బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్లో రెండో పోరుకు భారత్ సిద్ధమైంది. ఆసీస్తో ‘బాక్సింగ్ డే’ మ్యాచ్కు… రహానె సారథ్యంలోని టెస్టు బృందం సన్నద్ధమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
బాక్సింగ్ డే టెస్టుకు భారత్ సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో కాలు దువ్వేందుకు సై అంటోంది. జట్టులో కీలక మార్పులతో బరిలోకి దిగబోతోంది. పీడకలలా నిలిచిన తొలిటెస్టు ఓటమిని… కోట్లాదిమంది భారతీయుల మదిలోంచి తుడిపేసేందుకు సై అంటోంది. సొంతగడ్డపై రెట్టించిన ఉత్సాహంతో సై అంటున్న కంగారూల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు సమాయత్తమైంది. బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్లో విజయావకాశాలను పదిలం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. విరాట్ గైర్హాజరీతో రహానె జట్టును ఎలా నడిపిస్తాడనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
కీలక మార్పులతో భారత్…
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్కు ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్, హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. పృథ్వి షా స్థానంలో తుది జట్టులోకి వస్తున్న గిల్.. మయాంక్ అగర్వాల్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు.
తుది జట్టుపై విమర్శలు…
అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ 0, 4 పరుగులతో నిరాశపరిచిన ఓపెనర్ పృథ్వీ షాపై వేటు పడగా.. అతని స్థానంలో శుభమన్ గిల్ ఓపెనర్గా టీమ్లోకి వచ్చాడు. ఇక పితృత్వ సెలవులు తీసుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్కి వచ్చేయగా.. మోచేతి గాయంతో అతని వెంట ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా వచ్చేశాడు. దాంతో.. కోహ్లీ స్థానంలో రవీంద్ర జడేజా, షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. ఇక వికెట్ కీపర్ సాహా.. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లో 9, 4 పరుగులే చేయడంతో అతడిపైనా వేటు పడింది. దాంతో.. రిషబ్ పంత్కి చోటు దక్కింది. అయితే.. కేఎల్ రాహుల్ని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రెట్టింపు ఉత్సాహంతో ఆసీస్…
మరోవైపు తొలిటెస్టు విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధమైంది. గాయాలు వేధిస్తున్నా సరే ఆ జట్టు భారత్ కన్నా సమతూకంగానే ఉంది. పేస్ బౌలింగ్ ఆ జట్టుకు పెద్ద బలం. హేజిల్వుడ్, కమిన్స్, స్టార్క్ మరోసారి భారత్ను బెంబేలెత్తించడానికి సిద్ధమవుతున్నారు.
Must Read ;- క్రికెట్ ప్రపంచపు చరిత్రలో చెత్త రికార్డులు చూద్దాం రండి..
మెల్ బోర్న్ మైదానంలో రికార్డులిలా…
మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్పై ఆస్ట్రేలియాకు మంచి రికార్డుంది. ఇక్కడ ఈ రెండు జట్లు 13 టెస్టుల్లో తలపడగా.. ఆస్ట్రేలియా ఎనిమిది నెగ్గింది. భారత్మూడు టెస్టుల్లో గెలవగా.. రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయమేంటంటే.. చివరిసారి ఇక్కడ ఆసీస్తో ఆడిన టెస్టులో 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడమే. 2011 నుంచి మెల్బోర్న్లో భారత్ఓడిపోలేదు.
రహానె… తనదైన ముద్ర వేస్తాడా?
పుజారా అంటే దుర్భేద్యమైన డిఫెన్స్తో నిలబడే టెస్టు స్పెషలిస్టు. విరాట్ కోహ్లీ ఆల్రౌండర్. అన్ని ఫార్మాట్లలోనూ మొనగాడు. ఇక రోహిత్ టెస్టుల్లో తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్న పరిమిత ఓవర్ల ఛాంపియన్. మరి రహానె ఏంటి? వెంటనే జవాబు చెప్పడం కష్టం. వాళ్ల లాగే సీనియర్ అయిన అతడి ప్రత్యేకత ఏంటో చెప్పలేం. 13 పర్యటనల్లో జట్టుతో ఉన్న తర్వాత ఎట్టకేలకు 2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లలో అగ్రశ్రేణి ఫాస్ట్బౌలర్లను ఎదుర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆడిన తొలి 13 సిరీస్ల్లో అతడు 9 సిరీస్ల్లో 50పై సగటు నమోదు చేశాడు. టెస్టు జట్టులో అంతర్భాగమైపోయాడు.
కేవలం 36 పరుగులకే కుప్పకూలి, సిరీస్ను పరాభవంతో ఆరంభించిన భారత జట్టు.. కోహ్లీ, షమీ లాంటి కీలక ఆటగాళ్లను దూరం చేసుకుని తీవ్ర ఇబ్బందికర స్థితిలో ఉంది. మైదానంలోకి దిగడానికి ముందే కూర్పు దగ్గరే రహానెకు సవాలు ఎదురు కానుంది. ఇక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న జట్టును మైదానంలో నడిపించడం రహానెకు అతి పెద్ద సవాల్. బ్యాటింగ్లో అతను చక్కటి ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించాలి. బౌలింగ్ సందర్భంగా కెప్టెన్గా తన ముద్రను చూపించాలి. మరి అతనెలా ఆడతాడో.. కెప్టెన్గా ఎలాంటి వ్యూహాలతో దిగి, వాటినెలా అమలు చేస్తాడో, ఎలాంటి ఫలితాలు రాబడతాడో?
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ :
జో బర్న్స్, మాథ్యూ వెడ్, మార్కస్ లబుషేన్, స్టీవ్స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పైనీ (కెప్టెన్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హేజిల్వుడ్.
భారత్ తుది జట్టు:
మయాంక్అగర్వాల్, శుబ్మన్గిల్, చతేశ్వర్పుజారా, అజింక్యా రహానే (కెప్టెన్), హనుమ విహారి, రిషబ్పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్అశ్విన్, ఉమేశ్యాదవ్, జస్ప్రీత్బుమ్రా, మహ్మద్సిరాజ్.











