లాక్ డౌన్ ముగిసింది. సినిమాలన్నీ ఒకేసారి మొదలయ్యాయి. దీంతో ఉన్న సినిమాలకే కాల్షీట్లు సర్దుబాటు
చేయడం హీరోయిన్లకు పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి టైమ్ లో కొత్త సినిమాలకు కమిట్ అవ్వడమంటే, పెద్ద రిస్క్ చేసినట్టే. రష్మిక, పూజా హెగ్డే, రాశిఖన్నా, రకుల్ లాంటి హీరోయిన్లు ఇప్పుడు కాల్షీట్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు.
రష్మికనే తీసుకుందాం. ప్రస్తుతం ఆమె పుష్ప చేస్తోంది. అటు బాలీవుడ్ లో మిషన్ మజ్ను అనే సినిమా చేస్తోంది. దీంతో పాటు హిందీలోనే మరో సినిమాకు కమిట్ అయింది. ఇటు ఓ కోలీవుడ్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉంది. ఇలాంటి టైమ్ లో నితిన్ కొత్త సినిమాలో రష్మిక కోసం ట్రై చేస్తున్నాడట వక్కంతం వంశీ. రష్మికకు కూడా చేయాలనే ఉంది. కానీ ఉన్నఫలంగా కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి.
పూజా హెగ్డే పరిస్థితి అయితే మరీ దారుణం. ఆమె చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్స్ ను క్లైమాక్స్ కు తీసుకొచ్చింది. త్వరలోనే 2 హిందీ సినిమాలు స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇటు తమిళ్ లో విజయ్ సరసన ఓ మూవీ చేయాల్సి ఉంది. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ మూవీ ఆఫర్ వచ్చింది. పెద్ద ఆఫర్. వదులుకోవడానికి ఇష్టం లేదు. కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయాలంటే మాత్రం కష్టంగా మారింది.
రకుల్ అయితే ఏకంగా తన బాధను మీడియా సముఖంగానే వెల్లడించింది. చేతిలో అరడజను సినిమాలున్నాయని, ఉన్న సినిమాలకే కాల్షీట్లు సర్దుబాటు చేసే పరిస్థితి లేదని అంటోంది. అటు కాజల్, తమన్న అయితే దొరికిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు. సినిమాలతో పాటు ఓటీటీ ఆఫర్లు కూడా దక్కించుకుంటున్నారు. దీంతో వాళ్ల కాల్షీట్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి.
అటు నయనతార అయితే ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. రెమ్యూనరేషన్ పరంగానే కాకుండా, సినిమాల పరంగా కూడా ఆమె ఫుల్ బిజీ. తమిళ, మలయాళ సినిమాలతో నయనతార చాలా బిజీగా ఉంది. తెలుగు నుంచి ఒకట్రెండు ఆఫర్లు వస్తున్నప్పటికీ ఒప్పుకునే పరిస్థితిలో ఆమె లేదు. మొన్నటివరకు ఖాళీగా ఉన్న రాశిఖన్నా కూడా సడెన్ గా బిజీ అయిపోయింది. పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న ఈ బ్యూటీ, మరో 2 సినిమాలకు కాల్షీట్లు ఇచ్చేసింది. వాటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఈ మొత్త ఎపిసోడ్ లో నభా నటేష్, లావణ్య త్రిపాఠి, పాయల్ రాజ్ పుత్, నిధి అగర్వాల్, ప్రగ్యా జైశ్వాల్ లాంటి హీరోయిన్లు కాల్షీట్లు కేటాయించే పొజిషన్ లో ఉన్నప్పటికీ.. వాళ్లకు భారీ ఆఫర్లు రావడం లేదు. పెద్ద హీరోలందరికీ రష్మిక, పూజా హెగ్డే, నయనతార లాంటి హీరోయిన్లే కావాలి. టాలీవుడ్ లో ఇప్పుడీ కాల్షీట్ల గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.
Must Read ;- ఓటీటీలోకి వెండితెర భామలు