ఒకప్పుడు హీరోయిన్లకు సినిమాలే లోకం. మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్లతో పాటు చాలామందికి ఓటీటీ ప్రత్యామ్నాయంగా మారింది. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఓటీటీ ఆఫర్లతోనే హ్యాపీగా గడిపేస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ఫ్యామిలీ మేన్ సీజన్-2 సూపర్ హిట్టయింది కూడా. ఇందులో ఆమె మహిళా ఉగ్రవాదిగా కనిపించబోతోంది. ఇక మరో ముద్దుగుమ్మ శృతిహాసన్ కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. పిట్టకథలు సినిమాలో ఓ మంచి పాత్ర పోషించింది. ఆంథాలజీగా వచ్చిన పిట్టకథలు ఫ్రాంచైజీలో శృతిహాసన్ పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఇదే పిట్టకథలతో అమలాపాల్, ఈషారెబ్బ, అసిమా నర్వాల్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు.
కంటెంట్ బాగుంటే ఏ ఫ్లాట్ ఫామ్ పైన అయినా నటించడానికి రెడీ అని చెబుతుంటుంది సాయిపల్లవి. అందుకు తగ్గట్టే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే నెట్ ఫ్లిక్స్ లో ఓ ఆంథాలజీ డ్రామాలో నటించింది. ఇందులో సుమతి అనే గర్భవతి పాత్రలో సాయిపల్లవి నటన హైలెట్. అటు మిల్కీబ్యూటీ తమన్న కూడా ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంగా ఆహాలో లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాట్ స్టార్ లో నవంబర్ స్టోరీ అనే వెబ్ డ్రామా చేసింది.
కాజల్ కూడా ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. లైవ్ టెలికాస్ట్ అనే హారర్ డ్రామాలో నటించింది. ఇది పెద్దగా క్లిక్ అవ్వకపోయినప్పటికీ.. ఓటీటీ ఎంట్రీ తనకు మంచి కిక్ ఇచ్చిందని చెబుతోంది. మరో హీరోయిన్ రాశిఖన్నా కూడా ఓటీటీలోకి ఎంటరైంది. షాహిద్ కపూర్ తో కలిసి ఓ ప్రతిష్టాత్మక ఓటీటీ ప్రాజెక్టులో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె బోల్డ్ గా కనిపించబోతోంది.
పాయల్ రాజ్ పుత్, హెబ్బా పటేల్ కూడా ఓటీటీలో ఎంటర్ అయ్యారు. పాయల్ ఇప్పటికే ఓ ఒరిజినల్ మూవీతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆమె నటించిన మరో మూవీ కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది. ఇక హెబ్బా పటేల్ నటిస్తున్న ఓ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది.ఇక పిట్టకథలతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా, ప్రస్తుతం సినిమాల కంటే ఓటీటీ కంటెంట్ పైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. చేతిలో 2-3 ఓటీటీ ఆఫర్లతో బిజీగా ఉంది. లాక్ డౌన్ టైమ్ లో సినిమాల్లేక హీరోయిన్లంతా ఇంటికే పరిమితమైన వేళ.. ఓటీటీ షూటింగ్స్ తో ఈషా రెబ్బా బిజీగా గడిపింది.
అటు బాలీవుడ్ లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. సీనియర్ హీరోయిన్లంతా ఓటీటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మాధురీ దీక్షిత్, రవీనా టాండన్, జూహీ చావ్లా, సుశ్మితా సేన్ లాంటి తారలు ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. సోనాక్షి సిన్హా కూడా త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతోంది.
Must Read ;- ఓటీటీ విడుదలకు క్యూకడుతున్న చిత్రాలు