( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
వైఎస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మాట ఎలా ఉన్నా… ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే… విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న ప్రస్తుత విమానాశ్రయం పూర్తిగా ఇండియన్ నేవీ ఆధీనంలోకి వెళ్ళిపోనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమైన 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తాజాగా విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
రెండు విమానాశ్రయాలు ఎలా?
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఉన్న విమానాశ్రయాన్ని కొనసాగించడం వల్ల నష్టం ఏంటని ప్రశ్నించినందుకు ఎంపీ గారికి చిర్రెత్తుకొచ్చింది. రూల్స్ తెలియకుండా మాట్లాడొద్దు అంటూ ఆయన మండిపడ్డారు. విమానాశ్రయాలకు మధ్య నిర్దిష్ట దూరం ఉండాలని తెలియదా? అంటూ మీడియాను, రాజకీయ పార్టీలను ప్రశ్నించారు. మరి ఇప్పటికే విశాఖ పోర్టు ట్రస్టు ఉండగా… అదే విశాఖలో గంగవరం ప్రైవేట్ పోర్టును ఎలా కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసే ముందు మరి ఆ దూరాన్ని చూసుకోవాల్సిందిగా అంటూ హితవు పలుకుతున్నారు.
Must Read ;- ఏది ముఖ్యం : పోలవరమా? విగ్రహాలా?
అంతర్జాతీయ స్థాయిలో..
విశాఖ విమానాశ్రయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. గత ప్రభుత్వాల కృషి కారణంగా, మేఘాలు కమ్మితే విమానాలు తిరగని పరిస్థితి నుంచి…24 గంటలు.. భారీ తుఫాను సమయంలోనూ ఫ్లైట్ ఆపరేషన్లు నిర్వహించే స్థితికి ప్రస్తుతం విమానాశ్రయం అభివృద్ధి చెందింది. 2006 కు ముందు… విశాఖ విమానాశ్రయం వర్షాకాలంలో ఎన్నిసార్లు మునిగిపోయిందో అధికారులకే తెలియదు. చిన్న టెర్మినల్ భవనం నుంచి నేడు రాష్ట్రంలోని అత్యధిక ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చుకుంది. భోగాపురం విమానాశ్రయం ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నప్పుడు…. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ప్రస్తుతం సుమారు మరో రూ.100 కోట్ల వ్యయంతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత విమానాశ్రయంలో డొమెస్టిక్ ఎయిర్ సర్వీసులపై ఎన్నో ఆంక్షలు పెట్టేందుకు నేవీ ప్రయత్నించింది. ఉదయం మూడు గంటలు, మధ్యాహ్నం మూడు గంటలు మాత్రమే అనుమతి ఇస్తామంటూ ఆధిపత్యం చూపే ప్రయత్నం చేసింది. దానిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించడంతో వెనక్కు తగ్గింది.
ఉద్యమ బాట దిశగా ప్రజాసంఘాలు..
ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం పూర్తిగా నేవీకి అప్పగించేందుకు అడుగులు ముందుకు వస్తే ఉద్యమం తప్పదని ఇప్పటికే ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జనసేన, కమ్యూనిస్టులు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read ;- ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏమిటో చూపించిన చంద్రబాబు











