దేనికైనా టైమ్ రావాలి.. అది బుజ్జిగాడు విడుదల విషయంలో రాలేదు. ఈ ఏడాది ఉగాదికి విడుదల కావలసిన ఈ సినిమాని కరోనా కాటేసింది. దాంతో చివరికి ఓటీటీ వేదికలో విడుదల కావలసి వచ్చింది. హీరోగా రాజ్ తరుణ్ చాలా గ్యాప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్ కోసం తపిస్తున్న అతనికి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇచ్చింది? దర్శకుడు కొండా విజయ కుమార్ దీన్ని ఎలా తీశాడు తదితర అంశాలు చూద్దాం. ఆహా ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది.
కథేంటి?:
అనగనగా ఓ ఊరిలో ఓ బుజ్జిగాడు(రాజ్ తరుణ్). పుకార్లు ఎంత త్వరగా వ్యాపిస్తాయోనంటూ ఈ బుజ్జిగాడు తన కథలోకి తీసుకువెళతాడు. ఒకే ఊరివారైన బుజ్జిగాడు, కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకరికొకరు తెలియదు. ప్రేమ పేరుతో బుజ్జిగాడు, పెళ్లి ఇష్టంలేని కృష్ణవేణి తమ ఇళ్ల నుంచి పారిపోవడం అన్న లైనే ఈ కథకు నాంది. వీరిద్దరినీ రైల్వే స్టేషన్ లో చూసిన ఆ ఊరి వ్యక్తి నిప్పు రాజేస్తాడు. దాంతో ఇద్దరూ లేచిపోయారన్న పుకారు పుడుతుంది. అది ఇద్దరినీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈ ఇద్దరికీ రైలులోనే పరిచయమవుతుంది. ఆ తర్వాత వీరి మధ్య స్నేహం, ప్రేమ లాంటి పరిణామాలకు దారితీస్తుంది. వీరి కలయికకు బుజ్జిగాడు చెప్పిన తన ప్రేమ కథ కారణమవుతుంది. సృజన (హెబ్బా పటేల్)ను బుజ్జిగాడు ప్రేమించడం, అతన్ని సృజన వాడుకోవడం కోసమే ప్రేమ నటించడం లాంటి అంశాలు ఇందులో ఓ చిన్న కోణం మాత్రమే. ఈ లోపు ఊరిలో పరిణామాలు తీవ్ర రూపం దాలుస్తాయి. బుజ్జి మీద కృష్ణవేణికి విపరీతమైన కోపం వస్తుంది. అదే సమయంలో తాను ప్రేమలో ఉన్న అమ్మాయే కృష్ణవేణి అని బుజ్జికి తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అతనేం చేశాడు.. వీళ్లిద్దరి ప్రేమకథ ఎలా ముగిసింది అనేది ప్రధాన కథ.
ఎలా తీశారు:
హాస్యం పండిద్దామనుకుని చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్టుగా అనిపిస్తుంది. కామెడీలో టైమింగ్ బాగా మిస్సయ్యింది. కథనంలో బిగువును దర్శకుడు చూపలేకపోయాడు. బహుశా ఇది కామెడీ కథ అని దర్శకుడు భావించినట్టుంది. ఒకే ఊరి వారైనా ఒకరికొకరు తెలియకపోవడం, కానీ వీరి పెద్దవారు మాత్రం తెలియడం ట్విస్టు అనుకోవాలి. ఇలాంటి ట్విస్టులు జనం టేస్టుకు అంతసరిపోవు. కథని కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. చూసే జనంలో క్యూరియాసిటీ పెంచాలనుకున్నా దానికి జనం కనెక్ట్ కాలేరు. రెండుమూడు కామెడీ సన్నివేశాలకు మించి ఇందులో చెప్పుకోతగ్గదేమీ లేదు. దర్శకుడు కొండా విజయకుమార్
తన పాత బాణీలోనే వెళ్లినట్టు అనిపించింది. అక్కడక్కడా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఛాయలే కనిపిస్తాయి.
ఎలా చేశారు?:
రాజ్ తరుణ్ నటనలోనూ మునుపటి ఈజ్ మిస్సయినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడా అది కనిపిస్తుంది. లేదా కామెడీ పండించాలనుకోవడం వల్ల తేడా కొట్టి ఉండొచ్చు. మాళవికా నాయర్ తనదైన పరిధిలో నటించి మెప్పించింది. హెబ్బా పటేల్ పాత్ర ఎందుకో కూడా అర్థం కాదు. పోనీ గ్లామర్ గా అన్నా చూపించే ప్రయత్నం చేయలేదు. చాలా కాలం తర్వాత వాణి విశ్వనాథ్ ఇందులో కనిపించింది. మునుపటి స్పీడ్ ఆమె పాత్రలోనూ కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఆమె చేసిన ఈ ప్రయత్నం ఏ మాత్రం ఫలితం చూపకపోవచ్చు.
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, వాణి విశ్వనాధ్, హెబ్బా పటేల్, నరేష్, సప్తగిరి, మధునందన్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణ, సత్య, రాజేష్ తదితరులు
మాటలు: నంద్యాల రవి
సంగీతం: అనూప్ రూబెన్స్
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ
నిర్మాత: కె.కె. రాధామోహన్
కథ, కథనం, దర్శకత్వం: విజయ్కుమార్ కొండా
విడుదల తేదీ: అక్టోబరు 1, 2020
నిర్మాణం: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
వేదిక: ఆహా
ఒక్క మాటలో: అపహాస్యంపాలే ఎక్కువ.. కాలక్షేపానికి పనికొచ్చే బఠానీ ఇది.
రేటింగ్: 2/5
-హేమసుందర్ పామర్తి