తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. అదే అంశంపై ఏపీ ఇన్ఛార్జి మురళీధరన్తోనూ భేటీ అయ్యారు. వారం క్రితం వరకు సైలెంట్గా ఉండి ఇంత హఠాత్తుగా సోము వీర్రాజు స్పందించడంపై ఆ పార్టీలోనే చర్చనీయాంశం అయింది. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సమన్వయంతో ఉంటేనే పొత్తులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ తమ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై అసహనానికి గురైన పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చర్చ నడిచింది. దీంతో ఉలిక్కిపడిన ఏపీ బీజేపీ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమైంది. అదే సమయంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు అభ్యర్థి విషయంలో తమ పంతం నెగ్గించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు.
టీడీపీని లక్ష్యంగా చేసుకుని..
ఇక ఏపీలో బీజేపీ వైఖరి పట్ల మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఏపీ బీజేపీకి టీడీపీయే ఇప్పటికీ అధికార పక్షంగా కనిపిస్తోందని, ఇంకా టీడీపీని లక్ష్యంగా చేసుకుని.. అసలు పోరాడాల్సిన అధికార వైసీపీని మిత్ర పక్షంగా భావిస్తోందనే కామెంట్లు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. రామతీర్థం ఘటనలో స్పందించాల్సిన సమయంలో స్పందించకపోవడంతో టీడీపీకి మైలేజీ వచ్చిందనే విషయంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జగన్పై సాఫ్ట్ కార్నర్ ఉండడంతోపాటే.. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయలేదని, తీరా టీడీపీ ముందుకు వచ్చాక.. తప్పని సరి పరిస్థితుల్లోనే సోము వీర్రాజు ఆందోళనకు సిద్ధమయ్యారరని ప్రచారం జరుగుతోంది. ఇక్కడే మరో విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. నంద్యాల ఆసుపత్రి విషయంలో సోము వీర్రాజు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మోదీ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్ అని పొగడ్తలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటికే నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అనే కామెంట్లు వస్తున్నాయని, ఇలా అధికార పక్షానికి వంత పాడుతుంటే పార్టీ విస్తరణ ఎలా సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అప్పుడే ఉమ్మడి నిర్ణయాలు..
ఇక సోము వీర్రాజు కంటే ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీ నారాయణ హయాంలోనే పార్టీ నిర్ణయాలు ఉమ్మడిగా అమలయ్యేవని, ఇప్పుడు వ్యక్తిగత అజెండా ఎక్కువైందని కామెంట్లు వస్తున్నాయి. కామినేని, కన్నా, సుజనా చౌదరి లాంటి వారు చాలా వరకు మీడియాకూ దూరమయ్యారు. సోము సర్కిల్లోని వ్యక్తులుగా ప్రచారం జరుగుతున్న విష్ణు వర్ధన్రెడ్డి, భాను ప్రకాష్రెడ్డి. ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు తప్ప మిగతా వారు పెద్దగా బయటకు కూడా రాని పరిస్థితి కనిపిస్తోందంటే.. సోము నాయకత్వం ఎలా ఉందో అర్థం అవుతోందని ఆ పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. కొన్ని ప్రకటనల విషయంలోనూ పార్టీ పరువు పోయే పరిస్థితి కనిపిస్తోందనే చర్చ కూడా నడుస్తోంది.
Must Read ;- జనసేనాని పవన్తో బీజేపీ రథసారధి సోము వీర్రాజు భేటీ
కళా వెంకట్రావు విషయంలో పోయిన బీజేపీ పరువు..
ఓవైపు తెలంగాణలో బీజేపీ అధికార పక్షాన్ని ఎక్కువగా టార్గెట్ చేసింది. కాంగ్రెస్ను టార్గెట్ చేసినా..అధికార టీఆర్ఎస్ను మాత్రం వదలడం లేదు. అలాంటిది ఏపీలో ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసింది బీజేపీ. ఇధే పలు అనుమానాలకు కారణం అవుతోంది. ఏపీలో ఇటీవలి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావు బీజేపీలో చేరతారని, తాను మాట్లాడానని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆ రోజు చర్చనీయాంశమైంది. అయితే కళా వెంకట్రావు కౌంటర్ ఇచ్చారు. తాను సోము వీర్రాజుని కలవలేదని ఇలాంటి ప్రకటనలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై సోము వీర్రాజు స్పందిస్తూ..పొరపాటున తాను ప్రెస్ మీట్లో కన్ఫ్యూజన్లో కళా వెంకట్రావు పేరు తెరపైకి తెచ్చానని, తాను ఆయనను అసలు కలవలేదని వ్యాఖ్యానించారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం ఏంటనే ప్రశ్న ఆ పార్టీలోనే తలెత్తింది.
వాళ్ళ చేరిక వాయిదా..
ఏపీలో పెద్ద యెత్తున చేరికలు ఉంటాయని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే చెన్నై వెళ్లి మరీ సినీనటి వాణీ విశ్వనాథ్, ప్రియా రామన్ని కలిశారు. వారి మధ్య చర్చ ఏం జరిగిందనే విషయం పక్కన బెడితే.. వారు పార్టీలో చేరతారని సోము వీర్రాజు ప్రకటించారు. అయితే వారు ఇంకా పార్టీలో చేరలేదు. గంటా శ్రీనివాస్ పేరు కూడా ఇలాగే తెరపైకి వచ్చినా.. ఇంకా ఆయన బీజేపీలో చేరలేదు. ఇలా చాలా మంది పార్టీలో చేరికకు సుముఖంగానే ఉన్నా.. పార్టీ అధ్యక్షుడి వైఖరి నచ్చకే పార్టీలో చేరడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Also Read ; పవన్ తిరుమల పర్యటన ఆంతర్యమేమిటో?
హైకమాండ్కి ఫిర్యాదులు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేతలే హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. మూడు రోజుల క్రితం ఆ పార్టీ సీనియర్ లీడర్.. పార్టీ హైకమాండ్కి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఘటనలు, చేసిన ప్రకటనలు, జనసేనతో సమన్వయ లోపం, హైకమాండ్ ఆదేశాలకు భిన్నంగా జరగుతున్న పరిణామాలపై పాయింట్ల వారీగా ఈ లెటర్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. రామతీర్థం ఘటనను నిరసిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాక.. బీజేపీ స్పందించడాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సైద్ధాంతికంగా హిందూత్వ నినాదానికి అనుకూలంగా ఉండే బీజేపీ..ఈ విషయంలో వెనుకబడడం రాజకీయంగా నష్టం తెచ్చిందని హైకమాండ్ కూడా భావించినట్లు తెలుస్తోంది. జనవరి 2న టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం వెళ్లారు. అక్కడ జరిగిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జనవరి 5న రామతీర్థం యాత్రకు బీజేపీ పిలుపునిచ్చింది. పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు సొమ్మసిల్లారు. జనవరి 7 మరోసారి యాత్రకు బీజేపీ సిద్ధమైంది. ఈ యాత్రలో జరిగిన తోపులాటలో సోమువీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి ఇద్దరూ సొమ్మసిల్లి పడిపోయారు. అయితే బీజేపీకి మాత్రం అనుకున్నంత మైలేజీ రాలేదు. సోము వీర్రాజు ఆరోగ్య పరిస్థితిపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆరాతీయడం, సికిందరాబాద్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తరువాత పెద్దగా స్పందించలేదని, ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు మినహా పార్టీకి దిశానిర్దేశం చేయలేదని చెబుతున్నారు. ఇక జనసేన విషయంలోనూ సోము వీర్రాజు స్పందిస్తున్న తీరుపై సహనం నశించిన పవన్ కల్యాణ్ మొన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తాము తెగదెంపులు చేసుకునేందుకు వెనుకాడేది లేదనే కోణంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఒక వేళ అదే జరిగితే.. పార్టీ హైకమాండ్ తీసుకునే కఠిన నిర్ణయాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతోనే.. సోము వీర్రాజు హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో బీజేపీ సారధి సోము వీర్రాజుకి అధికార వైసీపీ మిత్రపక్షంగా కనిపిస్తోందని, ప్రతిపక్ష టీడీపీ ప్రత్యర్థిగా కనిపిస్తోందని, అందుకే టీడీపీని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.
Also Read ;- కేసీఆర్ను సంజయ్ పల్లకిలో మోస్తాడట.. దోమాల సేవ చేస్తాడట!