ఏపీలో సీఎం జగన్ తన కేబినెట్ను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. వచ్చే నెల 15న జగన్ తన కేబినెట్ను పునర్వవస్థీకరించనున్నారని, ప్రస్తుతం తన కేబినెట్లోని మంత్రులందరికీ ఉద్వాసన పలకనున్న జగన్.. కేబినెట్లో మొత్తం కొత్తవారికే అవకాశం కల్పించనున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రస్తుతం తన కేబినెట్ లో ఉన్న మంత్రులందరినీ ఒక్కొక్కరిగా పిలిపించుకుంటున్న జగన్.. ఉద్వాసనకు సంబంధించిన వార్తలను వారి చెవిలో వేయడం ద్వారా వారి నుంచి ఎలాంటి విముఖత వ్యక్తం కాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఈ విషయంలో చాలా మంది బయటపడకున్నా.. జగన్ మామ బాలినేని శ్రీనివాసరెడ్డి బయటపడిపోయారు. కేబినెట్లోని మొత్తం మంత్రులను తొలగించనున్నారని, అందులో భాగంగా తన పదవి కూడా పోతోందని, పదవి పోయినా పార్టీ కోసం పనిచేసేందుకు తాను సిద్ధమేనని బాలినేని చెప్పేశారు.
కొత్త మంత్రుల జాబితా ఇదేనా..?
జగనఖ కొత్త కేబినెట్ లో అంతా కొత్త మంత్రులే ఉంటారన్నది దాదాపుగా స్పష్టమైన నేపథ్యంలో ఆయా జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికన జగన్ ఇప్పటికే తన కసరత్తును పూర్తి చేశారని, తుది జాబితా కూడా సిద్ధమైపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, విజయనగరం జిల్లా నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేశ్, ముత్యాల నాయుడు, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, సతీష్, నాగులాపల్లి ధనలక్ష్మి, రాజకీయంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముదునూరి ప్రసాద రాజు, కొట్టు సత్యానారాయణ, గ్రంధి శ్రీనివాస్, కృష్ణా జిల్లా కొలుసు పార్థసారధి, జోగి రమేశ్ ఉన్నారని సమాచారం. ఇక గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ప్రకాశం జిల్లా నుంచి మహీధర్రెడ్డి, అన్నా రాంబాబు, నెల్లూరు జిల్లా నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య,
చిత్తూరు జిల్లా నుంచి రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కడప నుండి కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, సి.రామచంద్రయ్య, అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డి, ఉషశ్రీచరణ్, కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి ఉన్నట్లుగా సమాచారం.
వడబోతలో మరికొందరు ఔటే!
అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య ఆధారంగా జగన్ తన మంత్రివర్గాన్ని 25 మంది నుంచి 30 మంది దాకా ఏర్పాటు చేసుకునే వీలుంది. అయితే ఇప్పటిదాకా కొనసాగిన కేబినెట్ 25 మందితోనే జగన్ నెట్టుకువచ్చారు. అయితే ఇప్పుడు రంగంలోకి దిగబోతున్న కేబినెట్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. మంత్రుల సంఖ్య 30కి పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ తన సామాజిక వర్గానికి చెందిన చాలా మంది కీలక నేతలకు మొండిచేయి చూపించే అవకాశాలున్నాయని చెప్పక తప్పదు. ఇలాంటి వారిలో ముందుగా వినిపిస్తున్న పేరు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాదే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతున్న రోజా.. తన నియోజకవర్గాన్ని కూడా చక్కబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆమెకు మంత్రి పదవి దక్కే ఛాన్సే లేదన్న వార్తలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో కర్నూలు జిల్లా నుంచి అటు శిల్పా ఫ్యామిలీ, ఇటు కాటసాని ఫ్యామిలీల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలున్నారు. దీంతో ఈ రెండు ఫ్యామిలీల్లో ఒక్కొక్క పదవి ఇస్తే.. కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికే పెద్ద పీట దక్కినట్టు అవుతుంది. దీంతో వీరిద్దరికీ హ్యాండిచ్చేసి.. వేరొకరికి పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇక తూర్పులో దాడిశెట్టి రాజాతో పాటు జక్కంపూడి రాజా కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో ఎవరిని సముదాయిస్తారో తెలియడం లేదు. ఇక ఎస్సీ కోటాలో కొరముట్ల శ్రీనివాసులుతో పాటు కిలివేటి సంజీవయ్య, తిప్పేస్వామి, జొన్నలగడ్డ పద్మావతి తదితరులున్నారు. ఎస్టీ కోటాలోనూ చాలా మంది ఆశావహులున్నారు. అదే విధంగా బీసీ కోటాలో అయితే లెక్కలేనంత మంది ఎమ్మెల్యేలు తమకు ఈ దఫా మంత్రి పదవి గ్యారెంటీ అనే ధీమాతో ఉన్నారు. ఈ లెక్కలన్నింటికీ జగన్ ఏ రీతిన న్యాయం చేస్తారో చూడాలి.
Must Read ;- కమాన్ ఖాన్.. ‘ఖైమా’ కొట్టు, మినిస్ట్రీ పట్టు