పీలేరు సబ్ జైలు నుంచి పోలీసు ఎస్కార్టుతో శివప్రసాద్ నాయుడు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం నవాబు పేటకు వచ్చినప్పుడు బహుశా.. పోలింగ్ కేంద్రం దగ్గరున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విలాసంగా నవ్వుకుని ఉంటారు. మేం చెప్పిన మాట వినలేదు.. మా డీల్ కు నువ్వు ఒప్పుకోలేదు.. చూశావా జైల్లో ఉన్నావ్.. జైలు నుంచి పోలీసుల పహరాలో ఓటేయడానికి వచ్చావ్.. అంటూ హేళనగా, కక్షగా నవ్వి ఉంటారు.
కానీ.. వారి నవ్వులు ఎంతో కాలం నిలవలేదు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి వారి మొహాలు మాడిపోయాయి. సిగ్గుతో మొహం చాటేసుకోవాల్సిన దుస్థితి వారిది. ఏమిటిది? ఎందుకిలా జరిగింది. వాళ్లు హేళనగా, కక్షగా ఎందుకు నవ్వారు? ఎందుకు మొహం చాటేసుకోవాలనుకున్నారు.. తెలియాలంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఇంతకూ సదరు గుర్రం శిప్రసాద్ నాయుడుకు వైఎస్సార్ సీపీ వాళ్లు ప్రపోజ్ చేసిన డీల్ ఏంటి? ఆయనే ఆ నవాబుపేట పంచాయతీలో తెలుగుదేశం తరఫున సర్పంచి అభ్యర్థి. ఆయనను పోటీనుంచి తప్పుకోమని వారు అడిగారు. ఒత్తిడి చేశారు. బెదిరించారు. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత కూడా వారి బెదిరింపులు ఆగలేదు. నామినేషన్ విత్డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించారు. అయితే గుర్రం శివప్రసాద్ నాయుడు మాత్రం వెనక్కు తగ్గలేదు. వారి ఒత్తిళ్లకు లొంగలేదు.
శనివారం సర్పంచి ఎన్నిక జరగాల్సి ఉండగా గురువారం రాత్రి- అతణ్ని అరెస్టు చేశారు. మద్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ.. శివప్రసాద్ నాయుడుతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. దాని పర్యవసానమే.. సర్పంచి అభ్యర్థి పోలీసు ఎస్కార్టుతో జైలు నుంచి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా వారి పంతం నెగ్గించుకున్నారు.
కానీ.. నవాబుపేట ప్రజలు మాత్రం.. తెలుగుదేశం అభ్యర్థి వెంటే ఉన్నారు. గుర్రం శివప్రసాద్ నాయుడు ఎన్నికలకు ముందు రోజున కనీసం నలుగురిని కలిసి ఓట్లు అడగడానికి కూడా అందుబాటులో లేకపోయినా.. ఆయనకు మద్దతుగా నిలిచారు. ఫలితాలు వెలువడే సరికి.. శివప్రసాద్ ఏకంగా 56 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిన్న పంచాయతీలో అదృష్టవశాత్తూ దక్కిందని అనుకోగల చిన్న మెజారిటీ కాదు ఇది. గెలిచే అభ్యర్థిని బెదిరించి, కక్షపూరితంగా వ్యవహరించిన వైఎస్సార్సీపీ నాయకులకు బుద్ధి వచ్చేలా చేసే మంచి మెజారిటీ.
ఓడిపోయే సీటు కోసం ఎందుకింత కంగారుపడ్డారో..?
ఏకంగా అభ్యర్థిని జైలుకు పంపించినా కూడా.. 56 ఓట్ల మెజారిటీతో పంచాయతీని గెలవడం అంటే అతను చాలా గట్టి అభ్యర్థికింద లెక్క. తెలుగుదేశం పార్టీకి అక్కడ అనల్పమైన ప్రజాదరణ ఉన్నట్టు లెక్క. అయినా సరే.. ఓడిపోయే సీటుకోసం వైకాపా నాయకులు ఎందుకింత ఆరాటపడ్డట్టు? నామినేషన్ విత్ డ్రా కోసం బెదిరించి, తర్వాత కేసులు బనాయించి.. ఎందుకిలా అభాసుపాలు అయినట్టు? ఈ ఆలోచన ఎవరికైనా కలుగుతుంది.
ఓడిపోయే సీట్లలో కూడా.. అంటే తమకు ఏమాత్రం బలం లేని పల్లెల్లో కూడా పంతం నెగ్గించుకోవాలనే వైఖరి వైకాపా నాయకుల్లో ఈ దఫా చాలా చోట్ల కనిపించింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామంలోనే ఏకగ్రీవం కావాల్సిన పంచాయతీని ఎన్నికకు తీసుకువెళ్లి.. అచ్చెన్నాయుడు అరెస్టు చేయించి.. రకరకాల మాయోపాయాలు పన్నిన అధికార పార్టీ.. చివరికి సాధించింది సున్నా. చిత్తూరు జిల్లా నవాబు పేటలో కూడా అదే జరిగింది.
ఇక్కడ ఏకంగా అభ్యర్థినే అరెస్టు చేయించారు. మద్యం అక్రమ తరలింపు కేసులు బనాయింపజేశారు. అభ్యర్థి జైల్లో ఉన్నా.. తెలుగుదేశం నాయకులు పూనుకుని ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయన వెంట నిలిచారు. గెలిపించారు.
పట్టుదలకు కారణముంది!
నవాబు పేట పంచాయతీ కలకడ మండలం కిందికి వస్తుంది. కలకడ అనేది.. పీలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. అంటే ఇదంతా చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యం. ఎన్నికల పర్వం మొదలైన తర్వాత కూడా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి.. నానా మాటలు తిడుతూ.. వివాదాస్పదంగా మారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదివరకు పీలేరు ఎమ్మెల్యేనే. ఇప్పుడు మారిన సమీకరణల నేపథ్యంలో పుంగనూరు నుంచి నెగ్గుతున్నారు. కానీ.. పీలేరు మీద కూడా పట్టు కోరుకుంటూనే ఉంటారు. పీలేరులో ఉన్న ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కూడా వైకాపాకు చెందిన వాడే. ఎవరికి వారు పట్టు నిలుపుకునే ప్రయాసలో ఏకగ్రీవం చేయించుకోవాలనుకున్నారు. పోటీ తప్పకపోయేసరికి శివప్రసాద్ ను జైలుకు పంపారు. కానీ.. ప్రజలు అతడికే విజయం కట్టబెట్టే సరికి ఖంగుతిన్నారు. అదీ సంగతి!!
ట్వీట్లో లోకేష్ ఎద్దేవా
‘‘ఎంతటి నియంత అయినా ప్రజాస్వామ్యం ముందు తలవంచాల్సిందే. అక్రమ కేసులతో వేధించారు, నామినేషన్ విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి చేసారు. అయినా లొంగకపోయే సరికి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసారు. కానీ విజయాన్ని ఆపలేకపోయారు.’’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
‘‘అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త సత్తా. ధైర్యంగా నిలబడి చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్ పేట పంచాయతీ సర్పంచ్ గా గెలిచి మీసం మెలేసిన శివప్రసాద్ నాయుడుని అభినందిస్తున్నాను.’’ అంటూ లోకేష్ సర్పంచిగా గెలిచిన శివప్రసాద్ నాయుడును ట్విటర్లో అభినందించారు.
Must Read ;- కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: లోకేశ్
ఎంతటి నియంత అయినా ప్రజాస్వామ్యం ముందు తలవంచాల్సిందే. అక్రమ కేసులతో వేధించారు, నామినేషన్ విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి చేసారు. అయినా లొంగకపోయే సరికి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసారు. కానీ విజయాన్ని ఆపలేకపోయారు. pic.twitter.com/1aeUywH3wF
— Lokesh Nara (@naralokesh) February 14, 2021