పోలీసు కస్టడీలో ఎంపీ అని కూడా చూడకుండా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ వేగంగానే స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు అందజేయాలంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లోక్ సభ సెక్రటేరియట్ ఓ లేఖ రాసింది. ఈ లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను కలకలమే రేపుతోంది. తనపై సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని రఘురామరాజు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో సమగ్ర నివేదిక అందించాలంటూ లోక్ సభ సెక్రటేరియట్ కేంద్ర హోం శాఖను కోరిందంటే… ఈ విషయంలో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఇబ్బందులు తప్పేలా లేవన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
సీఐడీ కస్టడీలో రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ?
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ టికెట్ పై ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన రఘురామరాజు… ఆ తర్వాత జగన్ సర్కారు తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ… ఏకంగా వైసీపీకి బద్ధ విరోధిగా మారిపోయారు. జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా తనదైన శైలి విశ్లేషణలు, ప్రశ్నలతో రఘురామరాజు వీడియోలను విడుదల చేశారు. ఈ క్రమంలో తమ నిర్ణయాల్లోని తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా రఘురామరాజుపై కక్ష పెంచుకున్న జగన్ సర్కారు… జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే రఘురామరాజును జగన్ సర్కారు అరెస్ట్ చేసింది. అంతటితో ఆగని జగన్ సర్కారు… సీఐడీ కస్టడీలో ఉండగానే ఆయనపై థర్డ్ డిగ్రీని ప్రయోగించిందనేది రఘురామరాజు ఆరోపణ. ఈ దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని రఘురామరాజు స్వయంగా మీడియాకు ఫొటోలు విడుదల చేయడంతో పాటుగా బెయిల్ లభించిన తర్వాత ఏకంగా ఈ వ్యవహారంపై అందరికీ ఫిర్యాదులు చేయడం మొదలెట్టేశారు.
రఘురామరాజుకు మద్దతుగా టీడీపీ ఎంపీల లేఖలు
బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లిన తర్వాత తొలుత లోక్ సభ స్పీకర్ ను కలిసిన రఘురామరాజు… ఎంపీగా ఉన్న తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఈ క్రమంలో నిందితులపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. తన ఫిర్యాదులో ఏపీ సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్, గుంటూరు అర్బన్ ఎస్పీ విజయ పాల్ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుకు తోడు… రఘురామరాజుకు జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రబాబులు కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
సమగ్ర దర్యాప్తునకు కేంద్ర హోం శాఖకు ఆదేశాలు
ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన స్పీకర్… ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలు సేకరించాలని లోక్ సభ సెక్రటేరియట్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన సెక్రటేరియట్ నేరుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు శుక్రవారం ఓ లేఖ రాసింది. రఘురామరాజు ఫిర్యాదుతో పాటు రామ్మోహన్ నాయుడు, రవీంద్రబాబుల లేఖల్లో పేర్కొన్న అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సవివరంగా అందజేయాలని లోక్ సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా లెక్ సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ప్రత్యేకంగా దృష్టి సారించక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ విచారణలో ఏపీ సర్కారు తప్పుందని తేలితే మాత్రం… జగన్ మోహన్ రెడ్డి సర్కారుతో పాటు డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, గుంటూరు అర్బన్ ఎస్పీలకు కష్టాలు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- రఘురామరాజును మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఏం జరుగుతోంది?