తెలంగాణలో కొండా దంపతులు తెలియని వారుండరు. వరంగల్ ఓ సమయంలో వారు వస్తున్నారంటే అందరిలో భయం ఉండేది. వైయస్ హయాంలో వారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగి పోయింది. తెలంగాణ ఉద్యమంలోనూ కొండా సురేఖ, మురళి దంపతులు క్రియాశీలకంగా వ్యవహరించారు. జగన్ వరంగల్ పర్యటనకు వస్తున్నారన్న వార్తలతో వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలంగాణ వాదులు జగన్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఏకంగా వారిపై రాళ్ళదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె పేరు తెలంగాణ ఉద్యమంలో మార్మోగింది. ఇక ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరినా పెద్దగా ప్రాధాన్యం లేదన్న సాకుతో ఆ పార్టీని వీడారు ఈ దంపతులు. ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనేది కనిపిస్తూనే ఉంది.
బీజేపీలో చేరుతారన్న ప్రచారం..
తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇద్దరు నేతలు ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఇక రాష్ట్రంలో బలపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ కొండా దంపతులను తమ పార్టీలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని టాక్ వచ్చింది. వారితో ఇప్పటికే మంతనాలు జరిగాయని.. అయితే వారి నుండి ఎలాంటి స్పందన రాకపోయినా చర్చలు సానుకూలంగా సాగాయని చెబుతున్నారు బీజేపీ నేతలు. నేడు కాకపోయిన రేపైనా వారు పార్టీలో చేరడం ఖాయం అంటూ బీజేపీలో చర్చ నడుస్తోంది. వారు బీజేపీలో చేరితే వరంగల్ లో పార్టీ వేగంగా బలపడుతుందని.. జిల్లా మొత్తాన్ని వారు ప్రభావితం చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
Must Read ;- ఉత్తర తెలంగాణలో పట్టుకు బీజేపీ ప్లాన్.. వరంగల్పై దృష్టి
కాంగ్రెస్లో కీలక బాధ్యతలు..
బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. కొండా దంపతులను మళ్ళీ యాక్టీవ్ పాలిటిక్స్ లోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం వారిని నిన్న స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మణిక్కం ఠాకూర్ పిలిపించుకుని మాట్లాడారు. అధ్యక్ష పదవికి అభిప్రాయ సేకరణ కు వారు వచ్చిన సమయంలో వారితో ప్రత్యేకంగా ఆయన సంప్రదింపులు జరిపారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశాలు ఉండటంతో వారికి ఆ ఎన్నికల బాధ్యతను కట్టబెట్టినట్టు తెలుస్తోంది. స్వయంగా మణిక్కం ఠాకూరే బాధ్యతలు అప్పజెప్పడంతో వారు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
వరంగల్ లో అభివృద్ది కార్యక్రమాలతో టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్తుంటే బీజేపీ కేంద్రం ఇచ్చే నిధులను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు తెలంగాణలో బలంగా ఎన్నికల్లో పోరాడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రావాలంటే కొండా దంపతుల లాంటి బలమైన నేతల సహకారం తీసుకోవడం తప్పని సరైంది. దీంతో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లో త్రిముఖ పోటీ ఖయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు











