తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ మార్చి23న వెలువడనుండగా ఎన్నికలు ఏప్రిల్ 17 న జరగనున్నాయి. మే2న ఫలితాలు రానున్నాయి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్), తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ (వైసీపీ) మరణంతో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండుచోట్ల అధికార పార్టీల అభ్యర్థులెవరనేది ఇంకా తేలలేదు. తెలంగాణలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి పేరును ఖరారు చేయగా అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. తిరుపతి లోక్ సభ స్థానానికి ఏపీ ప్రతిపక్ష టీడీపీ తమ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మిపేరును ఖరారు చేసింది. ఇక్కడ అధికార పక్షమైన వైసీపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో తామే ప్రత్యామ్నాయంగా మారతామని చెప్పిన బీజేపీ.. ఈ రెండుచోట్లా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.
నాగార్జునసాగర్ అభ్యర్థులు..ఆశావహులు
కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి నిలిచారు. టీడీపీ కూడా మొవ్వ అరుణ్ కుమార్ను బరిలోకి దింపింది. టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు ఎంసీ కోటిరెడ్డి, రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రవీందర్ రెడ్డి రేసులో ఉన్నారు. హాలియాలో సభకు చిన్నపరెడ్డిని కేసీఆర్ హెలికాప్టర్లో తీసుకురావడంతో ఆయనకే టిక్కెట్ అని ప్రచారం జరిగినా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. సామాజిక వర్గం, స్థానికత, పార్టీ విధేయత, ఆర్థిక బలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయనుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. అంజయ్య యాదవ్, కంకణాల శ్రీధర్రెడ్డి భార్య నివేదితారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అంజయ్య యాదవ్ 2019లో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. 2014లో ఆయన టీడీపీ తరఫున పోటీచేయగా 27వేల ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఉండడంతో టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ నుంచి నివేదిత రెడ్డి పోటీ చేయగా 2675ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎవరికి టిక్కెట్ ఇస్తుందనే అంశంపై పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వామపక్షాలు కూడా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాగా 2018ఎన్నికల్లో జానారెడ్డికి 75,884 ఓట్లు రాగా నోముల నర్సింహయ్యకు 83,655ఓట్లు వచ్చాయి. 7,771ఓట్ల మెజార్టీతో నోముల గెలుపొందారు.
Must Read ;- సాగర్ నాది, అంతా నేనే చూసుకుంటా.. జానా ధైర్యం
తిరుపతి అభ్యర్థిత్వంపై వైసీపీ, బీజేపీ మల్లగుల్లాలు
ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల విషయానికి వస్తే..ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. 2019ఎన్నికల్లో ఓడిపోయిన పనబాక లక్ష్మిని ఎంపిక చేసింది. ఇక వైసీపీ కొత్త అభ్యర్థిని నిలపనుంది. ఇప్పటికే బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. సీఎం జగన్కు సన్నిహితుడు, వైద్యుడైన గురుమూర్తి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వైసీపీలో ఈ ఒక్కపేరు మాత్రమే చర్చకు వస్తోంది. ఇక బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఎఎస్లు, అధికారులైన దాసరి శ్రీనివాసులు, సునిల్ కుమార్ పేర్లతో పాటు రావెల కిశోర్ బాబు పేరు కూడా వినిపిస్తోంది. జనసేన పొత్తు ధర్మం పాటిస్తుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇప్పటికే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని జనసేన పిలుపునిచ్చింది. తమ పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించి బీజేపీకి షాక్ ఇచ్చారు. మరి తిరుపతిలో ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప భారతీయ ప్రజా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించగా, కాంగ్రెస్ కూడా రేసులో ఉంటుందని ఆ పార్టీ నేత తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో..
కాగా రెండురోజుల క్రితం వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, తిరుపతి లోక్సభ పరిధిలోనూ వైసీపీ పైచేయి సాధించింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 13.16లక్షల ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీసీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్కు 7.22లక్షల ఓట్లు రాగా 2.2లక్షల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4.9లక్షల ఓట్లు వచ్చాయి. జనసేన-బీఎస్పీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీహరిరావుకి 20,971ఓట్లు, బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరి రావుకి 16,125ఓట్లు వచ్చాయి. వైసీపీ, టీడీపీ తరువాత నోటాకు 25,781ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతా మోహన్కు 24,039ఓట్లు వచ్చాయి.
Must Read ;- లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!