టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మెడకు వివాదాల ఉచ్చు బిగుస్తోంది. కాంట్రవర్సీలతో ఆయన పేరు మార్మోగుతోంది. ఓవైపు అయోధ్య.. మరోవైపు కులాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓవైపు బీజేపీ కత్తి దూస్తుంటే.. ఇంకోవైపు కుల సంఘాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ… ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? ఆయన ఇంటిని ధ్వంసం చేయడానికి కారణమేంటి? కుల సంఘాలెందుకు మానవ హక్కుల కమిషన్ మెట్లెక్కాల్సి వచ్చింది? దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైయ్యేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు
తెలంగాణలో సత్తా చాటేందుకు బీజేపీ ప్రయత్నం..
తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. దుబ్బాక గెలుపు, జీహెచ్ఎంసీలో గణనీయమైన సీట్లు సాధించడంతో పార్టీలో ఆశలు పెరిగిపోయాయి. దక్షిణాదిన పాగా వేసేందుకు యత్నిస్తున్న బీజేపీకి భవిష్యత్తు టార్గెట్ తెలంగాణే అనిపిస్తోంది. ఈ తరుణంలో అయోధ్య రామాలయానికి నిధుల సేకరణ పేరుతో మరింత ఆదరణ పొందుతోందనేది టీఆర్ఎస్ భావన. ఈ తరుణంలో కొద్ది రోజుల కిందట ధర్మారెడ్డి ఒక సమావేశంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద దుమారాన్నే రేపింది.
రాముడిని బీజేపీ అపవిత్రం చేస్తోంది: ధర్మారెడ్డి
“రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోంది. దేవుని పేరుతో అకౌంట్బులిటీ లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలేవీ లేవు. కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసిన అవసరం ఏముంది. రామ మందిరం నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారు. భద్రాద్రి రామాలయానికి ఉన్నటు వంటి 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఎందుకు అప్పగించిందో చెప్పాలి. రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించలేదా? బీజేపీ వాళ్లే హిందువులే కాదు మేము కూడా హిందువులమే. బీజేపీ నేతలు రామాలయం పేరుతో తెలంగాణలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. మరి 29 రాష్ట్రాల్లో రూ.29వేల కోట్లు వసూలు చేస్తారా? ఇంతకీ ఆ డబ్బులన్నీ ఏం చేస్తారో చెప్పాలి”.. అని చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే ఇంటిపై దాడి..
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నక్కలగుట్టలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి అద్దాలు, ఫర్నిచర్ను బీజేపీ నేతలు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలను గేటు బయట నుంచి చల్లా ఇంటిపైకి విసిరారు. ఇంటి అద్దాలు పగుల గొట్టారు. ఆవరణలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు 55 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించారు. వరంగల్ జిల్లా కోర్టు 43 మందికి ఈనెల 15వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వీరందరిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
Must Read ;- కేంద్ర పథకాలు, టీఆర్ఎస్ వైఫల్యాలు.. గడప గడపకు బీజేపీ
ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు..
ఈ గొడవతో సతమతం అవుతున్న ధర్మారెడ్డి మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. ఓసీ మహాగర్జన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చిన్న కులాల అధికారులకు అక్షరం ముక్క రాదని ఎమ్మెల్యే అనడం చర్చనీయాంశంగా మారింది. ఏ ఆఫీసుకు వెళ్లినా వాళ్లే ఉన్నతాధికారులుగా ఉన్నారని, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతోందంటూ ధర్మారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకరికి రిజర్వేషన్ వల్ల మంచి స్థితి వస్తే ఇక ఆ కుటుంబానికి రిజర్వేషన్ అవసరం లేదని తాను వాదిస్తానని తెలిపారు. ఎప్పుడో వచ్చిన ఈ రిజర్వేషన్లను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇది ఓసీల మనోగతమని… తన వ్యక్తిగతం కాదని… ఎవరైనా నొప్పిస్తే అన్యతా భావించొద్దని… ధర్మారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
” ఓ రోజు మా నియోజకవర్గంలో ఏఈలు అందరూ కలిసి నా దగ్గరకు వచ్చారు. ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. సార్ మా దగ్గర మంచి ఆఫీసర్ ఉన్నాడు. మీ దగ్గర పెట్టుకొండని కోరాడు. నేను సరే అన్నాను. తీరా అతణ్ని పిలిచి మాట్లాడితే. ఒక్క అక్షరం ముక్క కూడా సరిగ్గా రాదు. ఇదేంటని ఆయన్ని పంపించిన అతన్ని అడిగితే… ఏంలేదు సార్.. మీరు ఫైల్ తీసుకెళ్లి ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ పెడతడు. అంతకంటే కావాల్సింది ఏముంది సర్. అని నాతో అన్నారు. ఆ ఆఫీసర్ను ఏం అడిగినా.. నాకు తెలియదని అంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నతాధికారి అయ్యాడు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో ఏ ఆఫీస్కు పోయినా ఉన్నతాధికారులు ఇలాంటి వారే ఉన్నారు. పని రాదు.. చివరికి జిల్లా అధికారులు కూడా వాళ్లే ఉన్నారు. రాష్ట్రం మొత్తం నాశనం అవడానికి ఇలాంటి ఉన్నతాధికారులే కారణం”
– చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే (టీఆర్ ఎస్)
కుల సంఘాల కన్నెర్ర.. ఎమ్మెల్యే యూటర్న్
కులాలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. సోమవారం దిష్టిబొమ్మలను దహనం చేశాయి. మరోవైపు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. బిసి,దళిత వర్గాల ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతీసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మారెడ్డి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అభిశంసన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరారు. ఎమ్మెల్యేను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ధర్మారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని వివరణ ఇచ్చారు. ఒకవేళ ఎవరి మనసునైనా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని తెలిపారు.
ఆధిపత్యపోరు ఒకరిది… అడ్డుకునే యత్నం మరొకరిది… కారణమేదైతేనేం.. ప్రస్తుతం తెలంగాణ పేరు దేశంలో మార్మోగుతోంది. దీనికి చల్లా ధర్మారెడ్డి తోడవడంతో హీట్ మరికాస్త పెరిగింది. ధర్మారెడ్డి పొరపాటున అనేసినా, రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆరోపించినా… మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పేలా లేదు.
Also Read ;- మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన











