అది ఎర్రెర్రని గుండె గొంతుక. ఆయనను మావోయిస్టు అనుకోవాలో? పౌరహక్కుల నేత అనుకోవాలో అర్థం కాదు. ఒక్క పెళ్లాం కూడా చాలదనుకుంటున్న ఈరోజుల్లో ఆయనకు పెళ్లాం లేదు.. పిల్లలు లేరు, ఇల్లు లేదు.. వాకిలి లేదు. ఆయన మదిలో మాత్రం ఉన్నదంతా సినిమానే. ప్రసాద్ ల్యాబే ఆయన ఆస్తి. అందుకే సినిమా తీసి అక్కడి పడిగాపులు పడుతుంటారు.మనిషి సుఖసంతోషాల కోసం ఆ నారాయణమూర్తి కరుణిస్తాడో లేదోగాని ఈ నారాయణ మూర్తి మాత్రం కరుణిస్తాడు. తన హావభావాలతో సినిమా చూపిస్తాడు.
తన ఎర్ర సినిమాలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన వ్యక్తి ఆయన. ఆయన శ్వాస, ధ్యాస సినిమా తప్ప ఇంకేమీ కాదు. నారాయణమూర్తికి ఓ ఇల్లూ లేదు.. ఇల్లాలూ లేదు. అంతెందుకు అందరూ ఫోన్లకు అతక్కుపోయే ఈ కాలంలో ఆయనకు నిన్నటి దాకా ఫోనే ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఓ వెయ్యి రూపాయల అతి సాధారణ ఫోన్ ఆయన జేబుతో ఉంటుంది. అయినా ఆయన నిర్మాతే, నటుడే, దర్శకుడే. ఈ మూడు పాత్రలను అవలీలగా పోషించే వక్తికి సొంత కారుగాని, బైక్ గాని లేదంటే నమ్ముతారా.
యూసుఫ్ గూడా ప్రాంతంలోనో, ఫిలింనగర్ ప్రాంతంలోనూ రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే నారాయణమూర్తే కనిపిస్తాడు. పలకరిస్తే ఆత్మీయంగా పలుకుతాడు. ఆయనకు ఏ సమాచారమైనా ఎలా తెలుస్తుందో తెలియదు.. సడన్ గా అక్కడ ప్రత్యక్షమవుతాడు. నిజంగా బయోపిక్ అంటూ తీయాల్సివస్తే కచ్చితంగా నారాయణమూర్తి మీదే తీయాలి.
ఆయన స్మార్టుగా ఉండరు.. స్మార్టు ఫోనూ ఆయన దగ్గర ఉండదు. ఆయనతో మాట్లాడాలనుకుంటే ఎవరింట్లో అద్దెకు ఉంటున్నారో తెలుసుకుని కాన్త ఆర్. నారాయణ మూర్తిగారిని పిలుస్తారా? అంటే పిలిచేవారు.
ఆయన ఎవరినైనా పలకరించినా, వేదికల మీద ప్రసంగించినా ఆయన గుండె లోతుల్లో నుంచి ఆ మాటలు వస్తాయి. ఆయనకు కుటుంబం లేదు.. జగమంతా ఆయన కుటుంబమే. ఒకప్పుడు మద్రాసు వీధుల్లో తిరిగారు.. నేడు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తారు. సినిమా ఉంటే ప్రసాద్ ల్యాబ్ ఆయన అడ్డా. నారాయణ మూర్తి సినిమా ఉంటే ఆ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ అండదండలు ఆయనకు మెండుగా ఉంటాయి. ఎక్కడైనా కనిపిస్తే చాలు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తారు. ‘బాసూ.. నేను మీ ఆఫీసుకు వస్తే నా సినిమాల గురించి ఎంత గొప్పగా రాశారు’ అనేవారు. తన గురించి రాయకపోయినా ఆయన పట్టించుకోరు.
అయినా జనం సమస్య మీదే సినిమాలు ఎందుకు తీస్తారో ఎవరికీ అర్థం కాదు. ఒకప్పుడైతే మావోయిస్టులు ఆయన వెనకుండి సినిమాలు తీయిస్తున్నారని అనుకునేవారు. తాజాగా ‘రైతన్న’ పేరుతో ఓ సినిమా తీసినా కరోనా దాని విడుదలను అడ్డుకుంటూనే ఉంది. ఆ మధ్య నారాయణమూర్తి సీఎం జగన్ ను కలిసి ఏలేరు- తాండవ అనుసంధానం గురించి మాట్లాడారు. దీనివల్ల పలు మండలాలకు నీటి సుదుపాయం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ రెండు కాలువల అనుసంధానం వల్ల విశాఖ జిల్లాకు చెందిన కోట వూరుట్ల, నాతవరం, ఇలాంటి నటుడు, దర్శకుడు ప్రజల కోసం సీఎంను కలవడం ఏంటి? ఏ ఎమ్మెల్సీ సీటునో, స్టూడియో పెట్టుకోవడానికి స్థలాన్నో అడగాలి. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం ఆఫీసు చుట్టూ తిరిగారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామం నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలుపడ్డా ఏమీ సంపాదించుకోలేదు నారాయణమూర్తి. మాసిన గెడ్డం, తెల్ల బట్టలు… వెరసి ఓ నారాయణమూర్తి.
-హేమసుందర్
Must Read ;- దాసరి శకం.. తెలుగు సినిమాకు శతకం











