గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలన్ని నిమగ్నమయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో జనసేనాని పవన్కళ్యాణ్ కూడా బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఈ ఎన్నికలను ఈ జనసేనాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. కనీసం డబుల్ డిజిట్ ఫిగర్ సీట్లనైనా కైవసం చేసుకునేందుకు గెలుపు దిశగా ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారట.
150 డివిజన్లకు గానూ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో 40 సీట్లను పవన్కళ్యాణ్ టార్గెట్ పెట్టుకున్నారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సెటిలర్లు, యువత ఓట్లపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నకున్నది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తోంది. గతంలో సెటిలర్లు ఎక్కువగా టీడీపీ వైపే మొగ్గుచూపేవారు. అయితే ఈసారి మాత్రం దానికి భిన్నంగా జనసేనవైపు సెటిలర్లు చూసే అవకాశం ఉంది. అలాగే యూత్లో పవన్కళ్యాణ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ అభిమానాన్ని ఓట్ల రూపంలో మల్చుకోవడంలో జనసేన పార్టీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. తమ అభిమాన కథానాయకుడివైపు నిలబడతారా? లేక అభిమానం అభిమానమే.. ఎన్నికలు ఎన్నికలే.. అని అంటారా? అనేది ఫలితాలు వెల్లడైతేగానీ చెప్పలేము.
గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, జనసమితి, ఎంఐఎం, జనసేన, టీడీపీ, వామపక్ష పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియ కూడా నిన్ననే ప్రారంభమైంది. తొలి రోజు కావడంతో అన్ని పార్టీల నుంచి 20 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇంకా అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే పనిలో ఆయా పార్టీలు ఉన్నాయి. బీజేపీ 21, టీఆర్ఎస్ 105, కాంగ్రెస్ 45, ఎంఐఎం 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుద చేశారు. అయితే జనసేన పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ఎంపిక చేసుకునే పనిలోనే ఉన్నది. మొత్తంగా 150 డివిజన్లలో 40 మంది గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపేందుకు కసరత్తులు చేస్తోంది. జనసేనాని ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాడో లేదో చూడాల్సి ఉంది.