సినిమా అనేది ఓ అద్దాల మేడ.. కానీ ఆ అద్దాలే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.. ఆ మేడలో ఆయనకు ఎంతో చోటిచ్చాయి. ఆయనే సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాలరెడ్డి. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఆయన ఇల్లే ఓ అద్దాల సౌధం. ఎందుకంటే ఆయన కుమారుడు సందీప్, కుమార్తె సంధ్యలకు కూడా ఆ అద్దాలతోనే అనుబంధం.
2000 సంవత్సరంలో ‘ఈనాడు సినిమా’ రిపోర్టర్ గా నేను కూడా ఈ అద్దాల మేడలోకే అడుగుపెట్టాను. ఎప్పుడూ నటుల ఇంటర్వ్యూలేనా టెక్నిషియన్ల ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది. అలా వెతికిన నా కంటికి ఓ సినిమాటోగ్రాఫర్ కనిపించారు. పైగా ఆయన నిర్మాత కూడా. అలా గోపాల రెడ్డితో నాకు కూడా ఓ బంధం ఏర్పడింది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై ‘సంతోషం’ సినిమా నిర్మిస్తున్న రోజులవి. బహుశా 2001 అనుకుంటాను. ఫోన్ చేయగానే ఆయన ఇంటర్వ్యూ ఓకే చేశారు. సినిమా రంగంలో చాలా మందికి ఓ విధమైన గర్వం ఉంటుంది. కానీ ఈయన చూస్తే నిరాడంబరంగా కనిపించారు. మాట తీరులోనూ మృదుత్వం. బహుశా ఆ గుణమే సినిమా రంగంలో ఆయనను అజాతశత్రువును చేసిందేమో.
మాట సాయం చేయడంలోనూ మేటి..
ఇంటర్వ్యూ ప్రింటయ్యాక చాలా బాగుందని థాంక్స్ చెప్పారు. ఆ కొద్దిపాటి పరిచయమే మా దగ్గర ఉంది. ఆ సినిమాకి దర్శకుడు దశరథ్ దగ్గర నాకు తెలిసిన వాసు అనే కుర్రాడు అప్రంటిస్ గా చేరాడు. అతనా పోస్టులో చేరడానికి ఓ మంత్రి రికమెండేషన్ కూడా తెచ్చుకున్నాడట. సినిమా రంగంలో ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాలంటే మంత్రి రికమెండేషన్ దాకా వెళ్లాలా అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఓ రోజు వాసు ‘అన్నయ్యా నా దగ్గర మంచి కథ ఉంది.. ఈ కథ నాగార్జునకు అయితే బాగుంటుంది. కథ వినే అవకాశం కల్పించగలవా?’ అనడిగాడు. నాకు మొహమాటం ఎక్కువ. వెంటనే గుర్తొచ్చి గోపాల రెడ్డి గారికి ఫోన్ చేస్తే బాగుంటుందనిపించింది. ఫోన్ చేసి విషయం చెప్పా. అలాగే అదెంత పని అన్నారాయన.
ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సినిమా రంగంలో కొందరు మాట సాయం చేయడానికి కూడా ముందుకు రారు. వాసు అన్నపూర్ణ స్టూడియోలో కథ చెప్పే దాకా వెళ్లాడు కానీ ఆ కథ ఓకే కాలేదు. ఆ తర్వాత నేను గోపాల రెడ్డి గారిని నేరుగా కలిసే అవకాశం రాలేదు. ఓ నాలుగేళ్ల క్రితం అనుకుంటాను ఓ మిత్రుని ద్వారా ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. ఆయనను చూస్తే ఓ ఆత్మబంధువును చూసినట్టుంటుంది. అప్పట్నుంచి ఇప్పటికీ మా మధ్య ఆత్మీయాతానుబంధమే. దానికి కారణం ఆయన పాజిటివ్ థింకింగ్. తన మాటల వల్లగాని, చేతల వల్ల గానీ ఎవరూ హర్ట్ కాకూడదన్నది ఆయన అభిప్రాయం. అందుకే సాధారణంగా ఇంటర్వ్యూలకు ఆయన దూరంగా ఉంటారు. రెండ్రోజుల క్రితం మళ్లీ వీడియో ఇంటర్వ్యూ కావాలని అడగ్గానే రమ్మన్నారు.
Also Read ;- సినిమా చూపించాడు మామా
మౌనంగానే ఎదగమనే తత్వం
ఓ సినిమాటోగ్రాఫర్ కు సాహిత్యం మీద అభిరుచి ఉండటం కూడా విశేషమే. మార్కెట్లోకి మంచి పుస్తకం వస్తే అది ఆయన ఇంట్లో ఉండాల్సిందే. ఓసారి కాచిగూడలో తెలుగు బుక్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన నుంచి ఫోన్ వచ్చింది. ఫలానా పుస్తకం కావాలి అన్నారు. ఆయనకు పుస్తకాల మీద అంత మక్కువ ఏర్పడటానికి కారణం జంధ్యాల. రచయితగా, దర్శకుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న జంధ్యాలతో కలిసి ఆయన కొంత కాలం రూమ్ లో ఉండటం కూడా ఓ కారణం. ఆయనతో ఉన్న స్నేహం తనలో ఎంతో మార్పు తెచ్చిందంటారు గోపాల రెడ్డి.
ఆయన సొంతూరు కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని తేలప్రోలు. ఒకవిధంగా చెప్పాలంటే వారిది కమ్యూనిస్టు కుటుంబం. తండ్రికి సినిమా రంగంతో కొంత అనుబంధం ఉండటంతో మద్రాసు వెళ్లాల్సి వచ్చిందాయనకు. వీనస్ స్టూడియో అప్రంటిస్ గా చేరాక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్. స్వామి దగ్గర అసిస్టెంట్ గా చేరే అవకాశం దొరికింది. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ గా మారి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు. మాట సాయమే కాదు అయ్యో అనిపిస్తే ఆయన ధన సాయం కూడా చేయడానికి వెనకాడరు. అయితే అలా సాయం చేసిన విషయాన్ని బయటకు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడరు.
అన్నిశాఖల్లోనూ అభినివేశం
సినిమా రంగంలో సినిమాటోగ్రాఫర్ గా అడుగుపెట్టిన ఆయన ఒక్క శాఖకే పరిమితం కాలేదు. జంధ్యాల సహచర్యం కారణం వల్ల కథ మీద పట్టుదొరికింది. కె.ఎల్. నారాయణతో ఏర్పడిన స్నేహబంధం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ స్థాపన దాకా వెళ్లింది. క్షణ క్షణం, ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్, సంతోషం.. ఇలా అనేక విజయాలు సొంతమయ్యాయి. రవితేజ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ చిత్రంతో మెగాఫోన్ చేతబట్టక తప్పలేదు. పాటల చిత్రీకరణలో ఆయనకున్న అభినివేశం ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ప్రతిచిత్రంలోనూ కనిపిస్తుంది. దర్శకుడిగా ఆయన తొలి చిత్రంలో ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది’ అనే పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఆ పాట ఉందనడం అతిశయోక్తి కాబోదు.
Must Read ;- ఈ సినిమా బామ్మలు నిజ జీవితంలో అమ్మ కాలేదా..?
రాంగోపాల్ వర్మ దర్శకత్వం చేపట్టబోతూ తనకు సినమాటోగ్రాఫర్ గా గోపాల రెడ్డే కావాలని పట్టుబట్టారంటే ఆయన ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఐదు దశాబ్దాల ఆయన సినిమా రంగ జీవితం మరెందరికో స్ఫూర్తిదాయకం కూడా. ఆయన నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ‘శిల్పి’ అనే ఓ కథను ఎంచుకున్నారుగానీ అది కార్యరూపం దాల్చలేదు. దానికి వెనక పెద్ద కథే ఉంది. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడనడానికి ఇదే ఉదాహరణ. నిర్మాతగా తన స్నేహితుడు నష్టపోకూడదన్నది జంధ్యాల అభిప్రాయం.
‘శిల్పి’ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే సమయానికి జంధ్యాల వెర్షన్ మారిపోయింది. మొదటి చిత్రంతో రిస్క్ ఎందుకు చేయాలి. ఎన్టీఆర్ నటించిన హిట్ చిత్రం ‘వద్దంటే డబ్బు’ కథను కొద్దిగా మార్చి సినిమా చేసేద్దాం అన్నారట. అందుకు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ‘బాబాయ్ అబ్బాయ్’ చేశారు. నిజానికి ఈ సినిమావల్లే చేతులు కాలాయి. ‘శిల్పి’ చేసి ఉంటే బాగుండేమో అని కూడా అనిపించింది. అన్నట్టు ఒక టెక్నీషియన్ కోసం నందమూరి బాలకృష్ణ 25 శాతం రెమ్యూనరేషన్ తగ్గించుకుని ఈ సినిమా చేశారట.
తెరవెనుక సంగతులెన్నో..
సినిమా రంగంలో లోపల జరిగేది ఒకటి బయటికి కనిపించేది ఇంకొకటి. గోపాల రెడ్డిగారిని కలిసిప్పుడు మనకు చాలా కొత్త విషయాలు తెలిశాయి. బాలీవుడ్ దగ్గజం అమితాబ్ బచ్చన్ తో ఆయన పనిచేశారు. ఆయన చెప్పిన విషయాలు విన్నాక అమితాబ్ ఇంతటి మేధావా? అనిపించకమానదు. అలాగే ‘క్షణక్షణం’ సినిమాకి ముందు అనుకున్న కథ ఒకటి, తీసింది ఇంకొకటి. నటి శ్రీదేవి తనకు నచ్చిన ఓ హాలీవుడ్ కథ స్ఫూర్తితో రాంగోపాల్ వర్మ ఈ క్షణక్షణం కథ తయారు చేశారట. ఇక ఈ సినిమాలో శ్రీదేవి ఓ పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. ఆ పాట ఆమె పాడితేనే బాగుంటుందని వర్మ అనడం, ఆమెను ఒప్పించడానికి గోపాల రెడ్డిగారే రంగంలోకి దిగాల్సి వచ్చింది.
‘కింగ్ లా కనిపిస్తున్నాడు.. మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు’అనే పల్లవితో సాగే పాట ఇది. ఆమెను కలవడానికి గోపాల రెడ్డి ముంబయిలో స్టూడియోకి వెళితే అక్కడ శ్రీదేవికి లభిస్తున్న గౌరవం చూసి ఆశ్చర్యపోయారట. నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగుల్లో ఎలాంటి రిస్క్ లు చేస్తారన్నది కూడా ఆయన మాటల్లో తెలుసుకోవలసిందే. దుర్గా ఆర్ట్స్ ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబునీ, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని ఒకే వేదకి మీదకు తీసుకు రాబోతోంది. ఈ బృహత్తర బాధ్యత కూడా గోపాల రెడ్డి భుజస్కందాలపైనే ఉంది. సినిమాని ప్రేమించడం మొదలుపెడితే జీవితం చివరిదాకా దాంతోనే ప్రయాణం చేయాలని అనిపిస్తుందంటారాయన. ఆ సంకల్ప బలంతోనే ముందుకు సాగుతున్నారు గోపాలరెడ్డి.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- అగ్ర దర్శకులు చేతుల్లో కథల కార్ఖానాలు











