నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తరువాత టీఆర్ఎస్లో రాజకీయంగా కీలక మార్పులు రానున్నాయని, ఈ మేరకు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉండడంతో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులతో పాటు కొన్ని వర్గాలను మరింత దగ్గర చేసుకునేందుకు కేసీఆర్ ప్రణాళిక రూపొందించారని చెబుతున్నారు. సాగర్లో టీఆర్ఎస్ గెలిచినా..ఓడినా మంత్రి వర్గంలో మార్పులు ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీగా గెలిచిన పీవీ కుమార్తె సురభి వాణీ దేవికి మంత్రి వర్గంలో చోటు కల్పించడం లేదా మండలి ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం జరుగుతుందని పార్టీలో చర్చ నడుస్తోంది.
జూన్తో ముగియనున్న గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ కాలం
ప్రస్తుతం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ కాలం జూన్తో ముగియనుంది. ఆ స్థానంలో వేరే వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాణి సురభి దేవికి అవకాశం కల్పించడం ద్వారా సామాజిక సమీకరణాలను ప్రభావితం చేయవచ్చనే అంచనాకు కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. మండలి ఛైర్మన్ పదవి సాధ్యం కాని పక్షంలో మంత్రి వర్గంలో చోటు కల్పించడం, పీవీ కుమారుడు ప్రభాకర్రావుకు కూడా కీలక పదవి ఇవ్వడం లాంటి అంశాలు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
మంత్రులపై ఆరోపణలు..
కాగా తెలంగాణలోని కొందరు మంత్రులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రత్యేకంగా తన అనుయాయుల ద్వారా కేసీఆర్ సమాచారం తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలు, విమర్శల వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని ఇప్పటికే కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంలోనే కొందరు మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఉత్తర తెలంగాణకు చెందిన నాయకులపై వస్తున్న ఆరోపణలను కూడా కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎవరిని ఎప్పుడు దూరం పెడతారనే టెన్షన్ నాయకుల్లో మొదలైంది.
ప్లీనరీలో క్లారిటీ..
కాగా ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలు నిర్వహించుకోనుంది. మూడు రోజుల పాటు ప్లీనరీ కూడా నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019లో లోక్సభ ఎన్నికలు ఉండడం, 2020లో కొవిడ్ కారణంగా ప్లీనరీ నిర్వహించలేదు. ఈసారి పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్లీనరీ తరువాత సాగర్ ఎన్నికలపై సమీక్షతో పాటు పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఓవైపు మండలి ఛైర్మన్ పదవీ కాలం జూన్తో ముగియనుండడంతోపాటు ప్లీనరీ కూడా నిర్వహిస్తుండడంతో పార్టీలో ఈ అంశాలపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా అటు కాంగ్రెస్ను దెబ్బతీయడంతోపాటు సామాజిక పరంగా కూడా పార్టీకి కలసి వస్తోందని భావిస్తున్న టీఆర్ఎస్..ఆయన కుమార్తె సురభి వాణీ దేవికి ఎమ్మెల్సీ పదవి తక్కువేనని, మరింత పెద్ద పదని ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాగర్ ఎన్నికలతోపాటు టీఆర్ఎస్లో ఈ చర్చ నడుస్తోంది. ఆ చర్చ ఎలా ఉన్నా.. సురభి వాణీ దేవికి మరింత పెద్ద పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది.
Must Read ;- సాగర్లో పార్టీల వ్యూహప్రతివ్యూహాలు.. ఎవరికి వారే గెలుపు అంచనాలు