మొన్నటివరకు పంచాయతీ ఎన్నికలకు సహకరించేది లేదని, తమ ప్రాణాలు కాపాడుకోడానికి మాత్రమే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నామని చెబుతూ ఎన్నికలసంఘంతో డైరెక్ట్ వార్ కు దిగిన ఉద్యోగ సంఘాల మధ్య తాజాగా విభేదాలు తలెత్తాయి. ఒక సంఘంపై మరో సంఘం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనుంచి ఉద్యోగసంఘాలు ఇంకా పూర్తిగా బయటపడని పరిస్థితుల్లో సంఘాల మధ్య విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ విభేదాల వెనుక ఎవరున్నారనే అంశంపైనా పలు అనుమానాలు తలెత్తున్నాయి.
విబేధాలు ఇలా..
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డిపై ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధవారం జేఏసీ సమావేశంలో విమర్శలు చేశారు. వెంకట్రామిరెడ్డి సచివాలయంలో ప్రవర్తించే విధానం సరిగ్గా లేదని, ఇతర సంఘాలకు ఇచ్చే గౌరవం సరిగా లేదని వ్యాఖ్యానించారు. కింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడే తీరుకూడా సరిగ్గాలేదని, అన్ని విషయాల్లోనూ అనవసరమై న జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. అయితే దీనిపై వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల సచివాలయ గోడలకు పోస్టర్లు అంటించే యత్నాన్ని తాము అడ్డుకున్నామని, తాను డైరీలు పంచనీయకుండా అడ్డుకున్నట్టు బొప్పరాజు అప్పుడే అధికారులకు ఫిర్యాదుచేశాడని, తాజాగా బొప్పరాజు ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టుతో తీర్పు ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో తనను బలి చేసేందుకు బొప్పరాజు ఈ కుట్ర చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఎవరికివారు ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేవారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం మెప్పుకోసం బొప్పరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దీనిపై బొప్పరాజు బదులిస్తూ.. వెంకట్రామిరెడ్డిపై అన్ని సంఘాలు, ఆయన సంఘంలోని వారుకూడా వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన తన ధోరణి మార్చుకోవాలని చెప్పినా వినే పరిస్థితుల్లో లేరని, చివరికి సీఎం జగన్ చెప్పినా వినే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. ఇది కేవలం క్యాలెండర్లు, డైరీల గొడవ కాదని అన్నారు.
Must Read ;- వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?
ఉద్యోగుల్లో భిన్నస్పందన..
ఇక పంచాయతీ ఎన్నికల విషయంలో కొన్ని ఉద్యోగసంఘాలు వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగుల్లోనే మిశ్రమస్పందన వ్యక్తమైంది. అయితే విభేధించే ధైర్యం లేకపోవడంతో మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి కనిపించిందని వార్తలూ వచ్చాయి. సంఘాల వ్యవహారశైలి, చేస్తున్న ప్రకటనలపై ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత ఏర్పడిందని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగసంఘాలు.. గతంతో కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పట్టుబట్టిన సందర్భంలో ఎందుకు మాట్లాడలేదన్న వాదనా తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఏది చెప్తే ఉద్యోగసంఘాలు అటువైపే మొగ్గుచూపుతున్నాయన్న విమర్శలు ఉన్న తరుణంలో ఇక సుప్రీంకోర్టు చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఉద్యోగసంఘాలు పూర్తి డిఫెన్స్ లో పడ్డాయని చెప్పవచ్చు. ఇది ఉద్యోగసంఘాల నేతలపైనా ప్రభావం చూపించింది. అదే సమయంలో సంఘాల నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, సంఘాలకు ఇబ్బందికరంగా మారాయి. దీన్ని చక్కదిద్దేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యల్లో అర్థం అదేనా..
ఓ టీవీఛానెల్ ఏర్పాటుచేసిన చర్చలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు సంఘాలకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టే తనపై నిందలు వేస్తున్నారన్నారు. అంటే సుప్రీంతీర్పు వచ్చినతరువాత సంఘాల మధ్య జరుగుతున్న చర్యలు, ఎదురుకానున్న పరిణామాలపై ముందుగానే సమాచారం ఉందనే చర్చ మొదలైంది. పంచాయతీ ఎన్నికలు వద్దని చెబుతున్న ఉద్యోగసంఘాల వెనుక ప్రభుత్వం ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. ఆ ప్రభావం ప్రభుత్వంపై పడకుండా విభేదాలకు కొందరు కీలకవ్యక్తులు పావులు కదిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పలు ఉద్యోగసంఘాలతో గతంలో చోటుచేసుకున్న విభేదాలను తెరపైకి తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉద్యోగుల హక్కులు, వేతనాల పెంపు, పీఆర్సీల విషయంపై ప్రశ్నించడం మానేశారని విమర్శలు ఎదుర్కొంటున్న కొన్ని ఉద్యోగసంఘాలు తాజా పరిణామాలతో వాటి విలువను మరింత దిగజార్చుకున్నాయన్న చర్చ జరుగుతోంది.
Also Read ‘;- సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?
అవసరమైనప్పుడు విభేదాలు.. విచ్ఛిన్నం..
ప్రభుత్వం లేదా కీలక వ్యక్తుల సపోర్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వ్యవహరించే వారు ఎవరైనా.. తరువాత పరిణామాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా పోరాడాల్సిందేనని చరిత్రలో అనేక సంఘటనలు చెబుతున్నాయి. ఇప్పుడు జరిగింది కూడా అదేనన్న చర్చ నడుస్తోంది. ఏ వ్యూహంతో అయితే ప్రభుత్వం లేదా వ్యక్తులు ముందుకు నెట్టారో.. అదే వ్యూహాన్ని రివర్స్ లో అమలుచేయడం జరిగిందని చెబుతున్నారు. గతంలో 2019లో వేతన సవరణ, 3విడతల డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు తదితర అంశాలపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెబుతూ.. ఇందుకు నిరసనగా ఆందోళలకు పిలుపునిచ్చింది ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలోని జేఏసీ. ఈ సంఘానికి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ ఆందోళనల్లో తాము పాల్గొనడం లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనతి కాలంలోనే 27శాతం మధ్యంతర భృతి ఇచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికే వేతనాలు పెంచిందని, ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఎన్టీఓల సంఘం ఎలా ఆందోళన చేస్తుందని విమర్శించారు. అయిత బొప్పరాజు వ్యాఖ్యల మీద ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తరువాతి కాలంలో ఆ ఆందోళనలు సద్దుమణిగాయి. గతంలోనూ అమరావతికి ఉద్యోగుల తరలింపు, ఏపీ తెలంగాణ మధ్య ఉద్యోగుల పంపకాల విధానంలో లోపాల కారణంగా కొందరు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై పోరాడే విషయంలోనూ విభేధాలు తలెత్తాయి. తాజాగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కి, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజుకి మధ్య విభేదాలు తలెత్తాయి.
చంద్రబాబుని వ్యతిరేకించిన సంఘాలే..
ఈ వివాదంపై ఉద్యోగుల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం పరస్పర వివాదాలకు దిగుతున్న ఉద్యోగసంఘాల్లో చాలావరకు గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారి నాయకత్వంలో ఉన్నవేనన్న చర్చ నడుస్తోంది. సదరు నాయకులు వైసీపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారని, అలాంటి ఇప్పుడు వారి మధ్య విభేదాలు సహజంగా తలెత్తినవి కాదనే చర్చ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల వివాదంలో ప్రభుత్వం, ఉద్యోగసంఘాల పట్ల ప్రజల్లో చులకన భావం పెరిగిందని, దీంతో ఆ నింద వేసి వివాదం లేవనెత్తి విషయం పక్కదారి పట్టించవచ్చనే ఆలోచన కూడా ఉందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంమీద ఈ వివాదాలు వల్ల ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం ఎలా చేస్తాయన్న సందేహాలూ ఉద్యోగుల్లో తలెత్తుతున్నాయి.
Also Read ;- ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!











