హాట్ మిల్క్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలయుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అమూల్ డెయిరీని ప్రోత్సహిస్తూ.. ఆ డెయిరీకి పాలుపోస్తే.. పాడిరైతులకు ఎక్కువ ధర గిట్టుబాటు అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రైతులంతా అమూల్కు పాలుపోసేలా ప్రోత్సహిస్తున్నారు. తాము పాడిరైతుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే.. ఈ ‘ఎక్కువ ధర’ అనేది మిథ్య అనే వాదనలు మొదలయ్యాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన సవాళ్లు విసురుతున్నారు. అమూల్ డెయిరీ మీద జగన్ సర్కారు ఎందుకంత ప్రేమ చూపిస్తోందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అదొక్కటే కాదు… మౌలిక వసతుల పరంగా వారికి కల్పించే సదుపాయాలు తమకు కల్పిస్తే గనుక.. తాము లీటరుకు 30 రూపాయలు అదనంగా రైతులకు ఇస్తాం అని కూడా నరేంద్ర సవాలు విసిరారు. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం.. అమూల్ కు పాలుపోయడం వల్ల రైతుకు అదనంగా వచ్చేది 7 రూపాయలు మాత్రమే. అది కూడా అబద్ధమే అనేది ఒక వాదన. కాగా, ఇప్పుడు ధూళినాళ నరేంద్ర చెబుతున్న ప్రకారం.. లీటరుకు 30 రూపాయలు ఎక్కువగా రావడం అంటే.. అది పాడి రైతుకు మామూలు లాభం కాదు. మరి ఈ సవాలును ప్రభుత్వం స్వీకరిస్తుందా? పతాక స్థాయికి చేరుతున్న ధరల యుద్ధంలో తమ నిర్ణయం సరైనదేనని ఢంకాబజాయించి నిరూపించుకోగలుగుతుందా?
తాజాగా, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర- డెయిరీ డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం అమూల్ కోసం ఎక్కువగా తహతహలాడుతోందని, సుమారు రూ. 3 వేల కోట్లను మౌలిక సదుపాయాల నిమిత్తం ఖర్చు పెట్టడం దేనికని ఆయన ప్రశ్నించారు. అమూల్ సంస్ఖకు ఆస్తులను ధారాదత్తం చేయాలని ఎందుకు భావిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఏపీలో విజయ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడరుగా ఉండాల్సిన సీఎం.. అమూల్కు బ్రాండ్ అంబాసిడరుగా ఎందుకు మారారో అర్ధం కావడం లేదని నరేంద్ర ఎద్దేవా చేశారు.
ఏపీలోని వ్యవస్థల కోసం కాకుండా ముఖ్యమంత్రి, గుజరాత్లోని వ్యవస్థల కోసం పని చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. సంగం డెయిరీ విషయంలో కక్ష కట్టినట్టు వ్యవహరిస్తే.. రాజకీయం అనుకోవచ్చునని, కానీ ఎన్నికల ముందు ఒంగోలు డెయిరీ కునారిల్లుతోందని మొసలి కన్నీరు కార్చిన జగన్.. ఆ డెయిరీని కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఒంగోలు డెయిరీ సేకరించే పాలను అమూల్కు మళ్లిస్తున్నారని, ఒంగోలు డెయిరీకి ఏడాదిన్నర కాలంలో రూ. 3లు కూడా ఇవ్వలేదని, ఒంగోలు డెయిరీని కాపాడుకోవాలని అన్నారు. ఒంగోలు డెయిరీ నిర్వీర్యం అవుతోంటే మంత్రి బాలినేని ఏం చేస్తున్నారని నరేంద్ర ప్రశ్నించారు.
సబర్ కాంతా యూనియన్ గుజరాత్ రాష్ట్రంలో పాల సేకరణకు రూ. 730 ఇస్తోంది.. కానీ ఏపీలో రూ. 650 ఇవ్వడం ఎలా సబబు అని నరేంద్ర సందేహం లేవనెత్తారు. రూపాయి ఖర్చు కూడా చేయని అమూల్ సేవలో అధికారులందరూ తరిస్తున్నారని అడిగారు.
వివిధ రాష్ట్రాల్లో అమూల్ సంస్థ పాలను సేకరిస్తోన్నా అక్కడి ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం లేదని, కానీ ఏపీ ప్రభుత్వం ఖర్చంతా తామే పెడుతోందని అన్నారు. ఒకవైపు అప్పులు చేస్తూ, రాష్ట్ర సంపదను అమూల్ సంస్థకి ధారాదత్తం చేయడం దేనికని ప్రశ్నించారు. మన పాలకులకు స్వాభిమానం లేదని, ఏపీలోని సహకార వ్యవస్థలను నిర్వీర్యం చేసి అమూల్ కోసం పాటుపడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ పేరును అమూల్ ప్రదేశ్ గా మార్చేశారని ఎద్దేవా చేశారు. సంగం డెయిరీలో గత 25 ఏళ్లల్లో రూ. 225 కోట్లు రైతులకు బోనస్గా ఇచ్చామన్నారు.
ఈ ప్రభుత్వానికి ప్రతిదీ దందానే అని ఆరోపించిన నరేంద్ర, సంగం, విజయ డెయిరీలంటే నచ్చక పోవచ్చుగానీ, వైసీపీ నేతల చేతుల్లో ఉన్న విశాఖ డెయిరీని కూడా నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. గతంలో విశాఖ డెయిరీ ఐదు జిల్లాల్లో పాల సేకరణ చేసేవారని.. కానీ ఇప్పుడు విశాఖ డెయిరీ మూడు జిల్లాలకే పరిమితం అయిందని పేర్కొన్నారు.
టార్గెట్ చేయడంలో ఈ ప్రభుత్వాన్ని మించిన వాళ్లు లేరని, కలిసొచ్చే డెయిరీలతో కలిసి పోరాడతామని అన్నారు. ప్రభుత్వాలు పరిపాలన చేయాలే కానీ.. పాల వ్యాపారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా అమూల్ సొంతంగా రమ్మనండి చూద్దాం.. ఎంత వరకు రైతులకు మేలు చేయగలరో చూద్దామని సవాలు విసిరారు. ఏపీ ప్రభుత్వం వాళ్లకు పాలు పోయండి.. వీళ్లకు పోయొద్దు అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు.
చేయూత స్కీమ్ ద్వారా డబ్బులిస్తూ.. అమూల్ సంస్థకే పాలు పోయాలని ఒత్తిడి తెస్తున్నారన్న నరేంద్ర, అమూల్ సంస్థకిచ్చే సహకారం తమకు అందచేస్తే.. అమూల్ కంటే రూ. 30 అధికంగా ఇస్తామని సవాలు విసిరారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో వేలాది కుటుంబాలు దెబ్బ తినే ప్రమాదం ఉందన్నారు.
అమూల్ తో పోటీ పెరగడంతో రాష్ట్రంలో అతిపెద్ద డెయిరీల్లో ఒకటైన సంగం డెయిరీ ఛైర్మన్ ఇలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం సహజమే అనిపించవచ్చు. కానీ.. అమూల్కు ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు తమకు కల్పిస్తే.. రూ.30 ఎక్కువ లీటరుకు ఇవ్వగలమని చెప్పడం మాత్రం విస్మరించదగినది కాదు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: PRAKASAM DIST ; TDP











