(శ్రీకాకుళం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీ రాజకీయాలకు హార్ట్ బీట్ గా వ్యవహరిస్తున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికార పార్టీ నాయకులే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు.. టీడీపీ కూడా స్పీకర్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉంది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఆయన తరచుగా రాజకీయాలు మాట్లాడడం, విమర్శలు చేయడాన్ని టీడీపీ ఇప్పటి వరకు కార్నర్ చేయలేదు. ఆచి తూచి వ్యవహరిస్తోంది. అయితే.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు టీడీపీ అధ్యక్ష పదవిలో ఉన్న నేపథ్యంలో స్పీకర్కు చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు టీడీపీ నాయకులు.
వారసుడు ఆరంగేట్రం
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కిన సీతారాం.. వచ్చే ఎన్నికల నాటికి తన వారసుడిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే.. వైసీపీలో మాత్రం స్పీకర్ వ్యవహార శైలిపై సొంతపార్టీ నాయకులు లోలోన విమర్శలు సంధిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో అధికార పార్టీ తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటోందని, దీనిని చల్లార్చాల్సిన స్పీకర్.. మరింతగా రెచ్చగొట్టేలా చేస్తున్నారని.. కేంద్రమాజీ మంత్రి, శ్రీకాకుళం వైసీపీ ఇంచార్జ్ కిల్లి కృపారాణి తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది.
తరచుగా రాజకీయాలు మాట్లాడడం ఏంటి ? పార్టీ పరువు పోతోందని ఆమె అంతర్గత సంభాషణల్లో స్పీకర్ పేరు ఎత్తకుండానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు..టీడీపీ కూడా ఇప్పటి వరకు స్పీకర్ విషయంలో ఆచితూచి వ్యవహరించినా.. ఇకపై ఆయనపైనా విమర్శలు ఎక్కుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఇలా రాజకీయాలు మాట్లాడడంపై త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి.. స్పీకర్పై యుద్ధమే చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
వ్యూహాత్మకంగా కూనకు సారథ్యం..
స్పీకర్ బంధువు, టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ను దీనికి ఆయుధంగా వాడుకునేలా పక్కా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అదేసమయంలో జిల్లా అభివృద్ది విషయంలోనూ వైసీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Must Read ;- ‘దైవదూత’ కీర్తనలతో తమ్మినేనికి ఫలం దక్కుతోంది మరి!!