రాజకీయ చైతన్యానికి ప్రతీకైన సిక్కోలులో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును మంగళవారం ఉదయం పోలీసులు ఆకస్మికంగా అరెస్టు చేయడంతో జిల్లా అంతటా అట్టుడుకుతోంది. అన్యాయంగా, అకారణంగా అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. అచ్చెన్నను పరామర్శించేందుకు వెళుతున్న టీడీపీ నాయకులు ఎక్కడివారిని అక్కడే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం .. ప్రమేయం లేదని .. అంతా ఎన్నికల కమిషన్ నేతృత్వంలోనే సాగుతోందని వైసీపీ వర్గీయులు అంటున్నారు.
శ్రీకాకుళం సబ్ జైల్కి అచ్చెన్న
నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి అచ్చెన్నను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం కోటబొమ్మాళి కోర్టుకు తరలించారు. కోటబొమ్మాళి కోర్టులో అచ్చెన్నాయుడును విచారించాక ప్రధాన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు అచ్చెన్నను శ్రీకాకుళం సబ్ జైల్కు తరలించారు.
పంచాయతీ నామినేషన్ల నేపథ్యంలో..
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు భార్య నామినేషన్ వేశారు. ఆమెకు ప్రత్యర్థిగా అదే కుటుంబానికి చెందిన .. అచ్చెన్నకు వరుసకు కొడుకైన కింజరాపు అప్పన్న నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో అప్పన్నను నామినేషన్ వేయొద్దని అచ్చెన్న వారించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా టీడీపి నేతలు అడ్డుకున్నారని, అప్పన్నను ఫోన్లో అచ్చెన్న బెదిరించారనే ఆరోపణలపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో సోమవారం వైసీపీ వర్గీయులు కేసు పెట్టారు. అప్పన్ననామినేషన్ వేస్తున్న సందర్భంగా అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ పెద్దెత్తున టీడీపి కార్యకర్తలతో నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకొచ్చినట్లు వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ కేంద్రం నుండి బలవంతంగా టెక్కలి వైసీపీ కో ఆర్డినేటర్ దువ్వాడ శ్రీనివాసరావు, సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను .. హరిప్రసాద్ అతని అనుచరులు బయటకు గెంటి వేసినట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దువ్వాడ శీనివాసరావు కారుపై దాడికి యత్నించగా తప్పించుకుని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆ వర్గీయులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కోటబొమ్మాళి పీఎస్లో 22 మందిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సోమవారం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అచ్చెన్న 13వ వ్యక్తిగా తెలుస్తోంది. అచ్చెన్నపై ఐపీసీ సెక్షన్ 147, 148, 324, 307, 384, 506, 341, 120(b), 109, 188, రెడ్ విత్ 149, ఐపీసీ 123(1), ఆర్పీఏ 1951 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Must Read ;- మేమే గెలుస్తాం.. హోంమంత్రి అయి మీ సంగతి చూస్తా : అచ్చెన్న
కేసుకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు : అచ్చెన్నాయుడు
తన అరెస్టుపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే ..‘‘నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు .. ఈ కేసుల్ని చూసి భయపడే వ్యక్తిని కాదు .. ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి వస్తోంది .. పోలీసుల్ని చూసి ఉద్యోగులు సిగ్గు పడుతున్నారు.. చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.. స్థానిక డీఎస్పీ, సీఐలు వైఎస్సార్సీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా, రేపు అధికారం టీడీపీదే .. చంద్రబాబుకు చెప్పి నేనే హోంమంత్రిని అవుతాను .. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు.. నేను నాయకుల్ని తప్పుపట్టడం లేదు.. పోలీసుల్ని తప్పుపడుతున్నాను .. ఈ రోజు ఉదయం డీఎస్పీ, సీఐలు నా బెడ్రూమ్కు వచ్చారు .. నోటీసులు ఇస్తే నేనే వచ్చేవాడిని కదా’’ .. పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు .. ఈ కేసుకు నాకు సంబంధం లేదన్నారు.
అచ్చెన్నను తక్షణమే విడుదల చేయాలి : చంద్రబాబు
అచ్చెన్నాయుడు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. తక్షణమే ఆయన్ను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
అచ్చెన్నాయుడు అరెస్ట్కు మాకు సంబందం లేదు: డిప్యూటీ సీఎం కృష్ణ దాస్
అచ్చెన్నాయుడు అరెస్టు నేపథ్యంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు .. ఆయన మాటల్లోనే ..‘‘ అచ్చెన్నాయుడు తన సొంత గ్రామంలో దౌర్జనానికి పాల్పడ్డారు.. కింజరాపు అప్పన్నను భయబ్రాంతులకు గురి చేశారు.. ఎన్నికల కమిషనర్ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారు.. అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు మాపై బురద జల్లుతున్నారు.. ఎన్నికలకు వైస్సార్సీపీ ఎప్పుడు భయపడదు.. ప్రజలు పెద్ద ఎత్తున వైస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజారంజకంగా పాలన జరుగుతోంది.. టీడీపీ నేతలు దౌర్జన్యలు అక్రమాలకు పాల్పడి వైస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారు.. పోలీసులను భయపెట్టే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు.. కులాలు మతాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.. అచ్చెన్నాయుడు అరెస్టును స్వాగతిస్తున్నాము.. అచ్చెన్నాయుడు అరెస్ట్కు మాకు సంబందం లేదు’’.. అని అన్నారు.
Also Read ;- అచ్చెన్నపై పితూరీ : మొగుణ్ని కొట్టి మొగసాల కెక్కినట్టు!