ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉధృతిని మరింతగా పెంచేస్తోంది. శుక్రవారం దాకా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపించినా.. శనివారం కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాకుండా కరోనా సెకండ్ వేవ్ ముగియకుండానే థర్డ్ వేవ్ మొదలైందన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మాటను నిజం చేస్తూ దేశంలో కరోనా కేసుల సంఖ్య శుక్రవారం నాడు ఏకంగా 46,759 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. ఈ కేసుల సంఖ్య పెరుగుదలలో 4.7 శాతం పెరుగుదల నమోదైంది. అంతేకాకుండా గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 509 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది.
కేరళలో మరింతగా..
కరోనా కేసులు తొలుత బయటపడ్డ కేరళ ఇప్పుడు కరోనాకు హాట్ స్పాట్ గా మారిపోయింది. తొలి కేసు కేరళలోనే వెలుగుచూసిన నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో కరోనాను సమూలంగా నిర్మూలించినట్లుగానే కనిపించింది. తొలి వేవ్ లో ఆ రాష్ట్రంలో ఎక్కువ కేసులే నమోదైనా.. సెకండ్ వేవ్ లో అంత అధికంగా కేసులేమీ నమోదు కాలేదు. అయితే ఇప్పుడు దేశంలో నమోదు అవుతున్న కేసుల్లో 75 శాతం మేర కేరళలో నమోదైన కేసులే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే.. వాటిలో ఒక్క కేరళ కేసులే 32,801 ఉండటం ఆందోళన కలిగించే అంశమేనని చెప్పక తప్పదు.
సెప్టెంబర్ దాకా ఆంక్షలు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఆంక్షలను సెప్టెంబర్ ఆఖరు దాకా పొడిగిస్తున్నట్లుగా శనివారం నాడు కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, క్రమంగా పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనమని చెప్పిన కేంద్రం.. ప్రజలు కరోనా నివారణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. ఇదిలా ఉంటే.. ఏపీలో కేసుల సంఖ్య మరోమారు వెయ్యిని దాటేసింది. గతంలో వెయ్యి దిగువకు కొత్త కేసుల సంఖ్య దిగినా.. తాజాగా ప్రతి రోజూ వెయ్యికి పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో ఏపీలో 64,461 మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,321 మందికి కరోనా నిర్థారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 225 కేసులు, అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది మృతి చెందగా.. 1,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Must Read ;- డేంజర్ బెల్స్!.. ‘మూడో’ ముప్పు తప్పదట!