కేన్సర్.. నిశ్శబ్దంగా ప్రాణాలు హరిస్తున్న జబ్బు. దశాబ్దాలుగా ప్రపంచానికి కొరుకుడు పడని వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 41 లక్షల 17 వేల కోట్ల రూపాయల సొమ్మును హరిస్తున్న అత్యంత ఖరీదైన జబ్బు. ఏడాదికి దాదాపు ఒకటిన్నర కోట్ల మందిని బలితీసుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచంపై నిప్పుల కుంపటిలా తయారైన ఈ జబ్బుకి.. నేటికీ టీకా తయారు కాలేదు. చికిత్స ఉన్నప్పటికీ.. అది ప్రారంభ దశలో మాత్రమే పనిచేస్తుంది. ఏడాది క్రితం వచ్చి 20 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనాకు టీకా వచ్చిందేగానీ.. దశాబ్దాలుగా కోట్ల మందిని బలితీసుకుంటున్న ఈ మహమ్మారికి మాత్రం మందు లేదు. ప్రజల్లో కనీసం అవగాహన కూడా లేదు. కరోనా గురించి తెలిసినంతగా కూడా సామాన్యులకు కేన్సర్ గురించి తెలియదంటే.. ఏమనుకోవాలి? ఎవరిని తప్పుబట్టాలి? ప్రభుత్వాలనా? వైద్యులనా?
అవగాహనా లోపమే అసలైన కేన్సర్!
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. పేద, మధ్యతరగతి దేశాల్లోనే ఈ మహమ్మారి వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అంటే.. దీనర్థం.. సంపన్న దేశాల్లో లేదని కాదు.. రాదని కాదు. అక్కడా కేన్సర్ రోగులు భారీగానే ఉంటారు. కానీ, అక్కడి ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఎక్కువ. ప్రతి ఏడాదీ కేన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటారు. అది తమ బాధ్యతగా భావిస్తారు. ఏ ఒక్క కేన్సర్ లక్షణం కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటారు. దీంతో.. కేన్సర్ సోకినా.. మరణాన్ని తప్పించుకుంటున్నారు. కానీ, పేద, మధ్యతరగతి దేశాల్లో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం. ఇక్కడి ప్రజల్లో అధికశాతం మందికి కేన్సర్ పై కనీసపాటి అవగాహన కూడా ఉండదు. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయవు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆ పని చేస్తున్నా.. వాటికి ప్రభుత్వం నుంచి సహకారం లభించదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రజలకు ఈ మహమ్మారిపై అవగాహన పెరగడం లేదు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. కేన్సర్ లక్షణాలు కూడా అధిక శాతం మందికి తెలియవు. కేన్సర్ సోకినా.. అది చివరి దశకు చేరుకునే వరకు దాన్ని గుర్తించలేరు. అప్పటికే సమయం మించిపోవడం వల్ల మరణం తప్పడం లేదు. ఇక్కడి ప్రజల్లో చైతన్య లేమి, నిరక్ష్యరాస్యత ఎక్కువగా ఉండడం కూడా మహమ్మారి వ్యాప్తికి కారణమవుతోంది.
Must Read ;- హనుమంతుడు సంజీవని తెచ్చారు.. భారత్ టీకా ఇచ్చింది..

అసలు ఏమిటీ కేన్సర్?
సాధారణంగా మన శరీరంలో కణ విభజన ఓ క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఒక్కోసారి ఆ కణ విభజన ప్రక్రియలో నియంత్రణ కొరవడుతుంది. ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఇవి.. కణ సమూహాలుగా ఏర్పడుతాయి. వీటినే కణితలు (ట్యూమర్లు) అంటారు. విభజన చెందిన కణాలు అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపే.. ఈ ట్యూమర్. అలాంటి వాటిలో కొన్ని ప్రమాదకరంగా మారుతాయి. వీటినే కేన్సర్ కణితలు అంటారు. వీటికి ఓ స్పష్టమైన విధి ఉండదు. అంతగా ప్రమాదకరం కాని కణితలు కూడా ఉంటాయి. ఇవి అస్తవ్యస్తంగా పెరగవు. ఒక చోట నుంచి మరో చోటకు వ్యాపించవు. అదే కేన్సర్ కణితలు అయితే.. నిరవధికంగా, అస్తవ్యస్తంగా పెరిగిపోతాయి. శరీరంలోని ఇతర భాగాలకూ వేగంగా వ్యాపిస్తాయి.
క్యాన్సర్ లక్షణాలు
ప్రధానంగా 7 రకాల లక్షణాలను కేన్సర్ సూచికలుగా వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంపై పుండు ఏర్పడితే.. వెంటనే మానకపోవడం, అసహజ పద్ధతిలో రక్తస్రావం జరగడం, కణితలు అనూహ్యంగా పెరుగుతుండడం, గొంతు బొంగురుపోవడంతో పాటు దగ్గు ఎంతకీ తగ్గకపోవడం, మల విసర్జన ప్రక్రియలో మార్పులు జరిగి.. మలంలో రక్తం పడడం, ఆహారం మింగుడు పడకపోవడంతో పాటు అరగక పోవడం, పుట్టుమచ్చల్లో మార్పులు జరగడం.. తదితర లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. కేన్సర్.. శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉందని, ముఖ్యంగా.. గర్భాశం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు.
Must Read ;- గ్యాస్ట్రిక్ సమస్యా.. అయితే వీటికి దూరంగా ఉండండి!
చికిత్స ఉంది కానీ..

కేన్సర్ వ్యాధికి చికిత్స ఉంది. కానీ, అది ప్రారంభ దశలో మాత్రమే పనిచేస్తుంది. ఒక్కసారి వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్ కి వెళ్లిందంటే.. వైద్యులు కూడా ఏమీ చేయలేరు. మరణమే శరణ్యం. ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడమే.. మరణాల నివారణలో కీలకం. అలా గుర్తించాలంటే.. ప్రజల్లో దీని పట్ల అవగాహన ఉండాలి. అసలు కేన్సర్ అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి? లాంటివైనా తెలిసి ఉండాలి. ఇదే.. భారత్ లాంటి కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కేన్సర్ లక్షణాలు తెలుపుతూ.. కూడళ్లలో హోర్డింగులు పెట్టడం, కేన్సర్ డే నాడు ర్యాలీలు నిర్వహించడం మాత్రమే సరిపోదు. గ్రామ గ్రామల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, లక్షణాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించడం, కేన్సర్ పరీక్షలు చేయడం.. లాంటి కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వాలు విస్తృతంగా నిర్వహిస్తే.. ఫలితముంటుంది. కేన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించడం వీలవుతుంది. ఇక్కడ మరో ప్రధాన సమస్య ఏంటంటే.. చికిత్సకు అయ్యే ఖర్చు. ఈ ఖర్చు సామన్యులకు పెనుభారం. ఇందుకు భయపడే.. ముందుగా గుర్తించినా.. అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తే.. వేలాది ప్రాణాలను నిలబెట్టడం సాధ్యపడుతుంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు ఉచితంగా, మరికొన్ని తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నాయి. అలాంటి ఆస్పత్రులను గుర్తించి.. ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే.. ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
Also Read ;- డైట్ వర్సస్ వ్యాయామం? బరువు తగ్గేందుకు ఉత్తమమైన మార్గం ఏది?
కేన్సర్ అంటే మరణం కాదు..
కేన్సర్ వచ్చిందంటే.. ఇక మరణమే అన్న భావన నేటికీ అనేక మందిలో ఉంది. ఈ భావనతోనే చాలా మంది సగం చచ్చిపోతున్నారు. ఇది మందులేని వ్యాధని కుంగిపోతుంటారు. ఆ కుంగుబాటే.. వారిని మరణానికి మరింత దగ్గర చేస్తుంది. కేన్సర్ రోగులకు ముందుగా కావలసింది.. ధైర్యం, మనో నిబ్బరం. ఈ రెండూ ఉంటే.. కేన్సర్ ను సగం జయించవచ్చు. ఈ వ్యాధికి మందులు లేకపోవచ్చు గానీ.. చికిత్స ఉంది. ప్రారంభ దశలోనైతే.. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ఖర్చు భరించలేం అనుకున్న వారికి చికిత్స చేసేందుకు కొన్ని కేన్సర్ ఆస్పత్రులు ఉన్నాయి. ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజ్ లో గుర్తించినా.. మనో నిబ్బరంతో ఎదుర్కొంటే.. కొంత కాలం పాటు దాని ప్రభావాన్ని నిలువరించవచ్చు. కాబట్టి.. కేన్సర్ ను భయంతో కాకుండా.. ఆత్మస్తైర్యంతో ఎదుర్కొందాం. దానిపై అవగాహన పెంచుకుందాం. ఆ మహమ్మారిని దేశం నుంచే గాక.. ప్రపంచం నుంచే తరిమికొడదాం.
Also Read ;- అమ్మలూ.. ఇంటినీ, పనినీ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి!











