పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ చాలాకాలం తర్వాత.. రాజకీయంగా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన మంగళగిరి లో రాజకీయ సమావేశాలు నిర్వహించారు. తన పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాలు పెట్టుకున్నారు. ఇదే రోజున.. ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసి తీరుతున్నాం అని ప్రకటించారు. సోమవారం నాడు పార్టీ తెలంగాణ నాయకుడు శంకర్ గౌడ్.. బల్దియా ఎన్నికల్లోపోటీచేస్తున్నాం అని ప్రకటించి.. శ్రేణులను సమాయత్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే పవన్ కల్యాణ్ పోటీకి సిద్ధం అనే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కార్యకర్తల అభీష్టం మేరకే పోటీచేస్తున్నట్లు ఆయన చెప్పేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది.
అయితే ఇదే రోజున తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఒంటరిగా పోటీచేస్తుందని కుండబద్ధలు కొట్టి చెప్పారు. పొత్తుల గురించి తమను ఇప్పటిదాకా ఎవరూ సంప్రదించలేదని కూడా అన్నారు. ఎవరితోనూ పొత్తు ఉండదని తాము సొంతంగా మాత్రమే పోటీచేస్తామని సంజయ్ చెప్పారు.
ఆయన నేరుగా పేర్లు ప్రస్తావించలేదు గానీ.. పవన్ కల్యాణ్ తో పొత్తులతో గ్రేటర్ బరిలోకి వెళ్లబోవడం లేదని స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టే లెక్క. అదే సమయంలో బండి సంజయ్.. ఈ ఎన్నికల్లో తమకు పోటీ ప్రధానంగా ఎంఐఎంతో మాత్రమేనని ప్రకటించడం గమనార్హం. ఒక రకంగా ఇది మైండ్ గేమ్ కావొచ్చు. ప్రత్యర్థఇ తెరాస బలహీన పడిపోయిందని, వారు తమకు అసలు పోటీనే కాదని, వారిని లెక్కలోకి తీసుకోవడం లేదని అనడం.. మైండ్ గేమే. ఎంఐఎం మాత్రమే తమకు పోటీ అని ప్రకటించిన బండి సంజయ్.. కేవలం మతం కార్డు మీదనే.. ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధ పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
Must Read ;- నల్లేరు మీద నడకే.. గ్రేటర్ పీఠం గులాబీదే
పవన్ పరిస్థితి ఏమిటి?
పవన్ కల్యాణ్ మాత్రం తన ప్రెస్ నోట్ లో .. తమ పార్టీకి జీహెచ్ఎంసీ పరిధిలో పలు డివిజన్లలో అపారమైన కార్యకర్తల బలం ఉందని సెలవిచ్చారు. అలా నగరమంతా.. అనకుండా.. పలు డివిజన్లలో అని అనడంలో ఆయన అంతరార్థం.. కొన్ని డివిజన్లు మాత్రం తీసుకుని బీజేపీ సపోర్టుతో పాగా వేద్దాం అనేది కావచ్చు. కానీ.. అవతల బండి సంజయ్ పవన్ మాటలను, ప్రకటనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దుబ్బాక విజయం ధీమాతో.. బీజేపీ దూకుడు మీద ఉంది. ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేదు.
పొత్తులు లేకుండానే ఎన్నికలకు వెళ్లవలసి వస్తే.. పవన్ కల్యాణ్ ధైర్యంగా బరిలోకి దిగుతారా? ఆయన చెప్పినట్టు కొన్ని డివిజన్లు అయినా పోటీచేస్తారా? కనీసం అతికొన్ని అయినా గెలవగలుగుతారా? బీజేపీతో కూడా పోటీపడాల్సి వస్తే.. ఓడిపోతే గనుక.. ఎందుకూ కొరగాని ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం.. ఆయన పార్టీ మీద ఏపీ వ్యాప్తంగా కూడా దారుణంగా పడుతుంది కదా.. పవన్ కల్యాణ్ ఈ లెక్కలేమీ వేసుకోకుండానే.. ఎన్నికలకు సిద్ధపడుతున్నారా? అనేది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీతో కలిసి అయితే ఫలితాలు కొంత ఆశాజనకంగా ఉండవచ్చు గానీ.. ఒంటరిగా బరిలోకి దిగితే.. ఏమౌతుందో అనే సందేహం పార్టీలో కూడా ఉంది.
ఇది బీజేపీ మైండ్ గేమా?
సీట్ల విషయంలో గట్టిగా పట్టుపట్టకుండా.. ఇచ్చినవి తీసుకునేలా జనసేనానిని ఒప్పించడానికి ఇది బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ కావచ్చుననే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది. అసపలు తాము ఒంటరిగానే పోటీచేస్తాం అనడం, ఎవరూ పొత్తులకోసం సంప్రదించలేదు అనడం ద్వారాా.. మీ అవసరం మాకు లేదు అని బీజేపీ.. పవన్ కు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. పొత్తుల కోసం వెళితే.. ఇచ్చిన సీట్లు తీసుకోమని మాత్రం అంటుంది. అలాంటప్పుడు పవన్ కు డిమాండ్ చేసే స్థాయి పోతుంది.. అందువల్ల బీజేపీ ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతుండవచ్చుననే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.
Also Read ;- పవర్ స్టార్ మళ్ళీ ‘బాలు’ గా ‘పంజా’ విసురుతాడా?