గత మూడు రోజులుగా సభలో జరుగుతున్న వాడి వేడి చర్చలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. చంద్రబాబు చర్యలతో అధికార పక్షం షాక్ తింటోంది. అధికార పార్టీ సభ్యులు, సీఎం జగన్ ఎప్పటికప్పుడు ప్రతి విమర్శలు చేస్తున్నా.. అదే టైంలో ప్రతిపక్ష టీడీపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. అసెంబ్లీలో సోమవారం చంద్రబాబు చర్యతో అధికార పక్షం షాక్ తింది. అసెంబ్లీలో అబద్దాలు చెబుతున్నారని, రైతుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అందుకే తాను ఆ రకమైన నిరసన తెలిపానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులకు పరిహారం, బీమా ప్రీమియం విషయంలోనూ జగన్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని మండి పడ్డారు. వ్యవహారం అంతటితో ఆగలేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు టీడీపీకి మరో అస్త్రంగా మారాయి.
అర్థరాత్రి మరో జీఓ
ఊహించని విధంగా టీడీపీ సభలో చేపట్టిన నిరసన కారణమా లేక కాకతాళీయంగా జరిగిందా అనే విషయం పక్కన బెడితే.. ప్రభుత్వం తరఫున బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం రూ.590 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రతిపక్ష టీడీపీకి మరో ఆయుధంగా దొరికింది. తాము ఆందోళన చేపట్టాకే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని టీడీపీ చెబుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ శాసనసభా పక్ష నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇక్కడే ప్రతిపక్ష టీడీపీకి మరో ఆయుధం దొరికింది. ప్రభుత్వం విడుదల చేసిన బీమా ప్రీమియం రానున్న కాలానికి వర్తిస్తుంది. అయితే మొన్న తుపానుకి జరిగిన నష్టానికి వర్తించదని. అంటే మొన్న తుపానుకి వచ్చిన నష్టానికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించే అవకాశం లేదని టీడీపీ చెబుతోంది. ఒక వేళ అప్పటి నుంచి ప్రీమియం పరిగణనలోకి తీసుకున్నా.. మొత్తం రూ.1300కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో గతంలో రూ.33కోట్లు చెల్లించారు. తాజాగా రూ.590కోట్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాదాపు సగం కూడా చెల్లించని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడం ప్రారంభించింది. రైతుల నుంచి తాము భీమా ప్రీమియం చాలా తక్కువ వసూలు చేశామని, గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని సీఎం జగన్ సభలో ప్రకటించినా.. రైతులకు పరిహారం విషయంలో టీడీపీ చేసిన ఆందోళన అప్పటికే ప్రజల్లోకి వెళ్లిందని చెప్పవచ్చు.
గతంలో అంచనాలే వద్దని..
గతంలో పంటల బీమా డబ్బులు చెల్లించినా..పంట నష్టం జరిగిన టైంలో కంపెనీలు రైతులకు చెల్లించే పరిహారం కంటే.. ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రీమియం ఎక్కువగా ఉంటోందని ఆ చెల్లింపులు ఆపినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమేనా అన్న రీతిలో జగన్ ప్రభుత్వం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేయడం, అసలే పంటలు నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీపై ప్రతి విమర్శలకు దిగడం చర్చనీయాంశం అవుతోంది. ఇక ప్రస్తుతం పంట నష్టం అంచనా వేశామని, రానున్న కాలంలో పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, గతంలో జగన్ పలుమార్లు ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు పంట నష్టం అంచనాలు ఎందుకు.. పంటలు చేతికొస్తున్న టైంలో వర్షం వస్తే.. రైతులు అందరూ నష్టపోతారు..కాబట్టి రైతులందరికీ పరిహారం ఇవ్వాలని ఆయన అప్పట్లో మీడియా సాక్షిగా వ్యాఖ్యానించారు. దీన్ని కూడా టీడీపీ ప్రశ్నిస్తోంది.
మరోవైపు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారనే అంశాన్ని వైసీపీ తెర పైకి తెచ్చింది. దీంతో మండలిలో లోకేష్ వైసీపీకి సవాలు చేశారు. దీనికి సంబంధించి మంత్రులు అనిల్ కుమార్, కన్నబాబులకు లోకేష్ సవాల్ విసిరారు. మరో సభ్యుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మనసులో మాట పుస్తకాన్ని చదివి వినిపించారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మొత్తం మీద రైతులకు పరిహారం అంశం సభలో గందరగోళానికి కారణం కాగా.. తమ పోరాటంతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని టీడీపీ చెబుతోంది.
Must Read ;- జగనన్న ఫైర్ : బీమా చెల్లింపులతో వారికేం సంబంధం!











