టీజీ వెంకటేశ్… పరిచయం అక్కర్లేని పేరే. రాయలసీమ ముఖద్వారం కర్నూలు కేంద్రంగా తనదైన శైలి రాజకీయాలు నడుపుతున్న టీజీ… ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా… చంద్రబాబు ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే బీజేపీలోకి చేరిపోయిన టీజీ… ఇప్పుడు పెద్దగా బయట కనిపించడమే మానేశారు. అయితే ఎప్పుడు మీడియాకు ముందుకు వచ్చినా… ఆయన నోట నుంచి సంచలన మాటలు, ప్రకటనలే వెలువడుతుంటాయి. అందులో భాగంగానే శుక్రవారం నాడు ఆయన నోట నుంచి ఓ సంచలన ప్రకటన వెలువడింది. ఏపీలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని, అందులో భాగంగా తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను తాము అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని ఆయన సెలవిచ్చారు. పనిలో పనిగా… తిరుపతి బరిలో బీజేపీ గనుక గెలిస్తే… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టే పార్టీ బీజేపీనేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని కూడా ఆయన ఒకింత గంభీర ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘ప్రధాని మోదీ ఒక బహుబలి . ప్రపంచంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ. రాజధానిని ఫ్రీ జోన్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే రాయలసీమ వాసులు విశాఖ వెళ్లడం కష్టం. సీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి. రాయలసీమ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. జగన్.. కేసీఆర్తో లాలూచీ పడకుండా ప్రాజెక్టులపై ప్రశ్నించాలి. తిరుపతి పార్లమెంట్ సీటు గెలిస్తే ఏపీలో బీజేపీదే అధికారం‘ అని టీజీ వెంకటేష్ జోస్యం చెప్పారు.
సరే.. మరి తిరుపతి బరిలోకి దిగే విషయంలో బీజేపీ నుంచి ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటనే రాలేదు. ఇటు విపక్షం టీడీపీతో పాటు అటు అధికార పక్షం వైసీపీ కూడా తిరుపతి బైపోల్స్ కు సంబంధించి ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించాయి. మరి బీజేపీ నుంచి ఇప్పటిదాకా ఈ ప్రకటనే రాకుంటే… టీజీ ఏమో ఏకంగా తిరుపతి బరిలో తాము గనుక గెలిస్తే.. ఏపీలో అధికారం కూడా చేపడతామని జబ్బలు చరుచుకుంటున్న వైనం నిజంగానే విచిత్రంగా ఉందని చెప్పాలి. ఇక బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా తిరుపతి ఉప ఎన్నికలపై బాగానే ఆశలు పెట్టుకుంది. బీజేపీ తమ పోటీకి ఒప్పుకోకపోతే… ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటామన్నంత రేంజిలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరి ఈ మాటలు టీజీ చెవిన పడలేదో, ఏమో ఆయనకే తెలియాలి. మొత్తంగా టీజీ తాజా కామెంట్లు కామెడీని తలపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- తిరుపతిలో ‘దుబ్బాక’ రిపీట్ అయితే.. వైసీపీ, టీడీపీలకు ముచ్చెమటలే











