కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి వేవ్ లో వేలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్.. సెకండ్ వేవ్ లో మరింత మంది ప్రాణాలను తీసేసింది. ఇప్పుడు మూడో వేవ్ అంటూ యావత్తు ప్రపంచాన్ని భయపెడుతోంది. అయితే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఏ వ్యాధికి అయినా క్షణాల్లోనూ మందును కనిపెడుతున్న మన శాస్త్రవేత్తలు కరోనా విరుగుడు కోసం ఏడాదికి పైగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్లకేలకు కరోనా బారి నుంచి జనాన్ని కాపాడేందుకు పలు సంస్థలు వ్యాక్సిన్ లను విడుదల చేశాయి. ఇప్పటికే భారత్ లో ఐదు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు కొత్తగా ఆరో వ్యాక్సిన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా రూపొందించిన ఈ వ్యాక్సిన్ జైకోవ్-డీ పేరిట భారత్ లోకి ప్రవేశించింది.
చిన్నపిల్లలకూ వేయొచ్చు
ఇటు దేశంలో గానీ.. అటు విదేశాల్లో గానీ ఇప్పటిదాకా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లన్నీ దాదాపుగా పెద్దల కోసం ఉద్దేశించినవే. అంటే కరోనా నుంచి ఈ వ్యాక్సిన్ల ద్వారా పెద్దలకు కాస్తంత రక్షణ దక్కినా.. చిన్న పిల్లలకు మాత్రం ఇంకా రక్షణ దొరకలేదనే చెప్పాలి. అయితే తనదైన శైలి పరిశోధనలు సాగించిన జైడస్ క్యాడిలా.. పెద్దలతో పాటు చిన్నపిల్లలకూ ఉపయోగించేలా జైకోవ్-డీని అభివృద్ధి చేసింది. 12 ఏళ్లు నిండిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ ను వేయొచ్చట. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ ను భారత్ లో వినియోగించేందుకు డీసీజీఐ అనుమతించింది. రేపటి నుంచే ఈ వ్యాక్సిన్ వినియోగం దేశంలో మొదలు కానుంది.
ఏపీలో వెయ్యి దాటిన కేసులు
ఇదిలా ఉంటే.. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 69,173 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 199 కొత్త కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 190, తూర్పు గోదావరి జిల్లాలో 178, కృష్ణా జిల్లాలో 175 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 కేసులను గుర్తించారు. అదే సమయంలో 1,695 మంది కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,702కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,00,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..19,70,864 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,472 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో తగ్గిన కేసులు
ఏపీలో కేసుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ సాగుతుండగా.. తెలంగాణలో మాత్రం కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 73,899 కరోనా పరీక్షలు నిర్వహించగా, 359 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 74 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,394 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,43,812 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,728 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,854కి పెరిగింది.
Must Read ;- ‘డెల్టా’ ప్రమాదకరం.. వ్యాక్సిన్ తీసుకుంటే కొంతవరకు సురక్షితం











