురైనా పెద్దగా నష్టమేమీ లేదు. అక్కడ బీజేపీ గనుక గెలిస్తే… టీడీపీ మరింతగా బలహీనపడినట్టే లెక్క. అంటే… తిరుపతి ఉప ఎన్నికలో తాను విజయం సాధించేందుకు వైసీపీ ఓటర్ల కంటే కూడా టీడీపీ ఓటర్లనే బీజేపీ టార్గెట్ చేయనుంది. అధికారంలో ఉన్న వైసీపీ ఓట్లు అంతగా చీలకున్నా.. అంతకంతకూ బలహీనంగా మారిపోతున్న టీడీపీ ఓట్లనే ఎగురవేసుకు పోవడంతో పాటు ఏకంగా విజయఢంకా మోగించాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే పనబాక లక్ష్మీని తన అభ్యర్థిగా ప్రకటించుకున్న టీడీపీ… తన కేడర్ చెల్లాచెదురు కాకుండా వ్యూహాలు అమలు చేస్తోంది. జనసేనతో కలిసి తన అభ్యర్థిని త్వరలోనే ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్న బీజేపీ.. తిరుపతి పరిధిలోని మెజారిటీ ఓటింగ్ను సాధించుకునేందుకు టీడీపీ ఓటర్లనే టార్గెట్ చేస్తోంది. ఇందుకే తిరుపతి బరిలో బీజేపీ దిగుతోందంటే.. వైసీపీలో కంటే టీడీపీలోనే ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. ఇక తిరుపతిలో ఊహించని రీతిలో బీజేపీ గనుక విజయం సాధిస్తే.. అది రాష్ట్రవ్యాప్తంగా టీడీపీని బలహీనపరిచే అంశమేనన్న వాదనలు పెరిగిపోతున్నాయి.
Also Read ;- టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!