చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలే ఆయన దీనికి సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయన తన పాత బైక్ గురించి వివరిస్తూ..ఫొటోలు ట్వీట్ చేశారు. కాసేపు అభిమానులతో చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా ఓ వ్యక్తి మీరు భారతదేశంలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీలో ఎప్పుడు చేరతారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. సదరు అతిపెద్ద పార్టీ..ఎప్పుడు కేసీఆర్ అవినీతిపై, దోపిడీపై చర్యలు తీసుకుంటుందో అప్పుడు తాను చేరతానని చెప్పారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. దీనిపై కాసేపు ట్విట్టర్లో చర్చ జరిగింది. బీజేపీ ఇప్పటికే ఆ దిశగా కసరత్తు ప్రారంభించిందని, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ప్రభావం చూపించిందని, ఇక దోపిడీపై చర్యలూ మొదలవుతాయని మరికొందరు బదులిచ్చారు. బండి సంజయ్ నాయకత్వంలో అవి మొదలవుతాయని కొందరు వ్యాఖ్యానించారు.

కొన్నాళ్ల క్రితమే బీజేపీలో చేరతారని ప్రచారం
వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా..ఆయన ఖండించారు. వైద్యరంగంలో అంతర్జాతీయంగా పేరున్న అపోలోగ్రూప్లో కీలకమైన వ్యక్తిగా, యువపారిశ్రామిక వేత్తగా, సేవా కార్యక్రమాల్లో చురుకైన వ్యక్తిగా పేరున్న కొండా విశ్వేశ్వర్రెడ్డిని అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకున్నారు. తరువాత జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. టీఆర్ఎస్ వైఖరి నచ్చక..ఆయన పార్టీని వీడారు. కొన్నాళ్ల విరామం తరువాత కాంగ్రెస్లో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోరులో స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. కొండా విశ్వేశ్వర్రెడ్డిపై కక్ష సాధింపులో భాగంగా కేసీఆర్ దొంగదెబ్బ తీసే వ్యూహం అమలు చేశారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్రెడ్డితో కొందరు బీజేపీ నాయకులు భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారని చెబుతున్నారు.
తెలంగాణను కేసీఆర్ కుటుంబం చేతుల్లో నుంచి విడిపించడమే లక్ష్యం
మరోవైపు తెలంగాణలో కేసీఆర్ దోపిడీని అడ్డుకోవడం, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం చేతుల్లో నుంచి విడిపించడమే లక్ష్యమని గతంలో పలుమార్లు కొండా వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. ఇక బీజేపీ తెలంగాణలో ఆపరేషన్ కమలంలో భాగంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో ఉంది. ఇప్పటికే స్వామిగౌడ్ లాంటి వారిని చేర్చుకుంది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి తమ పార్టీలోకి వస్తే.. రాజకీయంగా చాలా సానుకూల అంశంగా మారుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజకీయంగా శత్రుత్వాలు చాలా తక్కువగా ఉన్న వ్యక్తిగా, వివాద రహితుడిగా కొండా విశ్వేశ్వర్రెడ్డికి పేరున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరేందుకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఉండదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. మరోవైపు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తాము కూడా కేసీఆర్ దోపిడీని బయటకు తీస్తామని, కేసీఆర్ అవినీతిపై విచారణ జరుపుతామని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు. మరి కొండా విశ్వేశ్వర్రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Must Read ;0- పట్టు వీడుతున్నారు.. కేసీఆర్ యుద్ధ నినాదంలో శాంతి సందేశం











