‘ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి చోటుంటుందా?’ ఇదేం మిలియన్ డాలర్ ప్రశ్న కాదు. అనేక చోట్ల మనం రోజూ చూస్తున్నదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న నాలుగు పిల్లర్లూ సక్రమంగా పనిచేస్తున్నంత కాలం ప్రజాస్వామ్యం మనుగడకేమీ ముప్పు వాటిల్లదు.
ఈ నాలుగు వ్యవస్థలూ గాడి తప్పితే మాత్రం ప్రజాస్వామ్యం అంటూ ఏదీ ఉండదు.. ఉండేదల్లా నియంతృత్వమే. అయితే నియంతృత్వం ఎంత కాలం ఉంటుందన్నది మరో ప్రశ్న. సంపూర్ణ అధికారంతో ఎవరి మాటా వినకుండా పాలించే రాజును నియంత అంటారు. చరిత్రలో ఇలాంటి నియంతలు చాలామందే ఉన్నారు. ఈ నియంతృత్వం శృతిమించితే అది క్రూరత్వం అవుతుంది. అసలు నియంత అనే పదం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. అది ప్రజస్వామ్యమైనా, మరే స్వామ్యమైనా అత్యవసర పరిస్థితుల్లో పాలించడానికి ఓ వ్యవస్థ ఉండాలి.
రోమ్ లో పుట్టిన నియంత
పూర్వం రోమ్ లో సెనేట్ నియమించిన మేజిస్ట్రేట్ కు ఈ పేరు పెట్టారట. అతను డిక్టేటర్. అతను ఏంచెబితే అది చేయాల్సిందే. హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్, సద్దాం హుస్సేన్, ముషారఫ్, కిమ్.. ఇలా ఎన్ని పేర్లయినా నియంతల జాబితాలో చెప్పుకోవచ్చు. వారు ఏంచేసినా జనం భరించి తీరాల్సిందే. ఒకప్పుడు రాజులు కూడా నియంతల్లానే పాలించారు. అందుకేనేమో ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అనే పదం కూడా పుట్టుకొచ్చింది. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే రాజు తలచుకుంటే మరో ‘రాజు’ కూడా దెబ్బలు తినాల్సి వస్తోంది అనుకోవాలేమో. ఈ విషయంలో ఎవరిది తప్పు అని తేల్చడం కూడా కాస్త ఇబ్బందికరమే. బలవంతుడిదే రాజ్యం అనే మాటను మనం ఎన్నిసార్లు వినలేదూ. ఇక్కడా అదే సూత్రం వర్తిస్తుంది. జనం కూడా బలం ఉన్నవాడి వైపే ఉంటారు.
ఒక నియంతను మరో నియంత మాత్రమే కట్టడి చేయగలడు. ఒక రౌడీని మరో రౌడీ మాత్రమే కట్టడి చేయగలడు, ఒక ఫ్యాక్షనిస్టును మరో ఫ్యాక్షనిస్టు మాత్రమే అణచగలడు. అందుకే ఏ పార్టీ అయినా ఓ ప్రాంతంలో తమ అభ్యర్థిని నిలబెట్టాల్సి వచ్చినపుడు అతని నేర చరిత్రను సైతం పక్కన పెట్టి టిక్కెట్లు ఇస్తుంటాయి. అంటే అందరూ ఆ తానులో గుడ్డలే అని ఇక్కడ అర్థమవుతుంది. మేధావుల మౌనానికి ఇది కూడా ఒక కారణమే. మేధావులు రాజకీయాల్లోకి రావట్లేదు అని అనుకుంటారుగానీ వచ్చి పీకేదేమీ లేదని వారికి తెలుసు. అందుకే వారు రాజకీయాలకు దూరంగా ఉంటారు.
Must Read ;- జగన్ చేస్తున్న మోడీ భజనపై దేశమంతా అసహ్యం!
నియంతలు ఎలా అంతమయ్యారు?
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చనిపోతుందన్న సామెత మనకు ఉండనే ఉంది. ప్రపంచాన్ని గడగడ లాడించిన నియంతలంతా ఏదో ఒక రోజు ఇలా అంతమైన వారే. అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచాన్ని ఎంతలా గడగడలాడించాడో అందరికీ తెలుసు. అలాంటి హిట్లర్ బంకర్ లో తలదాచుకోవాల్సిన దుస్థితి దాపురించింది. చివరికి ఆత్మహత్యే అతనికి శరణ్యం కావాల్సి వచ్చింది. ప్రపంచాన్ని వణికించిన వ్యక్తి 56 ఏళ్లకే జీవితాన్ని చాలించాల్సి వచ్చింది. రెండు ప్రపంచ యుద్దాలను చూసిన తర్వాత ఎలాంటి నియంత ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే.
ఫాసిజానికి భీజం వేసిన ముస్సోలినీ కూడా దాని వల్ల బావుకున్నదేమీ లేదు. చివరికి 62 ఏళ్లకే ఇటాలియన్ల చేతుల్లో కాల్పులకు గురై మరణించాడు. రష్యాలో బ్యూరోక్రటిక్ పాలనతో శాసించిన స్టాలిన్ కూడా చివరికి మానసిక ఒత్తిడితో కన్నుమూశారు. మనలో రోగనిరోధక శక్తి ఉన్నంతవరకూ రోగాలు మనల్ని ఏమీ చేయనట్టుగానే నియంత కూడా బలహీనమైన తరుణంలో ముప్పేటలా దాడులు జరుగుతాయి. సద్దాం హుస్సేన్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇరాక్ ను అప్రతిహతంగా పాలించినా చివరికి ఆ దేశంలోనే ఆయన్ని ఉరి తీయాల్సి వచ్చింది. అయితే నియంతలంతా చెడ్డవాళ్లు అనుకోవాల్సిందేనా? అలా అనుకోడానికి వీల్లేదు వారి వాదన వారికి ఉండనే ఉంటుంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో కూడా నియంతలా శాసించాల్సి రావచ్చు.
పాకిస్తాన్ ను శాసించిన పర్వేజ్ ముషారఫ్ కు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. ఆయన శవాన్ని కూడా ఈడ్చుకెళ్లి మూడు రోజులు వేలాడతీయమంటూ కోర్టు తీర్పు చెప్పడం విశేషం. ఇటీవలి కాలంలో ప్రముఖంగా వినిపించిన నియంత కిమ్ జాంగ్. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా తరచూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయనపై వార్తలే లేవు. ఆయన బతికి ఉన్నాడా లేడా అనేది కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి ఏదీ శాశ్వతం కాదు ఎవరూ శాశ్వతం కాదు. ఏ నియంత అయినా తాను నియంత అంటే అంగీకరించడు కూడా. పైగా అతడు అందరికీ నియంత కాదు. అతన్ని సమర్థించే వర్గం అతనికి ఉండనే ఉంటుంది. ఎక్కడ ఎలాంటి నియంతలున్నా వారు ఉన్నంత కాలం మనం కిమ్మనకుండా భరించాల్సిందే. అందుకే మాస్క్ వేసుకుని మూస్కొని ఉండటం మేలు.
– హేమసుందర్
Must Read ;- జగన్కు మద్యంపై ఆదాయంపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదు:లోకేష్