సాయిధరమ్ తేజ్ హీరోగా కట్టా దేవా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేబీ ఎంటర్ టైన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఇటీవలే హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టుగా సినిమా ఉందో లేదో చూద్దాం.
కథలోకి వెళితే..
తెల్లేరు అనే ఊరిలో ఈ కథ ప్రారంభమవుతుంది. కొల్లేరు ప్రాంతాన్ని తెల్లేరుగా ఇందులో మలిచారు. పంజా అభిరామ్ (సాయిధరమ్ తేజ్) చిన్నప్పటి నుంచే అసాధారణ తెలివితేటలు ఉంటాయి. తండ్రి దశరథ్ (జగపతిబాబు) మాట వినే నైజం అతనికి లేదు. తనకు నచ్చని పని ఎవరుచేసినా అంగీకరించలేడు. తండ్రి కూడా అదే వ్యవస్థలో అందుకు తగ్గట్టుగా ప్రవర్తించడం కూడా అతనికి ఇష్టం ఉండదు. చిన్నప్పటినుంచే ప్రశ్నించే తత్వం అతని నైజం. ఐఐటీ పూర్తి చేసి ఎంఐటీలో సీటు వచ్చినా సివిల్స్ రాసి కలెక్టరై వ్యవస్థను సరిదిద్దాలనుకుంటాడు.
ఆ ఊరిలో ఉండే మత్స్యశాఖ మంత్రి విశాఖవాణి (రమ్యకృష్ణ) అసాంఘిక చర్యలకు అడ్డుతగులుతుంటాడు. ఈ నేపథ్యంలో అతను ఐఏఎస్ టాపర్ గా నిలుస్తాడు. కొన్ని ప్రత్యేక అధికారలతో తన ప్రాంతానికే కలెక్టర్ గా వస్తాడు. విశాఖవాణి అక్రమాలకు అన్నను కోల్పోయిన మైరా (ఐశ్వర్యారాజేష్)తో అభిరామ్ కు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. తెల్లేరుపై విశాఖవాణి పెత్తనాన్ని అభిరామ్ ఎలా అడ్డుకున్నాడు? ఆ ప్రయత్నంలో అతను ఎంతవరకు సఫలీకృతుడయ్యాడు అన్నదే ప్రధాన కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
దేవా కట్టా నుంచి ప్రస్థానం లాంటి సినిమాలను జనం ఆశిస్తారు. ఆ సినిమా తర్వాత ఆయనకు సరైన హిట్ లభించలేదు. ఈ సినిమాలో సాయిదరమ్ తేజ్ హీరోగా నటించడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కథను నడపడంలో ప్రథమార్థంలో దేవా కట్టా ఫరవాలేదనిపించినా ద్వితీయార్థంలో సినిమా గాడి తప్పింది. ఆయన తీసుకున్న సబ్జెక్టును మాస్ కోణంలో మలిచే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు. శాసన వ్యవస్థ, బ్యూరోక్రాట్ల వ్యవస్థ, న్యాయవ్యవస్థను మూడు గుర్రాలుగా పోల్చి కథను చెప్పాలనుకున్నారు.
ఆయన చెప్పాలనుకున్న విషయం జనానికి ఎక్కేలా చెప్పలేకపోయారు. ఆయన నిజాయితీగా ఈ ప్రయత్నం చేసినా అది వ్యర్థ ప్రయత్నంలా అనిపిస్తుంది. కథ ఎటుపోతుందో మొదట్లో అర్థం కాదు. ఆ తర్వాత క్లారిటీ వచ్చినా మళ్లీ అదే పంథాలో కొనసాగలేదు. అయినా ప్రథమార్థం ఫరవాలేదనిపిస్తుంది. ఇక ద్వితీయార్థంలో కథను దారిమళ్లించే ప్రయత్నాలు సాగాయి. పేలవమైన క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన మైనస్. అభిరామ్ గా సాయిధరమ్ నటన బాగుంది. విశాఖ వాణిగా రమ్యకృష్ణ కూడా మెప్పిస్తుంది. సంభాషణలు బాగున్నాయి. ఐశ్వర్యారాజేష్ పాత్రకు ఓ లక్ష్యం లేకుండా పోయింది.
ప్రథమార్థంలో గుణ అనే రౌడీని అతనో తోపు అనేలా చూపించినా అతన్ని హీరో మట్టుబెట్టాక అలాంటి తోపు ఎవరూ లేకపోవడంతో హీరోయిజాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదు. పోనీ విశాఖవాణి విలన్ అనుకోడానికి అక్కడ కూడా ఆ పాత్రనూ సరిగా మలచడంలో దర్శకుడు విఫలమైనట్టు అనిపిస్తుంది. ఇక మణిశర్మ లాంటి సంగీత దర్శకుడి అవసరం ఈ సినిమా లేదనే చెప్పాలి.
ఎందుకంటే ఇందులో పాటలకు అసలు సరైన అవకాశమే లేదు. ప్రథమార్థంలో వచ్చే రెండు పాటల్ని డ్యాన్స్ లకోసమే పెట్టినట్టుంది. రీరికార్డింగ్ పరంగా పెద్దగా మార్కులేమీ పడవు. జగపతిబాబు కూడా సరిగా ఉపయోగించుకోలేదు. ఇంత ప్యాడింగ్ ఉండి కూడా సినిమాకు న్యాయం చేయలేకపోవడం దర్శకుడి తప్పిదమే. దర్శకుడిగా దేవా కట్టా ప్రస్థానం మాత్రం సరిగా లేదు. ఎంత ముందుకు వెళ్లినా ఆయన ప్రస్థానం సినిమా పేరు వినిపిస్తుందిగానీ ఆయన నుంచి అలాంటి ఆణిముత్యం మాత్రం మళ్లీ రావడం లేదు.
నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యారాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమురళి, ఆమని తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్ : కె.ఎల్. ప్రవీణ్, సినిమాటోగ్రఫీ: సుకుమార్.
నిర్మాతలు: జె. పుల్లారావు, జె. భగవాన్.
కథ- స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవా కట్టా
విడుదల తేదీ: 1-10-2021
ఒక్క మాటలో: పబ్లిక్ టాక్ కోసమే
రేటింగ్: 2.25/5











